తెలంగాణ

telangana

ETV Bharat / opinion

చెరలో పౌరస్వేచ్ఛ- విముక్తి కలిగేదెన్నడు?

ఆదివాసీ హక్కులు సహా అక్రమ అరెస్టులపాలైన వారి విముక్తి కోసం నిరంతరం పోరాడిన స్టాన్ స్వామి చివరకు విచారణ ఖైదీగానే మృతిచెందడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. దేశ నేర న్యాయ విచారణ తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అదుపులోకి తీసుకున్న నాటి నుంచి ఆయనను విచారించకపోవడం, రోగాలతో సతమతమవుతున్నా అమానవీయంగా ప్రవర్తించిందంటూ ఎన్​ఐఏపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణ విచారణకు అవకాశం లేకపోతే బెయిల్ మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పును సైతం లెక్క చేయని వైఖరి దేశంలో పౌర స్వేచ్ఛపై విశ్వాసం సన్నగిల్లేలా చేస్తోంది.

By

Published : Jul 11, 2021, 8:44 AM IST

Stan Swamy
స్టాన్‌ స్వామి

ఫాదర్‌ స్టాన్‌ స్వామి..ప్రస్తుతం ప్రసార సాధనాల్లో సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతున్న పేరిది. సామాజిక ఉద్యమకారుడిగా, గిరిజన హక్కుల నేతగా పేరున్న క్రైస్తవ మతాచార్యుడు స్టాన్‌ స్వామి వివాదాస్పద భీమా కొరెగావ్‌- ఎల్గార్‌ పరిషద్‌ కేసులో విచారణ ఖైదీగా గతవారం మృతిచెందడం పట్ల దేశవిదేశాల్లో తీవ్ర నిరసన, ఆవేదన వ్యక్తమవుతున్నాయి. ఇంతటి పెను సంచలనానికి దారితీసిన పరిస్థితులు, కారణాల విశ్లేషణ దేశంలోని నేరన్యాయ విచారణ తీరుతెన్నులనే సూటిగా నిగ్గదీస్తోంది.

పుట్టింది తమిళనాడులోనైనా దశాబ్దాలుగా మధ్య భారతావనితో అనుబంధం పెంచుకున్న ఎనభైనాలుగేళ్ల స్టాన్‌ స్వామి ఆదివాసుల హక్కుల పరిరక్షణకు పెట్టింది పేరు. మూడు వేలమంది యువ గిరిజనులు జైళ్లలో మగ్గుతున్నారని ప్రగాఢ విచారం వ్యక్తపరచిన ఆయన, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణపై తానూ అటువంటి విపత్కర స్థితిలోనే చిక్కుకుని బెయిలు కోసం ఎంతగా యత్నించినా సాధ్యపడలేదు. అక్టోబరు 2020లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకునేటప్పటికే ఆ పండు ముదుసలి పార్కిన్‌సన్స్‌ వ్యాధిగ్రస్థుడు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్‌ అనుగ్రహిస్తే రాంచీ తిరిగి వెళ్ళి సన్నిహితుల మధ్య కన్నుమూయాలన్న అంతిమ కోరిక కడకు నెరవేరనే లేదు. 'విచారణ ఖైదీగానే చనిపోతానేమో!' అన్న భయమే నిజమైంది. వృద్ధాప్యంలో శరీరం సహకరించక, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కిక్కిరిసిన జైలులో ఉండలేనని వేడుకున్నా పట్టించుకోని దర్యాప్తు సంస్థ మొండితనం నిర్దాక్షిణ్యంగా కొవిడ్‌ను ప్రసాదించింది. ఆపై హృద్రోగ సమస్యలు చుట్టుముట్టి శాశ్వత విముక్తి కలిగించాయి. ఈ యావత్‌ ఉదంతంలో ఎన్‌ఐఏ అమానవీయంగా, క్రూరంగా వ్యవహరించిందన్న ఘాటు విమర్శలిప్పుడు ఇంటా బయటా మోతెక్కుతున్నాయి.

