బ్రిటన్ చరిత్రలో కీలక ఘట్టమైన బ్రెగ్జిట్కు మార్గం మరింత సుగమమైంది. ఇప్పటికే క్వీన్ ఎలిజబెత్-2 అధికారిక ముద్ర వేసిన బ్రెగ్జిట్ ఒప్పందంపై తాజాగా ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సంతకం చేశారు. బ్రస్సెల్స్లోని యూరోపియన్ యూనియన్కు చెందిన ఇద్దరు అత్యున్నత అధికారులు సైతం శుక్రవారమే ఆమోదం తెలిపారు. ఇదే విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు జాన్సన్.
" బ్రిటిష్ ప్రజా తీర్పును గౌరవిస్తూ.. జనవరి 31న ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగే బ్రెగ్జిట్ ఒప్పందంపై నేను ఇవాళ సంతకం చేశాను."
- బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధానమంత్రి
యూరోపియన్ పార్లమెంట్ ముందుకు బ్రెగ్జిట్
వచ్చేవారం యూరోపియన్ పార్లమెంట్ ఈ ఒప్పందానికి మద్దతు తెలపాల్సి ఉంది. అదే జరిగితే లండన్లో ఇది ఓ చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుంది. ఎందుకంటే 28 సభ్య దేశాలు కలిగిన ఈయూ నుంచి వైదొలగిన తొలి దేశంగా బ్రిటన్ నిలుస్తుంది. జాన్సన్కు తాను పదవి చేపట్టిన కాలంలో ఇదో పెద్ద విజయం అవుతుంది.