తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2021, 7:46 AM IST

ETV Bharat / international

'రోదసి'లో మనిషి ముద్రకు 60 ఏళ్లు

రోదసిలో మనిషి తొలి ముద్ర వేసి నేటికి 60 ఏళ్లు ముగిసింది. 1961 ఏప్రిల్‌ 12న అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడు యూరీ గగారిన్​ ఆధునిక అంతరిక్ష యాత్రలకు బాటలు పరిచారు. మరి నాటి అంతరిక్ష ప్రయాణ విశేషాలేంటో తెలుసుకుందాం...

yuri gagarin
గగనానికి మానవుడి నిచ్చెన!

రోదసిలో నుంచి భూమి దిశగా వ్యోమనౌక దూసుకొస్తోంది. స్పేస్‌సూట్‌ ధరించిన ఒక వ్యోమగామి అందులో కూర్చొని ఉన్నారు. భూ గురుత్వాకర్షణ బలం తాకిడికి ఓ విధంగా ఆయన తన సీట్లో కూలబడ్డారు. స్పేస్‌క్రాఫ్ట్‌ కిటికీ అద్దంలో నుంచి ఖగోళాన్ని యథాలాపంగా పరికించారు. అప్పుడు కనిపించిన దృశ్యంతో ఆయన అప్రమత్తమయ్యారు. వ్యోమనౌకను అగ్నికీలలు ముంచెత్తడం ఆయన కంటపడింది. వెంటనే రేడియో సాధనం ద్వారా భూ కేంద్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు. "నేను కాలిపోతున్నా.. గుడ్‌బై కామ్రేడ్స్‌" అని చెప్పి ముగించారు.ఆ వ్యక్తి సోవియట్‌ యూనియన్‌ వ్యోమగామి యూరి గగారిన్‌. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడు.

నేటి మానవసహిత యాత్రలకు బాటలు పరిచిన ఆ చరిత్రాత్మక ఘట్టం 1961 ఏప్రిల్‌ 12న జరిగింది. అంతరిక్షంలో మానవాళి వేసిన ఆ తొలి అడుగుకు సోమవారంతో సరిగ్గా 60 ఏళ్లు నిండాయి. నాడు గగారిన్‌కు కనిపించిన మంటలు.. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించేటప్పుడు వోస్తోక్‌-1 వ్యోమనౌకను చుట్టుముట్టిన ప్లాస్మా మేఘం. వాతావరణ రాపిడికి అది చెలరేగడం సహజమే. నాడు గగారిన్‌ భూమికి క్షేమంగా తిరిగొచ్చారు. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా తొణకని మనోనిబ్బరం ఆయన సొంతం. ఆ లక్షణమే ఆయనను తొలి అంతరిక్ష యాత్రికుడిని చేసింది.

గగనానికి మానవుడి నిచ్చెన!

1957 అక్టోబరులో 'స్పుత్నిక్‌' రూపంలో ప్రపంచ తొలి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి నాటి సోవియట్‌ యూనియన్‌ పంపింది. తద్వారా రోదసి రంగంలో అమెరికాపై పైచేయి సాధించింది. అదే ఊపులో.. తొలి మానవసహిత అంతరిక్ష యాత్రను నిర్వహించడం ద్వారా తన పట్టును మరింతగా బిగించుకోవాలనుకుంది. దీన్ని సాకారం చేసేందుకు సోవియట్‌ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు అవిశ్రాంతంగా పనిచేశారు. అనేకమంది రోజులతరబడి తమ కార్యాలయాలు, కర్మాగారాల్లోనే నిద్రించారు. ఈ క్రమంలో అనేక ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. 1960లో వరుసగా రాకెట్‌ ప్రయోగ వైఫల్యాలు తలెత్తాయి. ఆ ఏడాది అక్టోబరులో లాంచ్‌ ప్యాడ్‌ వద్ద జరిగిన విస్ఫోటంలో 126 మంది ప్రాణాలు కోల్పోయారు.

గగనానికి మానవుడి నిచ్చెన!

అన్ని సమస్యలే..

వోస్తోక్‌-1 వ్యోమనౌకలో 108 నిమిషాల పాటు గగారిన్‌ యాత్ర సాగింది. ఈ క్రమంలో ఆయన ఒకసారి భూమిని చుట్టివచ్చారు.

