తెలంగాణ

telangana

ఆయన గొంతు వింటే థియేటర్లో పూనకాలే!

By

Published : Jul 27, 2020, 6:06 AM IST

Updated : Jul 27, 2020, 9:49 AM IST

ప్రముఖ సినీ నటుడు సాయికుమార్​ నేడు 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.

sai kumar
ఖంగుమనే గొంతే ఆయన అస్త్రం

ఖంగుమనే గొంతే ఆయన ఆయుధం. ఆ గొంతుతోనే సినీ సామ్రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు. కొంతమంది స్టార్ హీరోలకు గళమిచ్చారు. వారిని విజయపథంలోకి నడిపించారు. అక్కడితో ఆగలేదు... తానే స్వయంగా రంగంలోకి దిగి నటనతో ప్రేక్షకుల్లో జోష్ నింపారు. పోలీస్ డ్రెస్ వేసి లాఠీ చేత పట్టి...పేజీలకు పేజీల డైలాగులు నాన్ స్టాప్​గా చెప్తూ థియేటర్లు దద్దరిల్లేలా చేశారు. ఒక్క సినిమా ద్వారానే కాకుండా టెలివిజన్ స్క్రీన్ లపై కూడా దూకి ప్రతి ఇంటికి వెళ్లి కావాల్సినంత వినోదాన్ని పంచారు.

టీవీ హోస్ట్​గా ఆయన చేసిన షోలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం...అనుబంధాలు, ఆత్మీయతలతో అల్లుకున్న అందమైన కుటుంబాలను టీవీ తెరపైకి రప్పించి హల్​చల్ చేస్తున్నారు. మనం పేరుతో ఆయన ఈటీవీలో ఆవిష్కరిస్తున్న కుటుంబ కదంబం సర్వులకూ అంతులేని ఆహ్లాదాన్ని పంచుతోంది. ఆయనే... మనలో ఒకరయిన మన సాయి కుమార్. నేడు ఆయన 60వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..

కనిపించని నాలుగో సింహం

సాయి కుమార్ పేరు చెప్పగానే... కనిపించని నాలుగో సింహం పోలీస్... అన్న డైలాగ్ ప్రతి ప్రేక్షకుల గుండెల్లో ఫిరంగి మోగినట్లు మోగుతుంది.

1960 జులై 27న పుట్టిన సాయికుమార్ కుటుంబానికి సినీ నేపథ్యం ఉంది. తండ్రి పి..జె.శర్మ, తల్లి కృష్ణ జ్యోతి. తండ్రి తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో ప్రఖ్యాతి గాంచిన డబ్బింగ్ ఆర్టిస్ట్. తల్లి కృష్ణ జ్యోతి ఒకప్పుడు కన్నడ చిత్ర రంగంలో నటిగా సుప్రసిద్ధురాలు. కన్నడ కథానాయకుడు డాక్టర్ రాజకుమార్​తో పాటు అప్పటి అగ్రశ్రేణి హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న కళాకారిణి.

తల్లితండ్రులిద్దరూ సినీ రంగానికి చెందినవారే కావడం వల్ల రంగుల ప్రపంచంపై సాయికుమార్​కు ఆసక్తి కలిగింది. తండ్రి నుంచి వచ్చిన గంభీరమైన గళ వారసత్వం కూడా ఆయనకు పెద్ద మద్దతుగా నిలిచింది. బాలనటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన సాయికుమార్.. బాపు దర్శకత్వం వహించిన స్నేహం సినిమాలో రాజేంద్ర ప్రసాద్​తో పాటు కీలక పాత్ర పోషించారు. వైకల్యం ఉన్నా స్నేహం పంచే మనసుకు ప్రేమ తప్ప వైకల్యం లేదని నిరూపిస్తూ రూపొందిన ఈ చిత్రం కన్నీరు పెట్టిస్తుంది. ఆర్ద్రత నిండిన ఆరుద్ర పాటలు, సున్నితమైన గాయకుల గళం... సన్నివేశాల్ని అద్భుతంగా చిత్రీకరించిన బాపు దర్శకత్వ ప్రతిభ...ఈ చిత్ర విజయానికి కారణమయ్యాయి. బాపు డైరెక్షన్​లో మెరిసిన సాయికుమార్ అనతి కాలంలోనే మంచి నటుడిగా ఎదిగారు. డబ్బింగ్ కళాకారుడిగా సత్తా చాటుకున్నారు.

