కరోనా బాధితుల శరీరంపై గులాబీ దద్దుర్లు, కాళ్ల వాపులు, గుండెకు అమర్చిన గొట్టాలు పూడుకుపోవడంతోపాటు హఠాన్మరణమూ చోటు చేసుకుంటోంది. రక్తనాళాల్లో గడ్డల కారణంగానే ఇలా జరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని ‘రక్తపు గడ్డల ఉప్పెన’గానూ వర్ణిస్తున్నారు. కొవిడ్ తీవ్రత పెరిగి, ముఖ్యంగా ఆసుపత్రుల్లో చేరిన వారికి అధిక ప్రమాదం పొంచి ఉంటోంది. ఆరోగ్యం విషమించిన వారిలో 20-30% మందికి ఈ ముప్పు ఉంటున్నట్లు నెదర్లాండ్స్, ఫ్రాన్స్ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా రక్తపు గడ్డలు కరిగే సమయంలో డి-డైమర్ అనే ప్రొటీన్ విడుదలవుతుంది. ఆసుపత్రుల్లో చేరిన చాలామందిలోని రక్తంలో ఈ ప్రోటీన్ మోతాదులు అధికంగా ఉంటున్నాయి. దీని ఆధారంగా కొవిడ్తో మరణించే అవకాశమున్న వారినీ ముందుగానే గుర్తించొచ్చు. మరోవైపు రక్త కేశనాళికల్లోనూ సూక్ష్మమైన గడ్డలు బయటపడుతుండటం గమనార్హం. ఇది చాలా చాలా కొత్త విషయమంటున్న శాస్త్రవేత్తలు... కారణాల విశ్లేషణపై నిశితంగా దృష్టి సారించారు. అదే సమయంలో గడ్డలను కరిగించే మందులపైనా ప్రయోగ పరీక్షలు ప్రారంభించారు.
కొత్త చికిత్సలపై దృష్టి
కరోనా బాధితులను రక్షించడానికి నూతన చికిత్సల వైపు పరిశోధకులు దృష్టి సారించారు. రక్తాన్ని పలుచగా చేసే మందులు ఇందుకు బాగా ఉపయోగపడతాయి. అయితే మోతాదు విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలు ఆసుపత్రుల్లో వెంటిలేటర్ మీదున్న కొందరికి ఈ మందులు ఇవ్వగా... మరణించే ముప్పు తగ్గినప్పటికీ పెద్ద మోతాదులో ఇస్తే దుష్ప్రభావాలు తలెత్తుతాయని కొందరు వైద్యుల భావన. మరికొన్నిచోట్ల గడ్డలను కరిగించే శక్తిమంతమైన టీపీఏ మందుపైనా ప్రయోగాలు చేస్తున్నారు. వీటి ఫలితాలు మున్ముందు చికిత్సల తీరుతెన్నులను నిర్దేశించగలవని పరిశోధకులు ఆశిస్తున్నారు.