2015 జులై 10.. 'బాహుబలి' సిరీస్లోని తొలి భాగం విడుదల.. అప్పటివరకు ప్రభాస్ అంటే టాలీవుడ్ నటుడు.. ఆరడుగుల అందగాడు.. మంచి కటౌట్ ఉన్న హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు అని మాత్రమే తెలుసు.. కానీ 'బాహుబలి' విడుదలై, కొద్ది రోజులైన తర్వాత అసలు ప్రభాస్ ఎవరు? అంటూ పలు దేశాల్లో అతడి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. అదే సాధారణ నటుడిని కాస్త పాన్ ఇండియా స్టార్ను చేసింది. ఆ తర్వాత కాలంలో వచ్చిన 'బాహుబలి' పార్ట్ 2, 'సాహో' చిత్రాలు ప్రభాస్ స్థాయిని మరింత పెంచాయి.
ఒకప్పుడు ప్రభాస్ సినిమా అంటే కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం. కానీ ఇప్పుడు అతడి సినిమా ఓ సెన్సేషన్, అన్ని ఇండస్ట్రీలకు చాలా పెద్ద వార్త! ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్. ఆ నాలుగు కూడా వేటికవి వైవిధ్యమైన కథలతో తీస్తున్నారు. వాటిపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాల సంగతేంటి? అవి ఎప్పుడు విడుదలవుతాయి? లాంటి ఆసక్తికర అంశాలతో పాటు మరెన్నో విషయాలు మీకోసం.
రాధేశ్యామ్- రొమాంటిక్ సినిమా
యాక్షన్ చిత్రాలే కాకుండా రొమాన్స్లోనూ ప్రభాస్ సిద్ధహస్తుడే! గతంలో ఇతడు నటించిన 'వర్షం', 'డార్లింగ్'.. ఈ జానర్లోనివే. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత డార్లింగ్ చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రాధేశ్యామ్'.
1970ల నాట కథతో తెరకెక్కిస్తున్నారు. ఐరోపా నేపథ్యంగా సాగే ఈ కథను ఎక్కువగా ఇటలీ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. చాలాభాగం షూటింగ్ పూర్తయింది. పూజా హెగ్డే హీరోయిన్, రాధా కృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆదిపురుష్- మైథాలజీ
ప్రభాస్ నటిస్తున్న మైథాలజీ(పురాణం) సినిమా 'ఆదిపురుష్'. ఇందులో శ్రీరాముని పాత్రలో కనిపించనున్నారు. తన పాత్ర కోసం కసరత్తులు చేస్తున్న డార్లింగ్.. త్వరలో షూటింగ్లో పాల్గొనున్నారు. సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. సీతగా కృతిసనన్ను ఎంపిక చేశారని అంటున్నారు. కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఓం రౌత్ దర్శకుడు.