తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆయన అక్షరం తెలుగు పాటకు వెలుగు బాట

ఆయన అక్షరం తెలుగు పాటకు వెలుగు బాట(siri vennela sita rama sastri songs). వెండితెరమీద పాటల పందిరికి పెనవేసుకున్న బంధం. అక్షర తూణీరం. అక్షయ గాండీవం. ప్రాణనాడులను తట్టిలేపిన ప్రణవనాదం. మూగబోయిన మనసు తాకిన మధుర తుషారం. ఆ కలం నుంచి వెలువడిన ప్రతిపాటా సీతారామ శాస్త్రీయం. ఆయన మాటలు పేర్చే 'పదా'నిధి. సాహితీ సంపన్నుడు. పాటల సిరిసంపన్నుడు. ఆయనే సిరి వెన్నెల సీతారామశాస్త్రి. ఆయన గురించి ఈ ప్రత్యేక కథనం..

By

Published : Oct 10, 2021, 4:45 PM IST

sitaramasastri
సీతారామశాస్త్రి

విశాఖ జిల్లా అనకాపల్లి. తీయని బెల్లం ఘుమఘుమలతో మనసులాగే ఊరు. అదే అనకాపల్లి తీయటి పాటల గనికి, విజ్ఞాన ఖనికి జన్మనిచ్చింది. ఆ ఊరిలో 1955 మే 20న డాక్టర్ సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతుల గారాలపట్టిగా పుట్టిన బిడ్డ.. చెంబోలు సీతారామశాస్త్రి. ఆయన అనకాపల్లి, కాకినాడలో విద్యాభ్యాసం ముగిశాక.. విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎంఏ లో చేరారు. అప్పటికే సీతారామశాస్త్రి భరణి పేరుతో కవితలు రాసేవారు. అలా ఆయన రాసిన 'గంగావతరణం' కవిత విశ్వనాథ్‌ దృష్టికి వచ్చింది. సీతారామశాస్త్రి పాండిత్య ప్రతిభకు అప్రతిభులయ్యారు. విధాత తలచాడు కావచ్చు. కాశీనాథుని విశ్వనాథ్ సిరివెన్నెల తీశారు. సీతారాముని విద్వత్తుకు మెచ్చి పాటలన్నీ ఆయన చేతనే రాయించారు. అతడే పాటల మాంత్రికుడు సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ప్రసిద్ధుడయ్యాడు. సినీవినీలానికి వెన్నెలయ్యాడు. అలా తొలి పాట ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. క్షణాల్లో పాట రాసే సిరివెన్నెల ఈ గీత రచనకు వారంరోజుల వ్యవధి తీసుకున్నారంటే ఆ అక్షరమధనానికి పడిన తపన అర్ధం చేసుకోవచ్చు. సిరివెన్నెలలో వెన్నెల కురిపించారు. సామవేద సారాన్ని వివరించిన ఇదే సీతారామశాస్త్రి ఆ తర్వాత మరో సినిమాలో ఒక అల్లరి వల్లరి గీతం రాశారు.

కిక్​ ఎక్కించింది

1989 లో విడుదలైన శివ చిత్రం నాటి కుర్రకారుకు కిక్ ఎక్కించింది. అందులో బోటనీ పాఠమా, మ్యాటనీ ఆటనా? కుర్రకారుతో గంతులేయించిందీ సిరివెన్నెల సీతారాముడే. వెంకటేశ్‌, విజయశాంతి నటించిన ఓ సినిమా పేరు శత్రువే కానీ పాటలన్నీ మృదుల, మధురంగా ఉన్నాయి. రాజ్‌-కోటి మృదుమధుర స్వరాలలో ప్రవహించిన పాట.. 'పొద్దున్నే పుట్టిందీ చందమామ' చక్కని పాట. చిరంజీవి, విజయశాంతి నటించిన 'రౌడీ అల్లుడు' కోసం బప్పీ లహరి స్వరాలలో బాలు, చిత్ర మధురగానం చిలుకా క్షేమమా.

2000 సంవత్సరంలో వచ్చిన 'నువ్వేకావాలి' సినిమాలో సిరివెన్నెల రాసిన కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడంవెందుకో కదిలించే పాట. ఇదే చిత్రంలో ' అనగనగా ఆకాశం ఉంది పాట యువహృదయాలకు గిలిగింత. చక్కలిగింత. నాటి తరమైనా, నేటి తరమైనా...మేటిపాటలిచ్చిన సిరివెన్నెల తనకు తానే సాటి. తరాలను అధిగమించిన అక్షర మాంత్రికుడు. గిలిగింతల గీతాలిచ్చినా, పెద్ద హీరోలకీ పాటలిచ్చారు. పడుచు హీరోలకూ ప్రేమ మంత్రపుష్పాలు రాశారు. మనసంతా నువ్వే చిత్రంలో అందమైన బాల్యానికి అమూల్య ఆవిష్కరణ తూనీగా తూనీగా పాట. ఆనందం సినిమాలో హీరో ఆకాశ్, హీరోయిన్ రేఖ అభినయించిన తెరిచినా, కనులు మూసినా కలలు ఆగలేదా గీతం అద్భుత అభివ్యక్తి.

అన్యాయాలను ఎదిరించే నలుగురు యువకుల కథ యువసేన. ఇందులో హీరో భరత్, హీరోయిన్ గోపిక అభినయించిన మల్లీశ్వరివే.. గీతం అద్భుతం. కేరళవెళ్లో, కోనసీమ వెళ్లో పాప్ గీతం పాడుకున్నట్లుంది. భావ గాంభీర్యత, శబ్ద గాఢత అద్ది..అక్షరాలతో పదక్రీడలు సాగించే లిటరరీ స్పోర్ట్స్ పర్సన్ సిరివెన్నెల.

