తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 12:26 PM IST

ETV Bharat / science-and-technology

Aditya L1 Mission Countdown : సూర్యుడి రహస్యాల గుట్టు విప్పనున్న ఇస్రో.. 'మిషన్​ సూర్య' కౌంట్​డౌన్​ స్టార్ట్​

Aditya L1 Mission Countdown : ఆదిత్య ఎల్‌-1.. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్‌ ఇది. భూమిపై జీవరాశుల మనుగడకు కారణమైన భానుడి భూత భవిష్యత్‌ వర్తమానాలకు సంబంధించి సరికొత్త సమాచార సేకరణకు ఈ మిషన్‌ శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడనుంది. మరోవైపు, ఆదిత్య ఎల్​1 ప్రయోగానికి తిరుపతి జిల్లాలోని సతీశ్‌ దావన్‌ అంతరిక్ష కేంద్రం సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది.

Aditya L1 Mission Countdown
Aditya L1 Mission Countdown

Aditya L1 Mission Countdown : భూమి నుంచి సూర్యుని దిశగా 15లక్షల కిలోమీటర్ల దూరంలోని తొలి లాగ్రాంజియన్‌ పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్యలో 'ఆదిత్య ఎల్‌1'ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రవేశపెట్టనుంది. తద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఆదిత్య ఎల్‌-1లో పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమాగ్నెటిక్‌, మాగ్నెటిక్‌ ఫీల్డ్‌ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌ సహా వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి.

'భవిష్యత్తులోనూ ఉండనుందా?'
ISRO Sun Mission :సూర్యుడి నుంచి వెలువడుతున్న కిరణ ప్రసారం ఇప్పుడు ఉన్నట్లే భవిష్యత్తులోనూ ఉండనుందా అనే దానిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించనున్నారు. ఒకవేళ భవిష్యత్తులో సూర్యుని నుంచి వెలువడే రేడియేషన్‌ తగ్గితే అది భూవాతావరణంపై భారీ ప్రభావం చూపనుంది. లాగ్రాంజియన్ పాయింట్ నుంచి సుదీర్ఘ కాలం పాటు సూర్యుడిని పర్యవేక్షించగలిగితే, ఇప్పటివరకు మానవాళికి తెలియని సూర్యుని చరిత్ర నమూనా తెలిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

డేటా సాయంతో అంతరిక్ష వాతావరణాన్ని..
Aditya l1 What Will It Do : ప్రతీ 11 ఏళ్లకు ఒకసారి సూర్యుడిలోని అయస్కాంత చర్యల్లో మార్పులు కనిపిస్తాయి. దీన్నే సోలార్‌ సైకిల్‌ అని పిలుస్తారు. సౌర వాతావరణంలో అయస్కాంత క్షేత్రంలో అప్పుడప్పుడు ప్రచండ మార్పులు కూడా జరుగుతాయి. దీని ఫలితంగా భారీ శక్తి పేలుళ్లు ఏర్పడతాయి, వీటిని సౌర తుఫానులు అంటారు. సూర్యుడి వెలుపలి వాతావరణం కొరోనా బలమైన అయస్కాంత క్షేత్రాల ద్వారా ఏర్పడింది. ఇది వేడి ప్లాస్మాను పరిమితం చేస్తుంది. ఒక్కోసారి కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్స్‌ అన్ని దిశల్లో పయనిస్తాయి. వీటివల్ల ఉపగ్రహాలు ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి. జాబిల్లి వంటి ఇతర ఖగోళ వస్తువులు కూడా సౌర తుపాన్ల వల్ల ప్రభావితమవుతాయి. సౌర తుపాను కారణంగా భూ కక్ష్యలో ఉండే ఉపగ్రహాలపై ప్రభావం పడి జీపీఎస్‌, మొబైల్‌ సిగ్నళ్లు, శాటిలైట్‌ టీవీ సేవల్లో అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంతరిక్షంలో ఉన్న మన ఆస్తులను కాపాడుకోవాలంటే అంతరిక్ష వాతావరణాన్ని అంచనా వేయడం ఎంతో అవసరం. ఆదిత్య ఎల్‌-1 నుంచి వచ్చే డేటా సాయంతో అంతరిక్ష వాతావరణాన్ని మనం అంచనా వేసే అవకాశం ఉంటుంది.

