తెలంగాణ

telangana

ETV Bharat / international

న్యూజిలాండ్​కు ప్రపంచ దేశాల సంఘీభావం

న్యూజిలాండ్ మసీదులపై దాడులను ప్రపంచదేశాలు ఖండించాయి. ఘటనపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

By

Published : Mar 16, 2019, 8:47 AM IST

న్యూజిలాండ్​కు ప్రపంచ దేశాల సంఘీభావం

న్యూజిలాండ్​లోని క్రైస్ట్​చర్చ్, లిన్​మోర్ మసీదులపై జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు మూకుమ్మడిగా ఖండించాయి. ముస్లిం వ్యతిరేక భావనలను నిర్మూలించేందుకు దేశాలన్ని ముందుకురావాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు.

"ఈ విచారకర సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. మసీదుల్లో శాంతియుతంగా ప్రార్థనలు చేస్తున్న అమాయక ప్రజలపై కాల్పులు జరపటం అత్యంత హేయమైన చర్య. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ముస్లిం వ్యతిరేక భావనలకు నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్ని కృషి చేయాలి."
- ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి

ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం అంటే భయం(ఇస్లామోఫోబియా)కు వ్యతిరేకంగా తక్షణమే ఉద్యమించాలని అన్ని దేశాలను గుటెరస్ కోరారు. అసహనం, తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచివేయాలని సూచించారు.

కొందరి పని మాత్రమే: ట్రంప్

న్యూజిలాండ్ మద్దతుగా నిలబడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. సాయం చేసేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు. ఉగ్రదాడికి కారణం శ్వేత జాతీయ వాదమేనని వస్తోన్న ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు కొట్టిపారేశారు.

"ఇది శ్వేత జాతీయ వాదంతో జరిగిందని నేను అనుకోవట్లేదు. కేవలం కొంతమంది దుశ్చర్య అంతే."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ప్రపంచ సమస్య: జెసిండా

మసీదులపై జరిగిన ఉగ్రదాడుల బాధితుల్లో ప్రపంచంలోని ముస్లిం దేశాలకు చెందినవారున్నారని న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ తెలిపారు. ప్రపంచ దేశాలన్నింటిపైనా దాడి ప్రభావం ఉందని చెప్పారు.మృతుల్లో పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, ఇండోనేసియా, మలేసియా దేశాల ప్రజలు ఉన్నారని, వారి దౌత్య కార్యాలయాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని వెల్లడించారు.

విచారణ చేపడతాం: టర్కీ

న్యూజిలాండ్​లో ఉగ్రదాడి హేయమైన చర్యగా టర్కీ అధ్యక్షుడు రిసెప్ తాయిప్ ఎర్దోగాన్ పేర్కొన్నారు.

ఉగ్రదాడిలో పాల్గొన్న 28 ఏళ్ల ఆస్ట్రేలియా జాతీయుడు టర్కీలో పలుమార్లు పర్యటించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్కడే చాలా కాలం నివసించాడని అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో ఈ విషయమై విచారణ చేపడతామని టర్కీ ప్రభుత్వం ప్రకటించింది.

"టర్కీ నుంచే నిందితుడు ఐరోపా, ఆసియా, ఆఫ్రికా దేశాలకు వెళ్లి ఉంటాడని భావిస్తున్నాం. దేశంలో అతని కదలికలు, సంబంధాలపై విచారిస్తున్నాం. నిందితుడు ట్విట్టర్​లో పోస్ట్ చేసిన మేనిఫెస్టోలో టర్కీకి సంబంధించిన వివరాలున్నాయి. ఒట్టోమాన్ పాలనలో ఇస్తాంబుల్​లో చర్చ్​ నుంచి మసీదుగా రూపాంతరం చెందిన హేజియా సోఫియా గురించి నిందితుడు పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం అందులో మ్యూజియం నడుపుతున్నారు."
- టర్కీ అధికారులు

బల్గేరియాలోని పలు చారిత్రక ప్రదేశాలను నిందితుడుసందర్శించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

"దేశంలోని చాలా చారిత్రక ప్రదేశాలను నిందితుడు సందర్శించి, బాల్కన్​ చరిత్రను చదివాడనే సందేహాలున్నాయి."
-సోటిర్ సాటోరోవ్, బల్గేరియా ప్రభుత్వ ప్రధాన న్యాయవాది

వీడియో తొలగించిన ఫేస్​బుక్​

ఉగ్రదాడిపై ఫేస్​బుక్ యాజమాన్యం తక్షణమే స్పందించింది.

"ఉగ్రదాడి దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయని పోలీసులు మమ్మల్ని అప్రమత్తం చేశారు. వెంటనే ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రాం నుంచి వాటిని తొలగించాం. అంతే కాకుండా దాడికి మద్దతు తెలుపుతూ చేస్తున్న కామెంట్లను సైతం వెంటవెంటనే తొలగిస్తున్నాం. ఘటనపై పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం."
- ఫేస్​బుక్ యాజమాన్యం

మరిన్ని వివరాలకు:ఉగ్ర నరమేధానికి 49 మంది బలి

ABOUT THE AUTHOR

...view details