తెలంగాణ

telangana

ETV Bharat / international

ఓట్లు లెక్కిస్తూనే 272 మంది మృతి

ఇండోనేసియాలో ఏప్రిల్​ 17న స్థానిక, పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. బ్యాలెట్​ పద్ధతిలో జరిగిన ఓటింగ్​లో అధికారులే స్వయంగా ఓట్లన్నీ చేతులతో లెక్కపెట్టాల్సి వచ్చింది. తగినంత సిబ్బంది, విరామం లేకపోవడం, తీవ్ర ఒత్తిడి కారణంగా.. ఓట్లు లెక్కిస్తూనే సుమారు 272 మంది మృతి చెందారు. ఈ ఘటన ఆ దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

By

Published : Apr 29, 2019, 6:37 AM IST

ఓట్లు లెక్కిస్తూనే 272 మంది మృతి...

వందల కొద్దీ దీవులున్న ఇండోనేసియాలో ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి. మొత్తం 80 శాతంపైగా పోలింగ్​ నమోదైంది. స్థానిక, పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికలన్నింటినీ ఒకే సారి ఏప్రిల్​ 17న నిర్వహించారు.

బ్యాలెట్​ పద్ధతిలో జరిగిన ఆ ఓటింగ్​లో అసలు తతంగం తర్వాత మొదలైంది. అదే లెక్కింపు. అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించగా... ఒక్కో ఓటరు 5 ఓట్ల వరకు వేయాల్సి వచ్చింది. ఆ ఓట్లన్నింటినీ అధికారులు స్వయంగా చేతితోనే లెక్కపెట్టాలి. అందుకు ఎంతో మంది సిబ్బంది అవసరం. అయితే.. తగిన ఏర్పాట్లు చేయడంలో మాత్రం విఫలమైంది ఎన్నికల సంఘం.

వందలాది ఓట్లను తక్కువ సిబ్బందితోనే లెక్కించడం వలన అలసటకు గురయ్యారు. ఏకంగా 272 మంది మృతిచెందారు. మరో 1878 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరికీ మెరుగైన వైద్యసేవలు అందించాలని ఇండోనేసియా వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

విపక్షాల ఆరోపణలు...

ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన ఎన్నికల విధానం ఇండోనేసియాది. ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గించాలన్న కారణంతో ఒకే విడత ఎన్నికలకు వెళ్లారు.

అదే ఇప్పుడు ఎంతో మంది మృతికి కారణమైందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల సంఘంపై, ఒకే విడత పోలింగ్​కు అనుమతించిన ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు. విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి పని ఒత్తిడి పెరిగిందని, ఎక్కువ సమయం పని చేయించడం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు.

కానీ.. షెడ్యూల్​ ప్రకారం ఎన్నికల సంఘం వీలైనంత త్వరగా ఓట్ల లెక్కింపు పూర్తి చేసి మే 22 నాటికి.. ఫలితాలు వెల్లడించాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details