కరోనా వైరస్ మూలాలపై పరిశోధన చేసేందుకు వుహాన్లో పర్యటిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) బృందానికి చైనా అధికారులు పూర్తి స్థాయి సహకారమందిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు సైట్ల సందర్శన కోసం తమ సిబ్బందికి చైనా అధికారులు అన్ని అనుమతులు ఇచ్చినట్టు డబ్ల్యూహెచ్ఓ నిపుణులు తెలిపారు.
డబ్ల్యూహెచ్ఓ బృందం.. తమ దర్యాప్తులో ఉన్న అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించిందని, ఇందులో ఎలాంటి అభ్యంతరాలూ లేవని బ్రిటీష్ సంతతి వ్యక్తి, జంతు శాస్త్రవేత్త పీటర్ దాస్జక్ తెలిపారు. ఈయన న్యూయార్క్ సిటీలోని ఎన్జీఓ ఎకోహెల్త్ అలయన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. తొలుత నిపుణులు.. తాము సందర్శించే ప్రదేశాలపై చైనా అధికారులకు వివరాలివ్వగా.. వారు సమగ్ర సమాచారం అందించినట్టు చెప్పారాయన.