తెలంగాణ

telangana

వెనక్కి తగ్గని హౌతీలు- అమెరికా నౌకపైకి క్షిపణి ప్రయోగం- ఇరాన్ బాంబుల వర్షం!

By PTI

Published : Jan 16, 2024, 6:47 AM IST

Houthi Attacks In Red Sea : ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. యెమెన్ తీరం వెంబడి ప్రయాణిస్తున్న అమెరికా నౌకపైకి హౌతీ రెబల్స్ క్షిపణిని ప్రయోగించారు. అయితే, ఈ ఘటనలో ఓడకు నష్టం వాటిల్లలేదని అమెరికా తెలిపింది. మరోవైపు, ఇరాక్​పై ఇరాన్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది.

Houthi Attacks In Red Sea
Houthi Attacks In Red Sea

Houthi Attacks In Red Sea :అమెరికా, బ్రిటన్ ఇతర మిత్రదేశాలు కలిసి యెమెన్​లోని హౌతీ రెబల్స్ స్థావరాలపై భీకర వైమానిక దాడులు చేస్తున్నా మిలిటెంట్లు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా యెమెన్ తీరం వెంబడి ప్రయాణిస్తున్న అమెరికా నౌక జిబ్రాల్టర్ ఈగిల్​పైకి హౌతీ రెబల్స్ క్షిపణిని ప్రయోగించారు. ఎర్రసముద్రంలో అమెరికా యుద్ధ నౌకపైకి యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణితో దాడి చేసి 24 గంటలు గడవకముందే ఈ దాడి చేయడం గమనార్హం. ఆడెన్​కు ఆగ్నేయ దిశలో 110 మైళ్ల దూరంలో దాడి జరిగినట్లు UK మారిటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ తెలిపింది. యెమెన్​లోని ఓడరేవు వైపు నుంచే మిస్సైల్ దూసుకొచ్చిందని షిప్ కెప్టెన్ నివేదించినట్లు పేర్కొంది.

అమెరికా నౌక జిబ్రాల్టర్ ఈగిల్​ (పాత చిత్రం)

హౌతీ రెబల్స్ దాడిని అమెరికా సైన్యం నిర్ధరించింది. ఓడకు ఎలాంటి నష్టం వాటిల్లలేదనీ, ప్రస్తుతం అది దాని ప్రయాణాన్ని కొనసాగిస్తోందని తెలిపింది. దాడికి బాధ్యత వహిస్తూ హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సారీ ప్రకటన విడుదల చేశారు. తమ దేశంపైకి దురాక్రమణ చేసేందుకు దూసుకొచ్చే అమెరికన్, బ్రిటిష్ నౌకలు, యుద్ధనౌకలను యెమెన్ సాయుధ బలగాలు శత్రు లక్ష్యాలుగా పరిగణిస్తాయని హెచ్చరించారు. హౌతీల తాజా దాడి ఎర్రసముద్రంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది.

ఇరాన్ దాడులు
మరోవైపు, అర్ధరాత్రి ఇరాక్‌ ఎర్బిల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో ఇరాన్‌ సైన్యం వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు ఇరాక్‌ సైనికులు మృతి చెందారు. అయితే సంకీర్ణ దళాలకు చెందిన సేనలకు, అమెరికన్ సైనికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇరాక్‌ సైన్యం తెలిపింది.

భవనంపై ఇరాన్ బాంబు దాడి

గూఢచారుల ప్రధాన కార్యాలయంతో పాటు ఇరానియన్ వ్యతిరేక తీవ్రవాద సమావేశాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్‌ క్షిపణులతో దాడులు చేసినట్లు ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ తెలిపింది. మొత్తం యూఎస్‌ కాన్సులేట్‌ సమీపంలోని 8 ప్రాంతాలను ఇరాన్‌ సైన్యం లక్ష్యంగా చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. దాడి జరిగిన వెంటనే ప్రతిస్పందించిన సంకీర్ణ సేనలు 3 డ్రోన్లను నేలమట్టం చేశాయని పేర్కొంది. బాంబు దాడుల నేపథ్యంలో ఎర్బిల్‌లో విమానరాకపోకలను అధికారులు నిలిపివేశారు.

గాజా యుద్ధానికి 100 రోజులు- అట్టుడుకుతున్న పశ్చిమాసియా!- అందోళనలో ప్రపంచ దేశాలు!

తుపాకులతో టీవీ స్టూడియోలోకి సాయుధులు- లైవ్‌లో న్యూస్ ప్రజెంటర్‌కు గురి

ABOUT THE AUTHOR

...view details