తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాక్సాఫీస్​పై ప్రభాస్ దండయాత్ర.. ఒక్కో సినిమా ఒక్కోలా

నాలుగు వైవిధ్య కథలతో సినిమాలు చేస్తున్న ప్రభాస్.. బాక్సాఫీసుపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. రానున్న రెండు మూడేళ్లలో థియేటర్లలలో విడుదల కానున్న ఈ చిత్రాలు.. వసూళ్ల సునామీతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించనున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ సినిమాల గురించే ఈ ప్రత్యేక కథనం.

By

Published : Dec 2, 2020, 5:12 PM IST

pan india star prabhas future line up with four ultimate movies
ప్రభాస్ సినిమాలు

2015 జులై 10.. 'బాహుబలి' సిరీస్​లోని తొలి భాగం​ విడుదల.. అప్పటివరకు ప్రభాస్​ అంటే టాలీవుడ్​​ నటుడు.. ఆరడుగుల అందగాడు.. మంచి కటౌట్ ఉన్న హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు అని మాత్రమే తెలుసు.. కానీ 'బాహుబలి' విడుదలై, కొద్ది రోజులైన తర్వాత అసలు ప్రభాస్ ఎవరు? అంటూ పలు దేశాల్లో అతడి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. అదే సాధారణ నటుడిని కాస్త పాన్ ఇండియా స్టార్​ను చేసింది. ఆ తర్వాత కాలంలో వచ్చిన 'బాహుబలి' పార్ట్ 2, 'సాహో' చిత్రాలు ప్రభాస్ స్థాయిని మరింత పెంచాయి.

ఒకప్పుడు ప్రభాస్​ సినిమా అంటే కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం. కానీ ఇప్పుడు అతడి సినిమా ఓ సెన్సేషన్, అన్ని ఇండస్ట్రీలకు చాలా పెద్ద వార్త! ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్. ఆ నాలుగు కూడా వేటికవి వైవిధ్యమైన కథలతో తీస్తున్నారు. వాటిపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాల సంగతేంటి? అవి ఎప్పుడు విడుదలవుతాయి? లాంటి ఆసక్తికర అంశాలతో పాటు మరెన్నో విషయాలు మీకోసం.

రాధేశ్యామ్- రొమాంటిక్ సినిమా

యాక్షన్​ చిత్రాలే కాకుండా రొమాన్స్​లోనూ ప్రభాస్ సిద్ధహస్తుడే! గతంలో ఇతడు నటించిన 'వర్షం', 'డార్లింగ్'.. ఈ జానర్​లోనివే. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత డార్లింగ్ చేస్తున్న రొమాంటిక్ ఎంటర్​టైనర్​ 'రాధేశ్యామ్'.

రాధేశ్యామ్​ పోస్టర్​లో ప్రభాస్-పూజా హెగ్డే

1970ల నాట కథతో తెరకెక్కిస్తున్నారు. ఐరోపా నేపథ్యంగా సాగే ఈ కథను ఎక్కువగా ఇటలీ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. చాలాభాగం షూటింగ్ పూర్తయింది. పూజా హెగ్డే హీరోయిన్​, రాధా కృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆదిపురుష్- మైథాలజీ

ప్రభాస్​ నటిస్తున్న మైథాలజీ(పురాణం) సినిమా 'ఆదిపురుష్'. ఇందులో శ్రీరాముని పాత్రలో కనిపించనున్నారు. తన పాత్ర కోసం కసరత్తులు చేస్తున్న డార్లింగ్.. త్వరలో షూటింగ్​లో పాల్గొనున్నారు. సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. సీతగా కృతిసనన్​ను ఎంపిక చేశారని అంటున్నారు. కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఓం రౌత్ దర్శకుడు.

ప్రభాస్ ఆదిపురుష్​
రాముడి గెటప్​లో ప్రభాస్(ఫ్యాన్స్ తయారు చేసిన ఫొటో)

'బాహుబలి' సిరీస్​తో ఇలాంటి కథలకు తాను సరిగ్గా సరిపోతానని నిరూపించిన ప్రభాస్.. ఈ సినిమాతోనూ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. 2022 ఆగస్టు 11న 'ఆదిపురుష్' విడుదల కానుంది.

నాగ్​ అశ్విన్​తో సైన్స్ ఫిక్షన్

'మహానటి' లాంటి అద్భుతమైన సినిమా తర్వాత దర్శకుడు నాగ్​ అశ్విన్​.. ప్రభాస్​ కోసం సైన్స్ ఫిక్షన్​ కథను సిద్ధం చేశారు. భవిష్యత్తులో జరిగే కల్పిత కథే ఈ చిత్రమని తెలుస్తోంది. నిర్మాణ సంస్థ ప్రకటన ప్రకారం ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కావాలి. 2022 వేసవికి దీనిని విడుదల చేయనున్నారు.

దర్శకుడు నాగ్​ అశ్విన్​తో ప్రభాస్

ఇప్పటివరకు యాక్షన్, రొమాంటిక్, మైథాలజీ సినిమాలు చేసిన ప్రభాస్.. తొలిసారి సైన్స్ ఫిక్షన్ చేస్తుండటం.. అందులో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్​ లాంటి ప్రముఖులు చేస్తుండం వల్ల ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి వాటిని అందుకుంటుందో లేదో చూడాలి.

సలార్- యాక్షన్ ఎంటర్​టైనర్

'కేజీఎఫ్'తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం 'కేజీఎఫ్ 2' చివరి దశ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్​తో యాక్షన్ ఎంటర్​టైనర్​ 'సలార్' తీయబోతున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్​ బుధవారం ప్రకటన చేసింది. రానున్న జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చెబుతూ ఫస్ట్​లుక్​నూ విడుదల చేసింది.

సలార్​ ఫస్ట్​లుక్​లో ప్రభాస్

ఈ పోస్టర్​లో మీసకట్టుతో కనిపించిన ప్రభాస్.. ఎడమ చేతి కింద తుపాకీ పట్టుకుని రాజసంగా కూర్చున్నారు. ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు అనేది ప్రస్తుతం వెల్లడించనప్పటికీ, త్వరలో దీని గురించి ప్రకటన చేసే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details