టెస్టు, టీ20 సిరీస్ సంప్రదాయాన్నే భారత్-ఇంగ్లాండ్ జట్లు కొనసాగిస్తున్నాయి. వాటి మాదిరిగానే.. వన్డే సిరీస్లోనూ ఆఖరి మ్యాచే సిరీస్ విజేతను తేల్చనుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో టీమ్ఇండియా విజయం సాధించగా.. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో ఇంగ్లాండ్ రికార్డు లక్ష్యాన్ని చేధించి జయభేరీ మోగించింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో గెలవాలని ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి.
వారిద్దరిపై వేటు!
రెండో మ్యాచ్లో భారత జట్టు విసిరిన 337 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ అలవోకగా చేధించింది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా బౌలింగ్లో బెయిర్స్టో, బెన్స్టోక్స్ విధ్వంసం సృష్టించారు. 10 ఓవర్లు వేసిన కుల్దీప్.. 84 పరుగులిచ్చి వన్డేల్లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్గా చెత్త రికార్డు నమోదు చేశాడు. 6 ఓవర్లు వేసిన కృనాల్ పాండ్యా ఓవర్కు 12 పరుగుల చొప్పున 72 రన్స్ సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడో మ్యాచ్లో వీరిద్దరి స్థానంలో యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెండో మ్యాచ్లో తొలి ఓవర్లలో నెమ్మదిగా ఆడిన భారత బ్యాట్స్మెన్.. తర్వాత జోరు పెంచి భారీ స్కోరు సాధించారు. గత కొన్ని రోజులుగా చివరి 15 ఓవర్లో భారత్ ఎక్కువగా పరుగులు చేస్తోంది. రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య చివరి ఓవర్లలో చెలరేగి ఆడుతుండటం జట్టుకు అదనపు బలంగా మారింది. ఆది నుంచే అటాకింగ్ గేమ్ ఆడుతున్న ఇంగ్లాండ్ అదే జోరుతో రెండో మ్యాచ్ను సొంతం చేసుకుంది. సెంచరీ చేయడం కన్నా జట్టు విజయమే తనకు ముఖ్యమని స్పష్టం చేశాడు కెప్టెన్ కోహ్లీ. శతకం చేసినా జట్టు ఓటమిపాలైతే ఆ పరుగులకు అర్థం లేదన్నాడు. గణాంకాల కన్నా మనం ఎలా ఆడామన్నదానికే ప్రాధాన్యం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.