Israel Palestine Ceasefire 2023 :హమాస్, ఇజ్రాయెల్కు మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీల విడుదల ప్రారంభమైంది. తొలి దశలో హమాస్ తమ చెరలోని 25 మంది బందీలను విడుదల చేసింది. అందులో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉండగా.. 12 మంది థాయ్లాండ్ జాతీయులు ఉన్నారు. 13 మంది ఇజ్రాయెలీలను హమాస్.. రెడ్క్రాస్కు అప్పగించగా వారు రఫా సరిహద్దుకు తరలించారు. అక్కడ బందీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఈజిప్టుకు తీసుకెళ్లారు.
ప్రారంభమైన బందీల విడుదల
మరోవైపు.. తమ దేశానికి చెందిన 12 మంది బందీలను హమాస్ విడుదల చేసిందని థాయ్లాండ్ ప్రకటించింది. థాయ్ ప్రధాని స్రెతా థావిసిన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వారిని తీసుకొచ్చేందుకు రాయబార బృందాలు బయల్దేరినట్లు వెల్లడించారు. అటు.. ఇజ్రాయెల్ కూడా ఒప్పందం ప్రకారం తమ జైళ్లలోని 39 మంది పాలస్తీనా మహిళలు, చిన్న పిల్లలను విడిచిపెట్టింది. ఈ విషయాన్ని ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ ధ్రువీకరించింది. వీరిని జైళ్లలో ఉంచడానికి గల కారణాలను ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. తాము జైళ్లలో పెట్టిన వారిలో చాలా మంది ఇజ్రాయెల్ సైన్యంపై రాళ్ల దాడులు చేసినవారే ఉన్నారని తెలిపింది.
'బందీలందర్నీ విడిపించడానికి కట్టుబడి ఉన్నాం'
హమాస్ బందీలను విడుదల చేయడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పందించారు. తమ ప్రభుత్వం బందీలందర్నీ విడిపించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ పౌరులు తమ సొంత ప్రపంచానికి వస్తున్నందుకు సంతోషంగా ఉందని నెతన్యాహు అన్నారు. బందీల విడుదలపై స్పందించిన అమెరికా.. హమాస్ తొలి విడతలో విడుదల చేసిన వారిలో అమెరికన్లు లేరని స్పష్టం చేసింది. మొత్తం 50 మందిని విడుదల చేయాలని ఒప్పందం కుదిరిందనీ.. తర్వాత విడుదలయ్యేవారిలో అమెరికన్లు ఉంటారని ఆశాభావం వ్యక్తం చేసింది.