తెలంగాణ

telangana

By

Published : Jan 6, 2021, 5:39 PM IST

ETV Bharat / sitara

నటసార్వభౌముని విశ్వరూపం.. 'సీతారామ కళ్యాణం'

నటసార్వభౌమ నందమూరి తారక రామారావు రెండోసారి రావణుడి పాత్రలో మెరిసిన చిత్రం 'సీతారామ కళ్యాణం'. ఇందులో లంకాధీశుడిగా ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. అలాగే ఈ సినిమాతో తొలిసారి దర్శకుడిగా మారారు తారక రామారావు. ఇలాంటి ఎన్నో విశేషాలున్న ఈ చిత్రం విడుదలై 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.

NTR's Seetha Rama Kalyanam completes 60 years in Tollywood
నటసార్వభౌముని తొలి విశ్వరూపం.. 'సీతారామకళ్యాణం'

లంకాధీశుడు రావణుడిగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముని నట విశ్వరూపం..

ప్రతినాయక పాత్రల్లోని ధీరత్వాన్ని.. వీరత్వాన్ని కళ్లకు కట్టిన తేజోరూపం..

90ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో అపురూప చిత్రరాజం..

నందమూరి తారకరామారావు.. దర్శకుడిగా తెలుగుతెరపై చేసిన తొలిసంతకం..

శ్రీ సీతారామకళ్యాణం.. !

ఎన్టీఆర్ కెరీర్​లో అపూరుప చిత్రరాజంగా ఎన్నదగిన.. ఎన్నో వైవిధ్య చిత్రాలు తీయడానికి రిఫరెన్సుగా మారిన.. నందమూరి వారసుడు బాలకృష్ణకు అత్యంత ప్రీతిపాత్రమైన.. చిత్రం 'సీతారామకళ్యాణం'. ఆ సినిమా విడదలై 60ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం..

నందమూరి తారక రామారావు సినీరంగ ప్రవేశం చేసి.. అప్పటికి పుష్కర కాలమైంది. ఈ 12 ఏళ్లలోనే జానపద, పౌరాణిక పాత్రలెన్నింటిలోనో ఆయన మెప్పించారు. 'మాయాబజార్​'లో శ్రీకృష్ణ పాత్రతో ఆరాధ్యుడిగా మారిపోయారు. అంతకుముందే 'భూ కైలాస్' సినిమాలో రావణుడిగానూ మెప్పించారు. అయితే మరోసారి రావణ పాత్రధారిగా సినిమాలో నటించాలని ఎన్టీఆర్ మొదట అనుకోలేదు. అది ఎలా జరిగిందంటే..

అలా దర్శకుడిగా ఎన్టీఆర్.. !

తాను రాముడిగా.. ఎస్వీఆర్ రావణుడిగా.. కేవీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఎన్టీఆర్ సంకల్పించారు. దాదాపు సినిమా ఖాయమే అనుకుంటున్న తరుణంలో.. ఎన్టీఆర్ సన్నిహితులు ధనేకుల వెంకట కృష్ణ చౌదరి.. శివపురాణం.. తదితర పురాణ గ్రంథాల్లో.. రావణుడిలోని విశిష్టతను ఎలా వివరించారో తెలిపే పుస్తకాన్ని ఇచ్చారు. అది చదివాక ఎన్టీఆర్​కు రావణుడి పాత్రపై మక్కువ పెరిగింది. ఆ పాత్ర తానే వేసేందుకు సిద్ధమైపోయారు. కానీ ఎన్టీఆర్​ను.. కృష్ణుడి రూపంలో దేవుడిగా చూపించిన కేవీరెడ్డి.. రాక్షస పాత్రలో చూడలేనన్నారు. చివరకు ఎన్టీఆరే.. ఆ సినిమాను తెరకెక్కించారు. తాను దర్శకత్వం వహించినా.. తమ కుటుంబ ప్రొడక్షన్స్ నేషనల్ ఆర్ట్ట్స్ థియేటర్ యూనిట్ పేరుతోనే టైటిల్స్ వేయించారు.

నటసార్వభౌముని తొలి విశ్వరూపం.. 'సీతారామకళ్యాణం'

తారాగణం

శ్రీ రామునిగా అప్పుడు కొత్తగా వచ్చిన హరనాథ్, లక్ష్మణుడిగా శోభన్ బాబు నటించగా.. సీతగా అంతకుముందు 'రాణీ రత్న ప్రభ'లో ఓ నృత్య పాత్ర పోషించిన మణిని ఎన్నుకున్నారు. ఆమె.. ఎవరో కాదు. గీతాంజలిగా ఆ తర్వాత అనేక సినిమాల్లో కనిపించిన ప్రసిద్ధ నటి. ఇక రావణాసురుడి భార్యగా.. ఎన్టీఆర్ సరసన ప్రసిద్ధ కన్నడ నటి బి. సరోజాదేవి నటించారు. జనకుడిగా మిక్కిలినేని, విశ్వామిత్రుడిగా గుమ్మడి మెప్పించారు. అప్పటికే సినిమాలను చాలించి విశ్రాంతి తీసుకుంటున్న గాలిపెంచల నరసింహారావును ఒప్పించి.. సంగీత దర్శకుడిగా తీసుకొచ్చారు ఎన్టీఆర్. వెంపటి చినసత్యం నృత్యాలు సమకూర్చగా.. రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రహణం అందించారు. ఎన్ఏటీ బ్యానర్​లో ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు, పుండరీకాక్షయ్య నిర్మాణ బాధ్యతలు చూశారు.

చిత్రకథ

అలకాపురిని జయించి పుష్పక విమానంలో లంకకు వెడుతూ రావణ బ్రహ్మ ఈశ్వరుని దర్శనం కోసం కైలాసం వెళ్లడం.. అక్కడ నంది చేత భంగపాటు.. కైలాసపర్వతాన్ని ఎత్తి.. రుద్రగానం చేసి పరమ శివుని మెప్పించడం.. దేవతల వినతితో శ్రీ మహాలక్ష్మి వేదవతిగా మారి భూలోకంలో పెరగడం.. నారదుని ప్రోద్భలంతో ఆమె స్వయంవరానికి రావణుడు వెళ్లడం.. రావణుని ద్వేషించి ఆమె భస్మం కావడం.. ఆ తర్వాత ఆమే.. బాలికగా జనకుని ఇంట సీతగా పెరగడం..అహల్య వృత్తాంతం, సీతా స్వయంవరం, రావణుడి భంగపాటు, రావణ ప్రేరణతో యుద్ధానికి వచ్చిన పరశురాముడు రాముడిని గుర్తించడం.. అవతార పరిసమాప్తి,. చివరలో సీతారామ కళ్యాణం.. ఇదీ సినిమా క్రమం..

నటసార్వభౌముని తొలి విశ్వరూపం.. 'సీతారామకళ్యాణం'

రావణబ్రహ్మ విశ్వరూపం

టైటిల్ 'సీతారామకళ్యాణం' అయినప్పటికీ.. సినిమా ఎక్కువుగా రావణునిదే ప్రధాన భూమిక.. రావణుడిగా ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. రావణుడు.. రాక్షసుడైనా బ్రహ్మ వంశజుడు.. శాస్త్రాలను ఔపాసన పట్టాడు. సకల కళాసారంగదుడు.. వీటన్నింటికీ ప్రాధాన్యం ఇచ్చారు. చక్రవర్తిగా రాజసాన్ని ఎలా పలికించారో.. మండోదరితో వీణానాదం చేస్తూ.. సరసాన్ని సమపాళ్లలో ఒలికించారు. ఈశ్వరుడి ఆరాధనను.. నారాయణుడి తిరస్కరణను సమరీతిలో చూపించారు.

నంది చేతిలో భంగపడి.. పరమశివుడు ప్రసన్నం కావడం లేదన్న ఉక్రోషంతో.. కైలాసాన్నే పెకిలించుకు తీసుకెళ్తాను అంటూ రావణుడు చేసే ప్రయత్నంలో ఎన్టీఆర్ నటన నభూతో..! 'జయత్వదభ్రవిభ్రమ భ్రమభుజంగ మస్సుర.. ధగధగ ధ్వినిర్గమత్ కరాళ ఫాల హవ్యవా..' అంటూ ఎన్టీఆర్ చూపిన నటనకు మది ఉప్పొంగిపోతుంది.

