ముఖంపై చెరగని చిరునవ్వుతో కనిపించే తరుణ్ గొగొయ్ రాజకీయ యవనికపై అందరికీ సుపరిచితులు. అసోం రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన గొగొయ్ది ఈశాన్య భారత్లో ప్రత్యేక ప్రస్థానం. తీవ్రవాదం కోరల్లో మగ్గిన రాష్ట్రాన్ని చీకటి రోజుల నుంచి పురోగతి దిశగా విజయవంతంగా నడిపిన ఘనత ఆయన సొంతం. ఆయన సంస్కరణల కారణంగా అందివచ్చిన ఆర్థిక అభివృద్ధి ఫలాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఆయన గాంధీజీ తాత్వికతను విశ్వసించే నికార్సైన కాంగ్రెస్వాది. క్లిష్టపరిస్థితుల్లో పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకొని ఒంటిచేత్తో విజయాల్ని సాధించిపెట్టారు.
రాజకీయ జీవితం
1968లో అసోమ్లోని జోర్హాట్ పురపాలక సంఘంలో గెలిచి రాజకీయాల్లో అడుగుపెట్టారు. గువాహతి విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాద పట్టాపుచ్చుకొని కెరీర్ ప్రారంభించారు. 1971లో జోర్హాట్ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచారు. 1976లో ఏఐసీసీ సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. తరవాత రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. 1985లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎదిగారు. పార్లమెంటులో చక్కని వాగ్ధాటి ప్రదర్శించేవారు. గాంధీల కుటుంబానికి సన్నిహితులుగా పేరొందారు. ఆయన దార్శనికతను మెచ్చి ఏఐసీసీలో పలు బాధ్యతలను అప్పగించారు. అసోం ప్రాంతీయ నేత నుంచి జాతీయ స్థాయి నేతగా కీర్తి గడించారు. 1991లో నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆహార, ఆహారశుద్ధి పరిశ్రమల సహాయ మంత్రిగా పనిచేశారు. కోకాకోలా, పెప్సీ కంపెనీలను భారత్లోకి అనుమతించడంలో కీలకపాత్ర పోషించారు.
అసోం అభివృద్ధికి మార్గదర్శి
అసోమ్లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించి, పంపించి వెయ్యాలని ఆరేళ్లపాటు చేపట్టిన ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చిన అసోం గణ పరిషత్ (ఏజీపీ) వంటి ప్రాంతీయ రాజకీయ శక్తి కారణంగా కాంగ్రెస్ ప్రాభవం క్షీణించిన కష్టకాలంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అధినాయకత్వం గొగొయ్పై ఉంచింది. అంచనాలకు తగినట్లుగా గొగొయ్ కాంగ్రెస్ను బలోపేతం చెయ్యడమే కాకుండా, 2001 నుంచి 2016 దాకా మూడుసార్లు వరసగా పార్టీని గెలుపు తీరాలకు చేర్చారు. 2001లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాత గొగొయ్ ఎంతో పరిణతి చూపి శాంతిభద్రతల స్థాపనకు ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రంలో తీవ్రవాదం కారణంగా దెబ్బతిన్న శాంతిని పునరుద్ధరించి, అభివృద్ధి వాతావరణాన్ని నెలకొల్పారు. ఒకటిన్నర దశాబ్దాలపాటు ముఖ్యమంత్రిగా పాలన సాగించి, అసోమ్లోని అన్ని తీవ్రవాద సంస్థలను చర్చలకు ఒప్పించిన ఘనత ఆయన ప్రత్యేకత.