తెలంగాణ

telangana

By

Published : Sep 14, 2021, 7:50 AM IST

ETV Bharat / opinion

పదునెక్కని పరిశోధనలు.. వర్సిటీల్లో మొక్కుబడి చదువులు!

దేశంలోని విద్యాసంస్థల పనితీరుపై కేంద్ర విద్యాశాఖ.. ర్యాంకులను విడుదల చేసింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేంవర్క్‌(NIRF) జారీ చేసిన ఈ ర్యాంకులు దేశంలోని కళాశాలల్లో నెలకొన్న మౌలిక వసతుల కొరతను ఎత్తిచూపాయి. ముఖ్యంగా పరిశోధన స్థాయిలో ప్రపంచ వర్సిటీలతో పోలిస్తే భారత్ పనితీరు తీసికట్టుగా ఉందని చెప్పకనే చెప్పిందీ నివేదిక..

college
college

దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాల్లో ఈ ఏడాది తమిళనాడులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ మద్రాస్‌) 86.76 పాయింట్లు సాధించి మొదటి స్థానం కైవసం చేసుకొంది. కర్ణాటకకు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ బెంగళూరు) 82.67 పాయింట్లతో రెండో ర్యాంకు, ఐఐటీ బాంబే 82.52 పాయింట్లతో మూడోర్యాంకు సంపాదించాయి. పరిశోధన విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూరు మొదటి ర్యాంకు సాధించగా, ఐఐటీ మద్రాస్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల 'నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేంవర్క్‌' తన 2021 వార్షిక నివేదికలో ఈ ర్యాంకులు ఇచ్చింది. దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థల పని తీరును ఈ సంస్థ గత ఆరేళ్లుగా మదింపు వేస్తోంది. తాజాగా 13 రకాల విద్యాసంస్థలను పరిగణనలోకి తీసుకొని 1,657 విద్యాసంస్థల పనితీరును విశ్లేషించింది. తాజా ర్యాంకింగ్స్‌లో మొదటి ఎనిమిది స్థానాలూ సాంకేతిక విద్యాసంస్థలకే దక్కడం ఆసక్తికరమైన అంశం. తొమ్మిది, పది స్థానాల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ, బనారస్‌ హిందూ యూనివర్సిటీలు చోటు సంపాదించి విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠను కాపాడాయి. తెలుగు రాష్టాల్లో ఉన్న విద్యాసంస్థల పనితీరును పరిశీలిస్తే తెలంగాణలోని ఐఐటీ హైదరాబాద్‌ 58.53 పాయింట్లతో 16వ స్థానం సాధించగా, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం 57.67 పాయింట్లతో 17వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రా విశ్వవిద్యాలయం 48.65 పాయింట్లతో 48వ స్థానం సంపాదించింది. ఇది కాస్త ఊరట కలిగించే అంశమే. అయితే తెలుగు రాష్టాల్లోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఏ ఒక్కటీ కనీసం 150 లోపు స్థానాల్లో చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం.

మౌలిక వసతుల కొరత..