సినీరంగానికి వచ్చినప్పుడు

సిరివెన్నెల సీతారామశా స్త్రి సినీ రంగానికి వచ్చినప్పుడు .. సినీరంగంలో ఆత్రేయ, సినారె, వేటూరి పాటలు రాస్తున్నారు. ఒక కొత్త పాట వస్తే కొత్తగానే ఉండాలి. హత్తుకునేలా అన్పించాలి. ఆత్రేయ, వేటూరి, సినారెలా ఫలానా పాటలే సిరివెన్నెల అద్భుతంగా రాయగలరు అనే ముద్ర పడలేదు. అక్షర కృషీవలుడు సిరివెన్నెల సందర్భోచితంగా నేపథ్యాన్ని, ప్రత్యేక సందర్భాన్ని అధ్యయనం చేశాక పాటరాసేవారు. ఆయా పారిభాషిక పదాలతో పరకాయప్రవేశం చేసినట్లు రాశారు.

1988లో వచ్చిన 'కళ్లు' సినిమాలో ' తెల్లారింది లెగండోయ్' జాతికి మేల్కొలుపు గీతం. మనం మనం కలిస్తేనే జనం. మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే. చొరవగా వెళితేనే ఫలితం అని చాటుతున్న గీతం అంకురం చిత్రంలో రేవతి అభినయించిన పాట. ఆదిత్య -369లో జాణవులే పాట ఒక సొంపైన పాట. అదే ఏడాది విడుదలైన క్షణక్షణంలో .. అందనంత ఎత్తారా?.. తారాతీరం సంగతేంటొ చూద్దాంరా.. పాట సిరివెన్నెల సాహితీ విద్వత్తుకు దర్పణం.

సిరివెన్నెల కలం అదను చూసి పదునుగా, హృద్యంగా రాసిన తాత్విక గీతం చక్రం చిత్రంలో 'జగమంత కుటుంబం నాది..' పాటల్లో సిరివెన్నెల చేసిన ప్రయోగాలు అద్భుతంగా, ఊహకందనివిగా ఉంటాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన అంతం చిత్రంలో గుండెల్లో దడదడలాడే ..అనే గీతం ఇందుకు నిదర్శనం.

అత్యధిక ప్రేక్షకాదరణ

1996 లో విడుదలైన క్రిమినల్‌ చిత్రంలో తెలుసా..మనసా అనే పాట అత్యధిక ప్రేక్షకాదరణ పొందింది. అనంతమైన ప్రేమలో ఐక్యం కావటానికి తరిమిన ఆరు కాలాలు. ఏడులోకాలుచేరలేని ఒడిలో అనటం ఊహకందని భావన. ..ఓ మామూలు గీతంలో అర్ధవంతమైన మాటలు ఇమడ్చటం సిరివెన్నెలకే చెల్లింది. అదే ఏడాది పవిత్రబంధంలో సిరివెన్నెల రాసిన అపురూపమైనదమ్మ ఆడజన్మపాట అలరించింది.

చరిత్రలోనే అద్భుతాలు

సిరివెన్నెల చిత్రగీతాలు తెలుగు సినీ చరిత్రలోనే అద్భుతాలు. సీతారామశాస్త్రి నిజానికి 1984లో జననీ జన్మభూమి సినిమాకు పాటలు రాసినా గుర్తింపు రాలేదు. కానీ విశ్వనాథ్ సినిమా ఆయన జీవన గమనాన్నే మార్చివేసింది. ఆ తర్వాత తెలుగు సినిమా పాట గమనాన్ని సిరివెన్నెల మార్చేశారు.

1992లో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి నాయకా, నాయకిగా నటించిన ఆపద్బాంధవుడు లో సిరివెన్నెల గీతం ఒక పరవశం.

1992లో స్వాతికిరణంలో సిరివెన్నెల రాసిన ఆణిముత్యం 'సీతమ్మ అందాలు.. రఘరామయ్య గోత్రాలు' పాట అక్షర కరవాలం. 1990లో పలకరించిన 'అల్లుడు గారు' సినిమాలో జేసుదాసు, చిత్ర ఆలపించిన ముద్దబంతి పువ్వులో గీతం ఓ మనసొంపైన గీతం.

అక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ తదితరులు నటించిన సీతారామరాజు సినిమా అన్నదమ్ముల అనుబంధాల కథ. కీరవాణి బాణీలలో 'ఛాంగురే ..ఛాంగురే ' అద్భుత గీతం. అక్షర హరివిల్లు..పరిమళాల విరిజల్లు. జీవన సరిగమలకు అద్దిన మధురిమలు ఆయన అక్షరాలు. ఆనందం సినిమాలో కనులు తెరిచినా..కలలు మూసినా..కనులు ఆగునా.. పదేపదే వినాలనిపించే గీతం.

మహేశ్‌ బాబు, సోనాలీ బెంద్రే నటించిన మురారిలో 'అలనాటి రామచంద్రుడు' గీతం సిరివెన్నెలకు ఎనలేని ఖ్యాతిని తెచ్చింది. ప్రతి ఇంటా పెళ్లి పందిరిలో ఆ పాటే మోగుతోంది.

11నంది పురస్కారాలు

సిరివెన్నెల తెలుగు పాటను సుసంపన్నం చేశారు. మూడు వేలకు పైగా పాటలు రాశారు. ఆదిబిక్షువును ఏమీ కోరలేదు. కానీ ఆ పరమశివుడు మురిసిపోయి 11 నంది పురస్కారాలు పంపించారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

ఇదీ చూడండి: చిరునవ్వుకు చిరునామా మురళీమోహనం

ABOUT THE AUTHOR

...view details