తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరాస భద్రతా మండలిలో భారత్ అజెండా ఇదేనా!

ఐరాస భద్రతా మండలిలో రెండేళ్ల సభ్యత్వ కాలాన్ని ఉగ్రవాద నిర్మూలనకు ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. ఉగ్రవాదానికి ఊతమిచ్చే చర్యలను శాశ్వతంగా నిరోధించే బహుళపాక్షిక వ్యవస్థల బలోపేతానికి కృషిచేస్తామని ఐరాసలో భారత ప్రతినిధి స్పష్టం చేశారు.

By

Published : Jun 18, 2020, 7:50 PM IST

UN-INDIA-ENVOY-TERRORISM
ఐరాస భద్రతామండలి

ఉగ్రవాద నిర్మూలన ప్రధాన అజెండాగా ఐరాస భద్రతా మండలి సభ్యత్వాన్ని ఉపయోగించుకోనుంది భారత్. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన అంతర్జాతీయ సంస్థ.. భద్రతా మండలిలో రెండేళ్ల పాటు సభ్య దేశంగా ఉండనుంది భారత్​. ఉగ్రవాదానికి ఊతమిచ్చే చర్యలను శాశ్వతంగా నిరోధించే బహుళపాక్షిక వ్యవస్థల బలోపేతానికి కృషిచేస్తామని ఐరాసలో భారత ప్రతినిధి స్పష్టం చేశారు.

ఈ సమయంలో ఉగ్రవాదంపై సమగ్ర విధివిధానాలను రూపొందించే దిశగా కృషి చేయనున్నట్లు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్​ తిరుమూర్తి స్పష్టం చేశారు.

"మండలిలో భారత ప్రాధాన్యతల్లో ఉగ్రవాదం అనే పదం సాధారణంగానే ