తెలంగాణ

telangana

By

Published : Jan 11, 2020, 9:14 PM IST

ETV Bharat / sitara

'అది నా ఆలోచనే.. గ్యాప్​లో గొప్ప విషయం తెలుసుకున్నా'

'అల వైకుంఠపురములో'.. ఏ సినిమాకు రీమేక్​ కాదని చెప్పాడు హీరో అల్లు అర్జున్. రేపు థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో చిత్రవిశేషాలను పంచుకున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్​తో తనకున్న కెమిస్ట్రీ గురించి వివరించాడు.

'అది నా ఆలోచనే.. గ్యాప్​లో గొప్ప విషయం తెలుసుకున్నా'
హీరో అల్లు అర్జున్

స్టైల్‌తో అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో అల్లు అర్జున్‌. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఇతడు నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. పూజా హెగ్డే హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, రేపు(శనివారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి అల్లు అర్జున్‌ అనేక విషయాలను పంచుకున్నాడు.

హీరో అల్లు అర్జున్

గత చిత్రాల్లో మాదిరిగానే ఈ సినిమాలోనూ స్టైల్‌గా గ్లామర్‌గా కనిపిస్తున్నట్లున్నారు?

అందుకు కారణం నా హెయిర్ స్టైల్. ఇంత పొడవాటి జుట్టు ఇదివరకు పెంచలేదు. ఈ సినిమా చేసిన 8 నెలలు నేను హ్యాపీగా ఉన్నాను. బయటకు అదే కనిపిస్తుందనుకుంటాను.

'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్

'అల వైకుంఠపురములో' ఓ బాలీవుడ్‌ సినిమాను రీమేక్‌ అని టాక్‌ వినిపిస్తోంది?

'సోను కే టిటు కి స్వీటీ' అనేది గీతా ఆర్ట్స్‌లో రీమేక్ చేద్దామని అడిగారు. చాలామంది అది నాకోసమని అనుకున్నారు. అయితే అది నా కోసం కాదు. దాన్ని రీమేక్ చేస్తే బాగుంటుందా? అని నేను వ్యక్తిగతంగానూ ఆలోచించా. ఆ సమయంలో త్రివిక్రమ్ గారు, నేనూ కలిసి ఒక స్టోరీ అనుకున్నాం. రెండు స్టోరీల్లో మేమనుకున్నదే బెటర్ అనిపించింది. అందుకే ఆ సినిమా జోలికి వెళ్లకుండా ఈ కథతోనే ముందుకెళ్లాం.

సరదాగా సాగిపోయే సినిమా చేయాలని ఎందుకు అనుకున్నారు?

మా కాంబినేషన్‌లో వచ్చిన 'జులాయి'లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కువగా ఉంటే, 'సన్నాఫ్ సత్యమూర్తి'లో ఎమోషనల్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. మళ్లీ సినిమా చేస్తే, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్న సినిమా చేయాలని అప్పుడే ఇద్దరం అనుకున్నాం. అనుకోకుండా నా చివరి మూడు 'సరైనోడు', 'డీజే', 'నా పేరు సూర్య' కొంచెం సీరియస్ సినిమాలు. నాక్కూడా 'రేసుగుర్రం' లాంటి చిత్రం చేయాలని ఎప్పటి నుంచో ఉంది. త్రివిక్రమ్ గారు 'అరవింద సమేత' లాంటి సీరియస్ సినిమా తర్వాత ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం చేయాలనుకున్నారు. అలా 'అల వైకుంఠపురములో' కథను ఆయన నాకెప్పుడో చెప్పారు. అది బాగుంటుందని అనుకున్నాక, దాన్ని డెవలప్ చేశారు. ఇప్పటి వరకూ నేను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎప్పుడూ చేయలేదు. ఇందులోనే హీరోయిజం, యాక్షన్ బాగా కుదిరాయి. అలాగే పాటలు కూడా.

'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్-పూజా హెగ్డే

త్రివిక్రమ్‌తో మూడు సినిమాలు చేశారు. ఆయనతో పనిచేయడం ఎలా ఉంది?

నా చివరి 10 సినిమాల్లో 3.. త్రివిక్రమ్ గారితోనే చేశాను. ఆయనేమో నేను 10 సినిమాలు చేస్తే, వాటిలో 3 మీతోనే చేశాను అని ఆయనంటున్నారు. కొన్నిసార్లు ఒక హీరోకు, ఒక డైరెక్టర్‌కు ఆలోచనలు కలుస్తాయి. గతంలో చిరంజీవి గారికి, కోదండరామిరెడ్డి గారికి బాగా కుదిరింది. వాళ్లిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. అలా కలిసి చాలా సినిమాలు చేయగల కెమిస్ట్రీ త్రివిక్రమ్ గారికీ, నాకూ మధ్య ఉంది. మేం ఒకళ్లనొకళ్లం బాగా అర్థం చేసుకుంటాం. ఆయనతో సౌకర్యంగా ఉంటుంది.

ఈ సినిమాకు ముందు తీసుకున్న గ్యాప్‌లో ఏం నేర్చుకున్నారు?

ఒక మనిషి వృత్తి జీవితంలో గ్యాప్ తీసుకున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకుంటాడు. అవి చిన్న చిన్న సింపుల్ విషయాలే కావచ్చు. కానీ, గొప్ప విషయాలు తెలుసుకుంటాడు. ఇక లైఫ్‌లో గ్యాప్ తీసుకోకూడదనే గొప్ప విషయం తెలుసుకున్నాను. ఒకటిన్నర సంవత్సరం సినిమా లేకపోయినా నా విషయంలో ఫ్యాన్స్ చూపించిన అభిమానం, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను.

'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్-పూజా హెగ్డే

ఇందులో మీ క్యారెక్టర్ ఏమిటి?

వైకుంఠపురం అనే ఇల్లుంది. ఆ ఇంట్లో చాలామంది ఉన్నారు. వాళ్ల మధ్య జరిగిన సంఘటనలే ఈ సినిమా. ఇందులో నేను ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగా చేశాను. పూజా హెగ్డే బాస్‌గా ఉన్న ఆఫీసులో పనిచేస్తుంటాను. నాకూ, మా నాన్నకూ పడదు. నా తండ్రి పాత్రలో మురళీశర్మ చేశారు. వైకుంఠపురం అనే ఒక పెద్ద ఇంటికీ, మాకూ ఉన్న కనెక్షన్ ఏమిటనేది సినిమాలో చూడాలి.

సంక్రాంతి పోటీపై మీ అభిప్రాయమేమిటి?

సంక్రాంతి పోటీ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎన్నో కోట్లు పెట్టి సినిమా తీసే ఏ ప్రొడ్యూసర్ అయినా సోలో రిలీజే కోరుకుంటాడు. అలా వస్తే చాలా డబ్బులొస్తాయ్. సంక్రాంతికి రెండు మూడు సినిమాలైనా ఎందుకొస్తాయంటే, మిగతా రోజుల్లో సోలో రిలీజ్‌కు వచ్చిన దానికంటే 20 నుంచి 30 శాతం ఎక్కువ డబ్బులు వస్తాయి. పండగకు విడుదలైన అన్నీ సినిమాలు ఆడాలని కోరుకుంటున్నా.

'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్

యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న 'సామజవరగమన' పాటను మూడు నెలల ముందే విడుదల చేయాలన్న ఆలోచన ఎవరిది?

అది నా ఆలోచన. అంత ముందుగా సాంగ్ రిలీజ్ చేద్దామని నేననగానే అందరూ భయపడ్డారు. హిందీ సినిమాల్లో అందరూ దాదాపు 4 నెలల ముందే సాంగ్స్ రిలీజ్ చేస్తుంటారు. మనకూ ఆ కల్చర్ వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఒక పాట జనాల్లోకి బాగా వెళ్లడానికి కనీసం రెండు మూడు నెలలు పడుతుంది. అందుకే అంత ముందుగా ఆ సాంగ్స్ విడుదల చేశాం. అందుకే అవి అంత బాగా హిట్టయ్యాయి. 'సామజవరగమన'కు సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనే పేరు వచ్చింది.

మలయాళంలోనూ క్రేజ్ తెచ్చుకోవడాన్ని ఎలా ఫీలవుతున్నారు?

అద్భుతంగా ఫీలవుతున్నా. అక్కడ నాకు మామూలు గౌరవం లభించలేదు. ఇప్పటివరకూ ఏ తెలుగు హీరోకూ దక్కని గౌరవం నాకు దక్కింది.

అల్లు అర్జున్-పూజా హెగ్డే

మీ పిల్లల్ని షూటింగ్‌కు తీసుకెళ్తుంటారా?

అప్పుడప్పుడు తీసుకెళ్తుంటాను. అందుకూ ఓ కారణం ఉంది. ఇదివరకు జనరేషన్ వాళ్లు పిల్లల్ని షూటింగ్‌కు తీసుకెళ్తే పాడైపోతారనే ఆలోచనతో ఉండేవాళ్లు. పిల్లలకు సినిమాలు చూపించేవాళ్లు కాదు. వాస్తవానికి దూరంగా పెట్టేవాళ్లు. నాన్న ఏం చేస్తుంటాడనే విషయం నా పిల్లలకు తెలియాలి. నా లైఫ్ ఎలా ఉంటుందో తెలియాలి. అందుకే వాళ్లను తీసుకెళ్తుంటాను.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details