హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసు ఠాణాల్లో విధులు నిర్వహిస్తున్న బ్లూకోల్ట్ పోలీసులు, ప్రత్యేక బృందాలు రోజూ వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై దృష్టిపెడుతున్నారు. పశ్చిమమండలంలో అత్యధికంగా 17,755 మందిపై కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు.
దాడులకు పాల్పడ్డవారిపై..
నగరంలో కొవిడ్-19 విస్తరించకుండా వైద్యులు, పోలీసులు, జీహెచ్ఎంసీ వైద్యారోగ్యశాఖ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. కొందరు ఇవి నచ్చక అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లోని వైద్యులపై దాడికి పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేశారు.
సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం...
వైరస్ ప్రభావం, విస్తరణపై సామాజిక మాధ్యమాల వేదికలుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో కొన్ని వర్గాలు ఇబ్బందిపడేలా పోస్టులు వచ్చాయి. సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించి సుమోటోగా కేసులు పెడుతున్నారు. నెలరోజుల్లో 30 కేసులు పెట్టి ఒకరిని అరెస్టు చేశారు. 12 మందికి తాఖీదులు జారీ చేశారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత వారిని అరెస్టు చేయనున్నారు.