ఎన్టీఆర్ మొదటి సినిమా నుంచి ఆయన చిత్రాలకు పనిచేస్తున్న రెహమాన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఉత్తరాదికి చెందిన రవికాంత్ నగాయిచ్ అనే కుర్రాడికి ఛాయాగ్రహణ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటిలా గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో ట్రిక్ ఫొటోగ్రఫీ ఉపయోగించి.. నగాయిచ్ అద్భుత పనితనాన్ని ప్రదర్శించారు. రావణుడు కైలాసపర్వతాన్ని ఎత్తే సన్నివేశంలో పదితలలు కనిపించడం కోసం.. నగాయిచ్-ఎన్టీఆర్ తీవ్రంగా శ్రమించారు. అనుకున్న దృశ్యం రావడం కోసం.. ఎన్టీఆర్ దాదాపు 10 గంటల పాటు చేతులు చాచి నిశ్చలంగా పైకి చూస్తూ ఉండిపోయారు. యూనిట్ వాళ్లు ఎంత వారించినా ఎన్టీఆర్ వినలేదు. అంతసేపు కళ్లను ఫోకస్ చేసి నించున్న ఎన్టీఆర్ సీన్ పూర్తయ్యాక కళ్లు తిరిగి పడిపోయారు. ( ఈ మధ్య వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్​లో ఈ సన్నివేశాన్ని చూపించారు) శివానుగ్రహం కోసం కడుపులోని పేగులను పెళ్లగించి వాటితో వీణానాదం చేస్తూ ఎన్టీఆర్ తన మోములో పలికించిన భావాలను చూసి చిత్రసీమ దిగ్భ్రమ చెందింది. రౌద్రం, క్రోధం, ఆవేదన కలగలిసిన ఆ భావాన్ని ఎన్టీఆర్ మోములో చూసి అక్కినేని దిగ్భ్రాంతికి గురయ్యారట.. ! ఈ సన్నివేశం ఆయనను ఎంతో ప్రభావితం చేసింది. ఇంట్లో అద్దం ముందు కూర్చొని తాను కూడా ఆ ప్రయత్నం చేయగా ఆ ఎఫెక్టు మాత్రం ఆయనకే సొంతం అని ఆయన చెప్పడం గొప్ప విశేషం.

స్వయంవర ఘట్టాలు

ఈ సినిమాలో రెండు స్వయంవర ఘట్టాలు అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఎన్టీఆర్ ఏ స్థాయిలో ఆ పాత్రను ప్రేమించారో ఆ సన్నివేశాల్లో అర్థం అవుతుంది. మొదటిసారి వేదవతి స్వయంవరానికి వెళ్లినప్పుడు.. (ఆమె నీలమేఘశ్యాముడినే పెళ్లి చేసుకుంటానని చెప్పిందని) వన్నే ప్రధానమైతే.. నీలాకాశానికి కట్టరాదా.. నెమలి మెడకు ముడిపెట్టరాదా.. ? సముద్రంలోకి నెట్టరాదా..? అంటూ ఆమె తండ్రిని వ్యంగ్యంగా ప్రశ్నిస్తాడు.. రెండోసారి సీతాస్వయంవరానికి తనను ఆహ్వానించలేదని.. శివ భక్తుడిగా.. జంగమదేవరుడి వేషంలో అద్భుతమైన ఆలోచన.. ! శివద్రోహం.. ఈ కలాపం. అంటూ.. జంగమదేవరుడిగా ఎన్టీఆర్ ప్రవేశం.. ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శత్రుంజయుడైన శంకరుడికే.. తిరస్కారం.. మృత్యుంజయుడైన ముక్కంటికే అపచారం.. హరహరమహాదేవ.. శంభోశంకర అంటూ ఆయన చూపిన నటన.. అనన్యసామాన్యం. ఆ ఆహార్యంలో దుస్తులపై భేతాళుడి బొమ్మ, మధ్యలో శివలింగం.. దానిపైన లైట్​ను ఫోకస్ చేస్తూ.. కెమెరాను కాళ్ల నుంచి మొహం మీదకు తీసుకెళ్లడం ఆ రోజుల్లో కొత్త క్రియేటివిటీ..! ఇలా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

అన్నీ అద్భుతాలే

ఎన్టీఆర్ గంభీరమైన నటనతో పాటు.. సముద్రాల మాటలు, పాటలు.. ఘంటసాల, సుశీల గానం, సంగీతం, ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు ఇలా అన్ని విషయాల్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. సినిమా చివరిలో వచ్చే శ్రీ సీతారాముల కళ్యాణం చూతుమురారండీ.. పాట ఎంత పాపులర్ అయిందో చెప్పాల్సిన పనేముంది. అద్భుతమైన సంగీతానికి.. సుశీల గొంతు అంతే అద్భుతంగా కుదిరి.. ఆ పాటను చిరస్థాయిలో నిలబెట్టింది. అరవైఏళ్లైనా ఇప్పటికీ.. తెలుగువారి వివాహాల్లోనూ.. పెళ్లి వీడియోల్లోనూ.. ఆ పాట ఉండాల్సిందే..!