డాక్టర్ రాజశేఖర్, సుమన్ లకు డబ్బింగ్

డాక్టర్ రాజశేఖర్, సుమన్​లకు డబ్బింగ్ చెప్పారు సాయి కుమార్. ఆయన స్వరం డబ్బింగ్ కళాకారులకు ఎంతగానో సహకరించింది. సాయికుమార్ గొంతులో తెలుగు స్వచ్ఛంగా, స్పష్టంగా, వినసొంపుగా ఉంటుంది. ఓ పక్క డబ్బింగ్ చెప్తూనే తెర ముందుకు ఆర్టిస్ట్ గా విచ్చేశారు. 1996లో కన్నడ సినిమా పోలీస్ స్టోరీ సాయికుమార్ కెరీర్​కు మెచ్చు తునక. ఈ సినిమా అక్కడ విజయవంతం అవడమే కాకుండా... తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్బింగ్ అయి సూపర్ డూపర్ హిట్​ను సాధించింది. ఆ తర్వాత వరుసగా అనేక సినిమాలు సాయికుమార్ చెంతకు చేరాయి. కన్నడలో అగ్ని ఐపీఎస్, కుంకుమ భాగ్య, పోలీస్ స్టోరీ 2, లాకప్ డెత్, సర్కిల్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ జైల్, మనే మనే రామాయణ తదితర చిత్రాలు బాక్సాఫీస్ ని కొల్లగొట్టాయి.

కన్నడ సీమ అంటే సాయికుమార్​కు ప్రీతి

తన కెరీర్​కు ఊపు, ఉత్సాహాన్ని అందించిన కన్నడ సీమ అంటే తనకెంతో ఇష్టమని వీలు చిక్కినప్పుడల్లా సాయికుమార్ చెప్తూ ఉంటారు. పోలీస్ స్టోరీతో తనలోని ఆర్టిస్ట్ కి మంచి భవిష్యత్ దొరికిందని ఆయన అంటుంటారు. రంగ్ తరంగ్ సినిమా సాయి కుమార్ కెరీర్ లోని ది బెస్ట్ మూవీగా నిలిచింది. తెలుగులో సాయి కుమార్ విజయవంతమైన చిత్రాలు చేసారు. అంతఃపురం, స్నేహం, దేవుడు చేసిన పెళ్లి, అగ్ని పర్వతం, మేజర్ చంద్రకాంత్, కలికాలం, అమ్మ రాజీనామా, కర్తవ్యం, స్వర్ణముఖి, అంతఃపురం, ఏ.కె. ఫార్టీ సెవెన్, రౌడీ ఇన్స్పెక్టర్, ఖాకీ చొక్కా, కొడుకులు, సీమ సింహం, శ్లోకం, సామాన్యుడు, విజయదశమి, ఢీ అంటే ఢీ చిత్రాలు ఇందులో కొన్ని. ప్రస్థానం, ఊ కొడతారా... ఉలిక్కి పడతారా?, షిర్టీడీ సాయి, అయ్యారే, ఒక్కడినే, పవిత్ర, జగద్గురు ఆది శంకర, ఎవడు, పటాస్, పండుగ చేస్కో, భలే మంచి రోజు, సరైనోడు, సుప్రీం, చుట్టాలబ్బాయి, జనతా గారేజ్, మనలో ఒకడు, ఓం నమో వెంకటేశాయ, జై లవకుశ, రాజా డి గ్రేట్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, సుబ్రహ్మణ్యపురం...తదితర చిత్రాల్లోను నటించారు.

సినీ నటుడు సాయికుమార్​

నంది అవార్డులు

2006లో సామాన్యుడు చిత్రంలోని పాత్రకు ఉత్తమ విలన్​గా నంది అవార్డు అందుకున్నారు. 2010లో ప్రస్థానం చిత్రంలో ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు సాధించారు. సామాన్యుడు, ప్రస్థానం, రంగ్ తరంగ్ చిత్రాలలో నటనకు గాను ఫిలిం ఫేర్ అవార్డులు కైవసం చేసుకున్నారు. ప్రస్థానం సినిమాకు టీఎస్సార్-టీవీ 9 అవార్డును అందుకున్నారు. సాయి కుమార్ తనయుడు ఆది కూడా సినీ రంగంలో హీరో గా కొనసాగుతున్నారు.

Last Updated : Jul 27, 2020, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details