తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మొబైల్​ ఫోన్లు కార్లకే పరిమితం- ఇది తెలుసా?

మీరు రోజూ ఎందరికో ఫోన్​ కాల్స్​ చేస్తుంటారు? గంటల తరబడి మాట్లాడతారు. టెలిఫోన్​ ఎవరు కనిపెట్టారంటే అలెగ్జాండర్​ గ్రహంబెల్​ అని టక్కున చెప్పేస్తారు. మరి అసలు మొబైల్​ ఫోన్​ కాల్స్​ ఎప్పుడు ప్రారంభమయ్యాయో, ఎవరు ఉపయోగించారో తెలుసా? ఇది చదివేయండి మరి.

By

Published : Jun 17, 2021, 2:07 PM IST

The first mobile phone call was 75 years ago
మొబైల్​ ఫోన్లు కార్లకే పరిమితం

చేతి గడియారంలోనే సెల్​ఫోన్​... ఇది ఇప్పటి సాంకేతికతకు పెద్ద కష్టమేమీ కాదు. సర్వ సాధారణ విషయంగా మారిపోయింది. టెలిఫోన్లు, వైర్​లెస్​ ఫోన్లు(మొబైల్​ ఫోన్లు), స్మార్ట్​ఫోన్లు ఇప్పుడు 5G. ట్రెండ్​కు అనుగుణంగా కొత్త కొత్త మార్పులు సంభవిస్తున్నాయి.

మరి మొట్టమొదటి మొబైల్​ ఫోన్​ కాల్​ ఎప్పుడు చేశారో మీకు తెలుసా? ఫస్ట్​ కాల్​ వెళ్లి నేటికి 75 ఏళ్లు.

1946 జూన్​ 17న మొబైల్​ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అవి ఇప్పటిలా చేతిలో పట్టుకొని వెళ్లేందుకు వీలుగా ఉండేవి కావు. 80- పౌండ్​ పేరుతో పిలిచే ఆ టెలిఫోన్లను.. కార్లలోనే అమర్చారు. ఇవి పెద్ద పెద్ద నగరాలు, హైవే కారిడార్లకు మాత్రమే పరిమితమయ్యాయి. వ్యక్తిగతంగా కాకుండా.. కంపెనీల అవసరాల కోసమే వీటిని వాడేవారు.

1948 నాటికి 5 వేల మంది.. ఈ తరహా మొబైల్​ ఫోన్ల వినియోగదారులుగా మారారు. ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన మూడు దశాబ్దాల తర్వాత.. 1973లో చేతిలో పట్టుకొని తిరిగేందుకు వీలైన(హ్యాండ్​హెల్డ్​ మొబైల్​ ఫోన్లు) ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.

భారత్​లో ఎప్పుడు..?

1995 జులై 31న భారతదేశంలో మొదటి మొబైల్ ఫోన్ కాల్ మాట్లాడారు. అప్పటి టెలికాం మంత్రి సుఖ్ రామ్, అప్పటి బంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు మధ్య తొలి మొబైల్​ ఫోన్​ సంభాషణ జరిగింది. ఆ తర్వాత భారతదేశం టెలికాం రంగంలో విప్లవం చూశాం. అప్పట్లో మొబైల్ ఫోన్ ఉండటం ఓ లగ్జరీ. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ఓ అవసరంగా మారిపోయింది.

దశాబ్దాల కృషితోనే..

ఇప్పుడు మనం వాడే స్మార్ట్​ఫోన్ల వెనుక ప్రభుత్వాల దశాబ్దాల కృషి ఉంది. ఎందరో ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు మొబైల్​ ఫోన్​ పరికరాల కోసం శ్రమించారు. ఇప్పుడు మనం వాడే ఫోన్లలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇదింకా అభివృద్ధి చెందొచ్చు.

హృదయ స్పందనలు తెలుసుకోవడం, సంజ్ఞలతోనే ఫోన్​ను నియంత్రించడం, గది పరిమాణాన్ని కొలవడం వంటి రాడార్​ సిగ్నల్స్​ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. 'సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడికి వెళుతుందో ఊహించడం కష్టం. కానీ దశాబ్దాల పరిశోధన, ప్రయోగాలు.. బంగారు భవిష్యత్తు అభివృద్ధికి మూల కారణం అవుతుందని అంటున్నారు నిపుణులు.

ఇదీ చూడండి:చరవాణితో జాగారం..ఒంటికి హానికరం

ABOUT THE AUTHOR

...view details