శివున్ని ప్రసన్నం చేసుకునే క్రమంలో రావణుడు పొట్ట చీల్చుకుని రుద్రగానం చేసే ఘట్టం కేవలం జనస్రుతులలోనే ఉంది. దానికి కవుల కల్పన కంటే అద్భుతంగా ఎన్టీఆర్ తెరకెక్కించారు. ఈ సన్నివేశంలో నేఫద్యానికి వీణా నాదం ఈమని శంకర శాస్త్రి రూపొందిస్తే, ఘంటసాల గానం, ఎన్టీఆర్ అభినయం ఓ చారిత్రక విశేషంగా నిలిచాయి. రావణుడి పాత్రే కాదు.. ఆయన భార్య అయిన మండోదరికీ చాలా ప్రాధాన్యం ఇచ్చారు సినిమాలో.. ! ఇక ఇందులో రాముడిగా ఎన్టీఆర్ కాకుండా మరెవరు? అనుకున్నారు.. నిర్మాత.. ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు. రావణుడి వేషం వేసినప్పటికీ.. రాముడి పాత్ర కూడా ఆయనే వేస్తారులే అనుకునేవారు. కానీ ఎన్టీఆర్ ఆలోచనలు వేరు. రాముడి పాత్ర కోసం.. ప్రశాంత వదనంతో ఉండే యువకుడి కోసం చూస్తున్నారాయన..! అలా పాండీబజారులోనే ఓ చెప్పుల దుకాణం వద్ద కనిపించిన హరనాథ్​ను చూసి.. రాముడి వేషానికి ఎంపికచేశారు. స్వయంగా ఎన్టీఆర్ నుదిటిన తిలకం దిద్ది.. మేకప్ టెస్ట్ చేయించారు. ఆ రోజుల్లో హీరోలుగా ఉన్న చాలా మందికి మేకప్ టెస్ట్ చేసినప్పటికీ హరనాథే ఎంపికయ్యారు. ఆ తర్వాత ఆయన అనేక సినిమాల్లో రాముడిగా.. కృష్ణుడిగా నటించారు.

అపురూప విజయం

జనవరి 6, 1961లో విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. రావణ బ్రహ్మలోని వివిధ కోణాలను అపూర్వ రీతిలో ఆవిష్కరించిన ఎన్టీఆర్​పై ప్రశంసల జల్లు కురిసింది. ఎన్టీఆర్​లో రావణుడిని చూడలేనంటూ.. దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న కేవీరెడ్డి.. ప్రివ్యూ చూసి ఎన్టీఆర్​ను అభినందించారు. ఎన్టీఆర్ గురువు కవి సమ్రాట్ విశ్వనాథ సత్య నారాయణ ఈ చిత్రం చూసి శిష్యుని ఆశీర్వదించడం, కంచి పీఠాధ్యక్షులు జగద్గురువు శ్రీ పరమాచార్య చంద్ర శేఖర్ సరస్వతి ఈ చిత్రం చూసి ఎన్టీఆర్​ను ప్రత్యేకంగా ఆశీర్వదించడం ప్రత్యేక విషయాలు. ప్రతినాయకుడైనా.. అతనిలోని విశిష్టత, అకుంఠిత భక్తిభావాన్ని ఇంత గొప్పగా చూపించొచ్చ అన్న విషయం నిరూపితమైంది.

నటసార్వభౌముని తొలి విశ్వరూపం.. 'సీతారామకళ్యాణం'

'సీతారామ కళ్యాణం'తో ఎన్టీఆర్​లోని నటవైభవం.. దర్శకత్వ ప్రతిభ శిఖర స్థాయిలో కనబడ్డాయి. ఒక పాత్రద్వారా ప్రేక్షకులను ఇంతటి స్పందనకు గురి చేయడం ఈ చిత్రంతోనే మొదలయ్యినట్లుగా చెప్పుకున్నారు. ఈ చిత్రం వచ్చిన రెండేళ్లకు.. 'లవకుశ' విడుదలైంది. ఎన్టీఆర్ తెలుగునాట.. ఇంటింటికీ.. ఇలవేల్పయ్యాడు..! అయితే ఆయన ప్రత్యేకమైన ప్రతినాయక పాత్రలు చేయడానికి బీజం వేసిందిమాత్రం రావణబ్రహ్మ వేషమే..! ఆ స్ఫూర్తితోనే ఆ తర్వాత 'శ్రీకృష్ణ పాండవీయం' లో దుర్యోధన వేషం వేశారు. ఆ తర్వాత.. మరో దశాబ్దానికి.. 'దాన వీర శూర కర్ణ..' చరిత్ర తిరగరాసింది. ఎన్టీఆర్ నటవారసుడు నందమూరి బాలకృష్ణకు కూడా ఎన్టీఆర్ సినిమాలలో కెల్లా.. 'సీతారామకళ్యాణం' అంటే ఎక్కువ ఇష్టం. ఈ సినిమా స్పూర్తితోనే తాను 'నర్తనశాల' ప్రారంభించానని ఆయన చెప్పుకున్నారు కూడా..!

ఇవీ చూడండి: రాఘవేంద్రరావు హీరోగా భరణి సినిమా.. అలా కుదిరింది!

ABOUT THE AUTHOR

...view details