తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సుధాకర్​ మావోయిస్టు ప్రస్థానం

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, ఆయన భార్య నీలిమ డీజీపీ మహేందర్ రెడ్డి ముందు లొంగిపోయారు. ఇంటర్ చదువుతున్న సమయంలో పీపుల్స్ వార్​లో చేరిన సుధాకర్ వివిధ హోదాల్లో పలు రాష్ట్రాల ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు.

By

Published : Feb 13, 2019, 8:13 PM IST

Updated : Feb 13, 2019, 9:26 PM IST

సుధాకర్ దంపతులు

సుధాకర్ దంపతులు
సుధాకర్​ స్వస్థలం నిర్మల్ జిల్లా సారంగాపూర్. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివాడు. ఎనిమిది నుంచి ఇంటర్మీడియట్ వరకు నిర్మల్ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించాడు. ఇదే సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ జిల్లా కార్యదర్శి కటకం సుదర్శన్​తో పరిచయమైంది. విప్లవం, పీపుల్స్ గ్రూప్​ భావజాలానికి సుధాకర్ ఆకర్షితుడై, సుదర్శన్ ప్రోద్బలంతో 1983లో అడవిబాట పట్టాడు.

సుధాకర్ మొదటగా బెంగళూరు కేంద్రంగా పనిచేసే టెక్నికల్ కమిటీలో చేరాడు. కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులకు ఆయుధాలు సరఫరా చేసే విభాగంలో పనిచేశాడు. 1986లో సుధాకర్​ను పోలీసులు అరెస్టు చేసి 11 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మూడేళ్లపాటు జైలులో గడిపి సుధాకర్ 1989లో విడుదలై వరవరరావు ఆధ్వర్యంలో రైతుకూలీ సంఘంలో పనిచేశాడు. 1990 నుంచి అండర్​ గ్రౌండ్​లో ఉంటూ సీపీఐ మావోయిస్టు, ఆదిలాబాద్ జిల్లా ఆర్​ఎస్​యూ అనుబంధ సంస్థ బాధ్యతలు నిర్వర్తించాడు.

1990 నుంచి 1992 వరకు దళ సభ్యుడిగా, 1992 నుంచి 1994 వరకు చెన్నూరు దళ కమాండర్‌ పనిచేశాడు. 1994 నుంచి 1997 వరకు చెన్నూరు డీసీఎంగా, 1997 నుంచి 1999 ఆదిలాబాద్‌ జిల్లా ఇంఛార్జిగా, 1999 నుంచి 2001 వరకు నార్త్‌ జోనల్‌ కమిటీ ఇంఛార్జిగా పనిచేశాడు. 2001 నుంచి 2003 వరకు దండకారణ్య దళ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 2003 నుంచి 2013 వరకు మిలిటరీ కమిషన్‌లో సభ్యుడిగా ఉన్నాడు.

2013లో కేంద్ర కమిటీలో సభ్యుడిగా చేరి 2014 నుంచి 2019 వరకు ఈఆర్​బీ సభ్యుడిగా పనిచేశాడు. ఝార్ఖండ్‌, బిహార్‌ ప్రాంతానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరించాడు. దాదాపు 30ఏళ్లకు పైగా అడవిలో బతికిన సుధాకర్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడాడు. పార్టీలో సిద్దాంతాలు నచ్చక తన భార్య నీలిమతో కలిసి పోలీసులకు లొంగిపోయాడు. మావోయిస్టు ఉద్యమ ప్రస్థానాన్ని ముగించాడు.

Last Updated : Feb 13, 2019, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details