ఉన్నత విద్య సర్వే 2019-20 ప్రకారం దేశంలో 55,165 ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిలో కేవలం మూడు శాతం విద్యాసంస్థలు మాత్రమే 'నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేంవర్క్‌'లో పాల్గొనడం ఆశ్చర్యం కలిగించే అంశం. నిరుడు ఉన్నత విద్యాశాఖ చేపట్టిన సర్వేలోనూ 92శాతం విద్యాసంస్థలే సమాచారం పొందుపరచాయి. విద్యాలయాల్లో మౌలిక వసతుల లభ్యత ఎంతో కీలకం. అవి అందుబాటులో లేకపోతే ఉన్నత విద్యకు ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. దేశీయ విశ్వవిద్యాలయాల్లో మానవ వనరుల కొరత కొట్టొచ్చినట్లు కనబడుతోంది. కేంద్ర విద్యాశాఖ తాజా గణాంకాల ప్రకారం కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నేటికీ సుమారుగా 32.7శాతం అధ్యాపక పోస్టులు భర్తీకి నోచుకోలేదు. రాష్ట్రాల పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి అగమ్యగోచరంగా ఉందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1,019 అధ్యాపకుల పోస్టులు, తెలంగాణలో 1,061 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికార గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. వాటి భర్తీపై ప్రభుత్వాలకు ఇప్పటికీ ఒక స్పష్టత లేకపోవడం అధికార వ్యవస్థల నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది. అలాంటి వాతావరణంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోగా, పరిశోధన రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఉన్నత విద్యకు నానాటికీ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా పరిశోధనరంగం వైపు విద్యార్థులు పెద్దయెత్తున ఆకర్షితులవుతున్నారు. దేశంలో 2015-16లో 1.26 లక్షల మంది విద్యార్థులు పరిశోధక కోర్సుల(పీహెచ్‌డీ)లో చేరగా 2019-20 నాటికి వారి సంఖ్య 2.02 లక్షలకు పెరిగింది. కానీ, పరిశోధనలు సరైన సమయంలో పూర్తి కావడంలేదు. దేశవ్యాప్తంగా 2019-20 విద్యా సంవత్సరంలో 38,986 మంది విద్యార్థులు పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. అంటే 2015-16లో నమోదు చేసుకున్న విద్యార్థుల్లో 31శాతమే నిర్ణీత సమయంలో తమ పరిశోధనలు పూర్తి చేయగలిగారు. అధికశాతం విద్యార్థులు సకాలంలో పరిశోధనలు పూర్తి చేయలేకపోవడానికి మానవ వనరులు, మౌలిక వసతుల లేమే ప్రధాన కారణాలు.

ప్రమాణాల పెంపుదలే కీలకం..

జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు అధిక సంఖ్యలో వారి సిద్ధాంత వ్యాసాలను అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురిస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు పరిశోధనల్లో, సిద్ధాంత వ్యాసాల ప్రచురణలో తడబడుతున్నారు. పరిశోధన రంగంలో ఐఐటీ హైదరాబాద్‌ 54.70 పాయింట్లు సాధించి 15వ స్థానంలో ఉండగా- హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం 49.25 పాయింట్లతో 25వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏ ఒక్క విశ్వవిద్యాలయమూ పరిశోధన రంగంలో వందలోపు ర్యాంకు దక్కించుకోలేకపోయింది. పరిశోధక విద్యలో పశ్చిమ్‌ బంగ, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడుకు చెందిన విద్యాసంస్థలు ముందు వరసలో ఉన్నాయి. దీన్నిబట్టి ఆయా రాష్ట్రాల్లో పరిశోధనలు, సిద్ధాంత పత్రాల ప్రచురణలకు అధ్యాపకులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తేటతెల్లమవుతోంది. జాతీయస్థాయి ర్యాంకింగ్‌లలో తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో పోటీపడాలంటే ఉన్నత విద్యారంగాన్ని పెద్దయెత్తున సంస్కరించాల్సిన అవసరం ఉంది. భారీగా నిధులు కేటాయించి మౌలిక వసతులు మెరుగుపరచాలి. అధ్యాపక పోస్టులను భర్తీ చేసి, నాణ్యమైనవిద్య అందించాలి. ఏటా పరిశోధక కోర్సు(పీహెచ్‌డీ)లకు ప్రవేశ పరీక్షలు నిర్వహించాలి. అర్హులైన విద్యార్థులకు ప్రతిభ ఆధారిత ఉపకారవేతనాల సంఖ్య పెంచాలి. విద్యార్థుల పరిశోధనలు అయిదేళ్లలోపే పూర్తయ్యేలా అధ్యాపకులు నిబంధనలు పాటించాలి. విదేశీ విద్యార్థులను ఆకర్షించేలా సరికొత్త విద్యా విధానాలను అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడే రాష్ట్రాల పరిధిలోని యూనివర్సిటీలు- మేటి జాతీయ విద్యాసంస్థలతో పోటీపడగల స్థితికి చేరుకునే వీలుంటుంది!

- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌ ('సెస్‌'లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌)

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details