విచక్షణ ఏది?

వృద్ధాప్య కోరల్లో చిక్కి, నయంకాని వ్యాధుల కర్కశ కౌగిలిలో విలవిల్లాడుతూ, కాటికి కాళ్లు చాపుకొన్న ఖైదీల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఒకటిన్నర దశాబ్దాల నాడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఎన్నదగ్గ ఆదేశాలిచ్చింది. గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్ష విధించగల కేసులకు సంబంధించి వ్యక్తుల అరెస్టులపై విచారణాధికారులు విచక్షణానుసారం మెలగాలని సర్వోన్నత న్యాయస్థానమే నిర్దేశించింది. తాను మోపిన నేరారోపణల్ని ఎన్‌ఐఏ నిర్ద్వంద్వంగా నిరూపించగలిగినా- వయసు, ఆరోగ్య దుర్బలతల దృష్ట్యా స్టాన్‌ స్వామికి అయితే గియితే పడి ఉండే శిక్ష ఆ లోపే కనుక బెయిలు ఇచ్చి ఉండాల్సిందేనన్నది విస్తృత ప్రాచుర్యం పొందుతున్న విశ్లేషణ. నిరుడు అక్టోబరులో అదుపులోకి తీసుకున్నాక ఇన్నాళ్లలో కనీసం ఒక్కసారీ స్టాన్‌ స్వామిని ఎన్‌ఐఏ విచారించనే లేదు. తక్షణ విచారణావకాశం లేనట్లయితే మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలకు గురైన వ్యక్తి సైతం బెయిలుకు అర్హుడేనని లోగడ సుప్రీంకోర్టే స్పష్టీకరించింది. అవసరమైతే తప్ప కొవిడ్‌ వేళ అరెస్టులతో జైళ్లను మరింత రద్దీగా మార్చవద్దనీ ఈ మధ్య లక్ష్మణ రేఖ గీసింది. వాటన్నింటినీ తుంగలో తొక్కిన చందంగా ఎన్‌ఐఏ, తలచిందే తడవుగా స్వీయ కార్యాచరణను పట్టాలకు ఎక్కించింది.

ఫాదర్‌ స్టాన్‌ స్వామి జీవితంలో ఎన్నడూ భీమా కొరెగావ్‌ ప్రాంతాన అడుగు పెట్టలేదని, ఎప్పుడూ ఆయుధం పట్టలేదన్నది దశాబ్దాలుగా ఆయనతో సన్నిహితంగా మెలిగినవారి మాట. ఝార్ఖండ్‌ నివాసానికి వెళ్ళి తాము వశపరచుకున్న కంప్యూటర్‌, ఇతర పత్రాల ప్రాతిపదికన వామపక్ష తీవ్రవాదులతో సంబంధాలున్నట్లు నిర్ధారణకు వచ్చామన్నది ఎన్‌ఐఏ ప్రధాన ఆరోపణ. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ-ఉపా)లోని నాలుగు, ఆరు ఛాప్టర్ల కింద దర్యాప్తు సంస్థ కేసు బనాయించి ఉచ్చు బిగించింది. అవి ఉగ్రవాద కార్యకలాపాలు, సంస్థల కట్టడికి ఉద్దేశించినవి. వయోవృద్ధుడిపై 43డీ(2) లాంటి కర్కశ సెక్షన్‌ ప్రయోగానికి సమర్థనగా ఎన్‌ఐఏ పేర్కొంటున్న కంప్యూటర్‌ సాక్ష్యం సహేతుకతను అంతర్జాతీయ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మాల్‌వేర్‌ చొప్పించి అటువంటి సాక్ష్యాధారాలను సృష్టించగల వీలుందన్న వారి ధ్రువీకరణ, జాతీయ దర్యాప్తు సంస్థ వృత్తి నిబద్ధతనే బోనెక్కిస్తోంది!

ఆషామాషీగా చట్ట ప్రయోగం..

