తెలంగాణ

telangana

ETV Bharat / international

విద్యుత్‌ వాహనాల రాకతో విప్లవాత్మక మార్పు

పట్టణ రవాణా వ్యవస్థలను తలుచుకోగానే వాయు కాలుష్యాన్ని వెదజల్లుకుంటూ భారంగా వెళ్లే బస్సులు చటుక్కున గుర్తుకు వస్తాయి. అవి మన పక్కనుంచి వెళ్తున్న విషయాన్ని వాటి రొదే చెబుతుంది. మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చిన నగరాల్లోనూ ఇలాంటి దృశ్యాలు అనివార్యం. జనాభా పరంగా అతిపెద్ద దేశమైన చైనాలోని షెన్‌జెన్‌ నగరం మాత్రం దీనికి పూర్తి భిన్నం. వాటి విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

By

Published : Jan 8, 2020, 8:31 AM IST

polluition
చైనా...విద్యుత్‌ వాహనాల రాకతో విప్లవాత్మక మార్పు

చైనా ప్రజా రవాణా వ్యవస్థ ఇప్పుడు ప్రపంచానికి కొత్త దారి చూపిస్తోంది. ఎక్కువ మందిని రవాణా చేయడంలో కీలకంగా నిలిచే బస్సులు, ట్యాక్సీలు అక్కడ పూర్తిగా విద్యుత్‌ ఇంధనానికి మారిపోయాయి. తద్వారా నూరుశాతం కాలుష్య రహిత ప్రజా రవాణాకు మళ్ళిన తొలి నగరంగా షెన్‌జెన్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కాలుష్య భూతానికి కళ్లెం వేయాలని తపిస్తున్న ప్రపంచానికి, ముఖ్యంగా మెట్రో నగరాలకు చుక్కానిగా నిలిచింది.

ప్రభుత్వ చేయూత

నాలుగు దశాబ్దాల క్రితం షెన్‌జెన్‌, హాంకాంగ్‌కు చేరువగా ఓ చిన్న మత్స్యకార గ్రామం మాత్రమే. ఇప్పుడది మహా నగరంగా మారిపోయింది. జనాభా దాదాపు రెండు కోట్లు. అక్కడి అవసరాల రీత్యా ప్రజా రవాణాను మెరుగ్గా, కాలుష్య రహితంగా మార్చాలని చైనా ప్రభుత్వం సంకల్పించింది. అందుకుతగ్గ ప్రణాళికలను వేయడంతోపాటు అవసరమైన చోట రాయితీలు ఇవ్వడంతో పదేళ్లలోనే ఆ సంకల్పం కార్యరూపం దాల్చగలిగింది. షెన్‌జెన్‌లో బస్సులు 17 వేలు, క్యాబ్‌లు 20 వేల వరకు ఉన్నాయి. సొంత వాహనాలపై వెళ్లేవారు కాకుండా 20 లక్షల మంది ప్రజలు ఆ నగరంలో రాకపోకలు సాగిస్తుంటారు. పదేళ్ల క్రితం నగరంలో సంచారం అంటేనే షెన్‌జెన్‌వాసులు హడలెత్తిపోయేవారు. వారికి కాలుష్యం పెద్ద బెడదగా ఉండేది.

కాలుష్య కారకాలు భారీగా గాలిలో చేరి, ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసేవి. దీంతో చైనా సర్కారు పరిష్కార మార్గాల వైపు దృష్టి సారించింది. అలా 2011లో తొలిసారి విద్యుత్తు బస్సు నగర ప్రవేశం చేసింది. కాలుష్యానికి విరుగుడుగా ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజల నుంచీ యథాశక్తి మద్దతు లభించింది. వారూ సొంత వాహనాలకు స్వస్తిపలికి ప్రజారవాణా వ్యవస్థలను ఆదరించడం మొదలెట్టారు. ఆ క్రమంలో షెన్‌జెన్‌ నగరం వాయుకాలుష్య రహిత నగరంగా మారుతూ ప్రజలకు ఆహ్లాదం పంచసాగింది. దశాబ్దం వ్యవధిలో అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో నేడు ప్రపంచం దృష్టిని షెన్‌జెన్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది.

విద్యుత్​ వాహనాలతో మార్పులు

విద్యుత్‌ వాహనాల రాకతో షెన్‌జెన్‌ నగరంలో మరో మార్పును ప్రజలు గుర్తించారు. బస్సుల రణగొణ ధ్వనుల నుంచి వారికి ఉపశమనం లభించింది. వాహ శబ్దకాలుష్యం సైతం దాదాపు పూర్తిస్థాయిలో నియంత్రణకు వచ్చింది. నిశ్శబ్దంగా తిరుగుతున్న ప్రజారవాణా బస్సులు ప్రమాదకరంగా ఉంటున్నాయని షెన్‌జెన్‌ వాసులు ఇప్పుడు వాపోతుండటమే విడ్డూరం. అందువల్ల వారు బస్సు రాక తెలిసే విధంగా కొంతమేర శబ్దం ఉండాలని కోరుతున్నారంటే- ఆ నగరంలో పరిస్థితులు ఎంతగా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ప్రజల అభ్యర్థనను అక్కడి అధికార యంత్రాంగం ఇప్పుడు చురుగ్గా పరిశీలిస్తోంది కూడా. వాయు, శబ్ద కాలుష్యాలు అదుపులోకి రావడమే కాకుండా, ఇంధనంపై వ్యయాలు సగానికి సగం నియంత్రణలోకి వచ్చాయి.