  • నింగిలోకి పయనం కావడానికి కొద్దిసేపటి ముందు.. వోస్తోక్‌-1 వ్యోమనౌక తలుపు పూర్తిగా మూతపడలేదని వెల్లడైంది. దీంతో ఒక ఇంజినీరు, సహాయకుడు.. శరవేగంగా పనిచేసి 32 స్క్రూలను తొలగించారు. లోపాన్ని గుర్తించి, సరిచేశారు. నిర్దేశిత సమయంలోగానే ఆ స్క్రూలను తిరిగి బిగించారు.
  • రోదసిలోకి చేరాక ఇంజిన్‌ దెబ్బతిన్నా.. వోస్తోక్‌-1 తనంతట తానుగా వారం రోజుల్లో తిరిగి భూమిని చేరేలా కక్ష్యను శాస్త్రవేత్తలు ఎంపిక చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఇంజిన్‌ సక్రమంగానే పనిచేసింది. అయితే ఇంధనం తగ్గిపోవడంతో అనూహ్యమైన రీ ఎంట్రీ మార్గాన్ని, వేగాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. దీనివల్ల 10 నిమిషాల పాటు వ్యోమనౌక బొంగరంలా తిరిగిపోయింది.
  • ఆ సమయంలో.. సాధారణం కన్నా 10 రెట్లు ఎక్కువ గురుత్వాకర్షణ బలాన్ని గగారిన్‌ ఎదుర్కొన్నారు. ఫలితంగా కొద్దిసేపు తన కళ్లు మసకబారాయని చెప్పారు.
  • మృదువుగా వ్యోమనౌకను నేలపై దించే సాఫ్ట్‌ల్యాండింగ్‌ సాంకేతికత అప్పటికి అభివృద్ధి కాలేదు. అందువల్ల కొంత ఎత్తు నుంచే వోస్తోక్‌-1 నుంచి గగారిన్‌ కిందకు దూకి, పారాచూట్‌ సాయంతో సాఫీగా నేలపై కాలుమోపేలా ఇంజినీర్లు వ్యూహరచన చేశారు. అయితే ప్రధాన పారాచూట్‌తోపాటు ప్రత్యామ్నాయ పారాచూట్‌ కూడా పొరపాటున విచ్చుకోవడంతో ల్యాండింగ్‌ కష్టమైంది. అయినా గగారిన్‌.. సారాతోవ్‌ ప్రాంతంలో వోల్గా నది పక్కన సురక్షితంగా దిగారు. ప్రపంచవ్యాప్తంగాఆయన పేరు మారుమోగిపోయింది.

20 మందిలో ఒకరు..

20 మందిలో ఒకరు

వ్యోమగామి శిక్షణ పొందిన 20 మంది వైమానిక దళ పైలట్లలో గగారిన్‌ ఒక్కరే అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యారు. స్థితప్రజ్ఞతకు తోడు.. ఏ అంశాన్నైనా ఇట్టే ఆకళింపు చేసుకునే నైపుణ్యం, చెక్కుచెదరని చిరునవ్వు.. ఆయనకు విజయాన్ని కట్టబెట్టాయి. నాడు గగారిన్‌ వయసు 27 ఏళ్లు.

  • అంతరిక్షయానం పూర్తయిన ఏడేళ్ల తర్వాత 1968 మార్చి 27న.. తన 34వ ఏటే ఒక విమాన ప్రమాదంలో గగారిన్‌ చనిపోయారు.

భార్యకుధైర్యవచనాలు..

యూరీ గగారిన్

అంతరిక్ష యాత్రకు రెండు రోజుల ముందు గగారిన్‌ తన భార్య వాలంటీనాకు ఒక లేఖ రాశారు. తొలి రోదసి యాత్రకు ఎంపికకావడం పట్ల గర్వపడుతున్నానని అందులో పేర్కొన్నారు. ఈ యాత్రలో తాను మరణిస్తే విషాదంలోకి జారిపోవద్దని కోరారు. "వ్యోమనౌకలోని సాధనసంపత్తిని పూర్తిగా విశ్వసిస్తున్నా. నాకు అపాయం కలగకుండా అవి చూసుకుంటాయి. వల్యూషా (వాలంటీనా ముద్దు పేరు)..! ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగినా నువ్వు విషాదంతో కుంగిపోవద్దు" అని రాశారు. అయితే ఈ లేఖను గగారిన్‌ మరణానంతరమే అధికారులు.. ఆయన భార్యకు అందించారు.

మతిస్థిమితం కోల్పోయినా ఇబ్బందిలేకుండా

ప్రతికూల పరిస్థితుల్లో వ్యోమగామి మతిస్థిమితాన్ని కోల్పోవచ్చని కొందరు శాస్త్రవేత్తలు భావించారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి.. వోస్తోక్‌-1లో ఆటోమేటిక్‌ నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేశారు. వ్యోమగామి సొంతంగా వ్యోమనౌకను నియంత్రించాల్సి వస్తే 'మాన్యువల్‌ కంట్రోల్‌'ను క్రియాశీలం చేయడానికి ఒక రహస్య కోడ్‌ను పెట్టారు. యాత్ర సమయంలో దాన్ని ఒక సీల్డు కవరులో వ్యోమగామికి అందించారు. వ్యోమనౌకను సొంతంగా నడపడానికి ఆయన మతిస్థిమితంలోనే ఉన్నారని నిర్ధరించుకోవడానికి ఈ ఏర్పాటు చేశారు. అయితే ఒక ఇంజినీరు.. ముందుగానే సదరు రహస్య కోడ్‌ను గగారిన్‌కు చెప్పేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆ సీల్డు కవరు కోసం వెతుకుతూ వ్యోమగామి ఇబ్బందిపడరాదన్నది ఆయన ఉద్దేశం.

ఇదీ చదవండి:'నలుగురిని కాదు.. 8 మందిని కాల్చి చంపాల్సింది'

ABOUT THE AUTHOR

...view details