దేశంలో 'టాడా', 'పోటా' చట్టాల రద్దు దరిమిలా వాటి ఒరవడిలో నూతన శాసనం పురుడు పోసుకోలేదు. 1967 నాటి 'ఉపా'లోనే ఉగ్రవాద చట్టాన్ని ఆవాహన చేసిన కేంద్రం, 2008 సంవత్సరంలో కొన్ని సవరణలూ తలపెట్టింది. యూపీఏ జమానాను వెన్నంటి ఎన్‌డీఏ ఏలుబడిలోనూ ఆ పద్ధతికే పెద్దపీట వేశారు. అందులో ఉగ్ర చర్యల నిర్వచనం అస్పష్టంగా ఉందన్న ఉన్నత న్యాయపాలిక, ఆషామాషీగా ఎవరిపైనా టెర్రరిస్టు ముద్ర వేయరాదని హితవు పలికింది. ఉగ్రవాద దుశ్చర్యలకు, సాధారణ నేరాల్లోనే హేయమైన వాటికి వ్యత్యాసం గుర్తెరగకుండా కేసులు పెట్టడం పౌర స్వేచ్ఛకు ముప్పుగా పరిణమిస్తుందనీ హెచ్చరించింది. వాస్తవంలో జరుగుతున్నదేమిటి? దేశం లోపల వెలుపల వెల్లువెత్తిన విమర్శల్ని తిప్పికొడుతూ- శాసన నిబంధనల మేరకే ఎన్‌ఐఏ నడుచుకొందని, ఎక్కడా మానవ హక్కుల ఉల్లంఘన అన్నది జరగనే లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికారికంగా స్పందించింది!!

భీమా కొరెగావ్ కేసులో విచారణ ఖైదీలుగా

67 శాతం విచారణ ఖైదీలే..

బలహీన సాక్ష్యాల్ని పేర్కొంటూ 2018 ఆగస్టులో ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్న సుధా భరద్వాజ్‌, నిరుడు ఏప్రిల్‌లో అరెస్టయిన ఆనంద్‌ తేల్‌తుంబ్డే ప్రభృతులు ఇంకా జైలు ఊచలు లెక్కిస్తూనే ఉన్నారు. ఆరేళ్ల క్రితం 'ఉపా' చట్టం కింద పోలీసు చెరలో చిక్కిన ఎన్‌కే ఇబ్రహీం (67) వంటి వారెందరో చీకటి కొట్టాల్లోనే మగ్గిపోతున్నారు. ఇటీవల దిల్లీ హైకోర్టు చొరవతో ముగ్గురు విద్యార్థి నాయకులకు, గతవారం ప్రత్యేక కోర్టు విచారణలో అసోం సామాజిక కార్యకర్త అఖిల్‌ గొగోయ్‌ తదితరులకు దక్కిన ఉపశమనం మరెందరికో నేటికీ ఎండమావి అవుతోంది. నిరసనల్ని, భిన్నాభిప్రాయాల్ని ఉగ్రవాద దుశ్చర్యలుగా, రాజద్రోహాలుగా పరిగణించే వైపరీత్యం కొనసాగినన్నాళ్లు- పౌరస్వేచ్ఛ ఉక్కిరిబిక్కిరి కాకమానదు. చీకటి చట్టాల బారిన పడినవారే కాదు- దేశంలోని జైళ్లలో 67 శాతం దాకా ఉన్న విచారణ ఖైదీల ఆక్రోశం, దుఃఖోద్వేగాలతో కారాగారాల గోడలు పొగచూరిపోతున్నాయి. సత్వర న్యాయానికి నోచని దుస్థితి, ఉద్దేశపూర్వకంగానే బెయిలును అడ్డుకునే దుర్మార్గాలకు దేశంలో నూకలు చెల్లనంత వరకు మానవ హక్కుల ఉల్లంఘనలది అంతులేని విషాద గాథ. కాదంటారా?

- బాలు

ఇదీ చూడండి:స్టాన్‌ స్వామి మృతిపై వెల్లువెత్తుతున్న నిరసనలు!

ABOUT THE AUTHOR

...view details