విద్యుత్తు ఇంధన వాహనాలు కావడంతో ఏటా 1.60 లక్షల టన్నుల బొగ్గు వాడకం ఆగిపోయింది. నాలుగున్నర లక్షల టన్నుల బొగ్గుపులుసు వాయువు (కార్బన్‌ డయాక్సైడ్‌) గాలిలోకి కలవకుండా నిరోధించగలిగారు. నైట్రోజన్‌ ఆక్సైడ్‌, హైడ్రోకార్బన్ల ఉద్గారాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఆ మేరకైనా వాతావరణం స్వచ్ఛంగా మారింది. నిజానికి ఇదంతా ఆషామాషీగా జరిగిపోలేదు. ఒక్కో విద్యుత్తు బస్సు కొనుగోలు కోసం దాదాపు 18 లక్షల యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.1.85 కోట్లు) వ్యయపరచారు. ఇందులో సగం నిధుల్ని చైనా ప్రభుత్వం రాయితీగా అందజేసింది. ప్రజల ఆదరణ పొందడానికి టికెట్‌ రుసుం విషయంలోనూ తగ్గింపు ప్రకటించింది. స్థానిక సంస్థలూ తమ వంతు చేయూతను అందించాయి.

విద్యుత్‌ బస్సుల నిర్వహణలో సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వపరంగా అనేక ముందుజాగ్రత్త చర్యలు తీసుకొన్నారు. వాహనాలకు విద్యుత్తు కోసం, పెట్రోలు బంకులు మాదిరిగా ఎక్కడికక్కడ ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. నగరంలోని 180 డిపోల్లోనే కాకుండా వివిధచోట్ల 40 వేల వరకు వీటిని నెలకొల్పారు. రెండు గంటలు ఛార్జింగ్‌తో వాహనాలు 200 కి.మీ. తిరుగుతాయి. బస్సులకే కాకుండా క్యాబ్‌లకూ ఈ కేంద్రాలు ఛార్జింగ్‌ సేవలను అందజేస్తున్నాయి. యాప్‌ల్లోనే వాహన చోదకులు ఛార్జింగ్‌ కేంద్రాల వివరాలను చూసుకోవచ్చు. షెన్‌జెన్‌ నగరంలో సాధించిన పర్యావరణ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరో 30 నగరాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించడానికి చైనా ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ప్రజారవాణా వ్యవస్థలను వంద శాతం విద్యుత్తు ఇంధనం బాట పట్టించడానికి లండన్‌, న్యూయార్క్‌ వంటి మహా నగరాలు సిద్ధమవుతున్నాయి. మరో 20 ఏళ్ల వ్యవధిలో నగరాలను విద్యుత్‌ వాహనాలతో నింపేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి.

భారత్​ పరిస్థితి ఏమిటి?

భారతదేశంలో దాదాపు 16 లక్షల బస్సులు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నవి రమారమి 1.70 లక్షలు. దేశవ్యాప్తంగా రైళ్లలో రోజూ దాదాపు 2.3 కోట్ల మంది ప్రయాణిస్తుంటే, అంతకు మూడింతలమంది బస్సుల్లో సంచరిస్తున్నారు. జనాభా వృద్ధి కంటే వాహనాల వృద్ధి రేటుగా ఎక్కువగా ఉందనడం నిష్ఠురసత్యం. వాటిలో సింహభాగం ద్విచక్ర వాహనాలదే. విద్యుత్తు వాహనాల వాడుక దిశగా భారత్‌ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. ఒకపక్క బీఎస్‌-6 ప్రమాణాలున్న ఇంధన వినియోగానికి మారడం, నూతన భద్రత ప్రమాణాల పాటింపు కలిసి వాహన రంగ పరిశ్రమను విద్యుత్తు వినియోగం వైపు తీసుకువెళ్లబోతున్నాయి. వాహనాల ధరతో పాటు ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటే పెద్ద సవాలుగా నిలుస్తోంది.

గణాంకాలు

ఇటీవలే దేశవ్యాప్తంగా 2,636 ఛార్జింగ్‌ కేంద్రాలను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటన్నింటిలో 14 వేల పైచిలుకు ఛార్జింగ్‌ పాయింట్లు వస్తాయి. సత్వరం ఛార్జింగ్‌ అయ్యేవి వీటిలో 1,600 పైగా ఉంటాయి. కాస్త ఎక్కువ ధర భరించి కార్లు, బస్సులు కొనుక్కున్నా మార్గమధ్యంలో ఛార్జింగ్‌ చేసుకోవడం ఎలా అనే సందేహాలున్నవారికి ఇది ఊరట కలిగించే నిర్ణయమే. కేంద్రం మంజూరు చేసిన కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 266, తెలంగాణలో 138 రానున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 317 వస్తాయి. 24 రాష్ట్రాల్లోని 62 నగరాలకే ఈ కేంద్రాలన్నీ పరిమితం. మున్ముందు ఇలాంటివి మరికొన్ని వస్తే అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇవి ఏర్పాటవుతాయి. ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేయించడంతో పాటు నగరపాలక సంస్థలు, విద్యుత్తు పంపిణీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఈ వ్యవస్థను విస్తృతం చేయనుంది. పారిశ్రామిక, వాహన కాలుష్యాలతో కునారిల్లుతున్న నగరాలకు ఊరటనిచ్చే విద్యుత్తు వాహనాలకు ప్రభుత్వాలు మరింతగా వెన్నుదన్నుగా నిలిస్తే ఎన్నో రకాల వాయు శబ్ద కాలుష్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

- మునగవలస శ్రీనివాస పట్నాయక్‌

ఇదీ చూడండి: 'ముసుగు వ్యక్తుల సమాచారముంటే మాకివ్వండి'

ABOUT THE AUTHOR

...view details