వాతావరణం వెనుక దాగి ఉన్న చరిత్రను..
Aditya l1 Will Collect Data On : భూ వాతావరణంపై సౌర కార్యకలాపాల ప్రభావం ఉంటుంది కాబట్టి భూమి వాతావరణం వెనుక దాగి ఉన్న చరిత్రను కూడా శాస్త్రవేత్తలు తెలుసుకునే వీలు ఉంటుంది. భూమి చరిత్రలో అనేక మంచు యుగాలు ఉన్నాయి. ఈ మంచు యుగాలు ఎలా ఏర్పడ్డాయో ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. వాటికి సూర్యుడే కారణమా అని తెలుసుకునే అవకాశం ఈ ప్రయోగం ద్వారా దక్కనుంది. అంతరిక్షంలోంచి తొలిసారి కరోనాలోని అయస్కాంత క్షేత్రాన్ని అంచనా వేయడానికి ఆదిత్య-ఎల్1 ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా, సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించడం, సౌర గాలి కొన్ని లక్షణాలు , కొన్ని ఇతర అంశాలపై మొదటిసారిగా పరిశోధన చేయనున్నారు.

భూ ఆధారిత టెలిస్కోప్‌లు కూడా ..
Aditya l1 Wikipedia :లాగ్రాంజియన్ పాయింట్ నుంచి ఆదిత్య ఎల్‌-1తో ఉన్న పేలోడ్లతో పాటు భూ ఆధారిత టెలిస్కోప్‌లు కూడా సూర్యుడిపై కన్నేసి ఉంచుతాయి. భూఆధారిత టెలిస్కోప్‌ల పరిశీలనలు, ఆదిత్య ఎల్‌-1 శాస్త్రీయ పరిశోధనలతో సౌరవాతావరణంలో ఏమి జరుగుతోందో సమగ్రంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సౌర తుపాన్లపై వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ ప్రయోగం భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రం, సౌర భౌతిక శాస్త్ర నిపుణులకు గొప్ప ముందడుగుగా భావిస్తున్నారు. ఇది మనకు కొత్త దృక్కోణాలను, కొత్త సామర్థ్యాలను ఇస్తుందని ఆదిత్య ఎల్‌-1 ఇచ్చే డేటా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు భారత శాస్త్రవేత్తలు తెలిపారు

కౌంట్​డౌన్​ స్టార్ట్​..
Aditya l1 Launch Date And Time : మరోవైపు, ఆదిత్య L1 ప్రయోగానికి తిరుపతి జిల్లాలోని సతీశ్‌ దావన్‌ అంతరిక్ష కేంద్రం సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 24 గంటలు నిరంతరంగా కౌంట్‌డౌన్‌ కొనసాగిన తర్వాత శనివారం మధ్యాహ్నం 11 గంటల 50 నిమిషాలకు PSLV-C57వాహకనౌక ఆదిత్య L1ను నింగిలోకి తీసుకుపోనుంది. ఇందుకు సంబంధించి షార్‌లో ఎల్పీఎస్సీ సంచాలకులు నారాయణన్‌ ఆధ్వర్యంలో రాకెట్‌ సన్నద్ధత సమావేశం నిర్వహించారు. వాహకనౌక అనుసంధానం, ఉపగ్రహ అమరిక, రిహార్సల్స్‌ తదితర అంశాలపై సమీక్షించారు. అన్నీ సక్రమంగానే ఉన్నట్లు నిర్ధరించారు. ఈ నేపథ్యంలో ఇస్రో చీఫ్‌ ఎస్‌ సోమ్‌నాథ్‌ గురువారం రాత్రే షార్‌కు చేరుకున్నారు. 3 రోజులపాటు అక్కడే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ABOUT THE AUTHOR

...view details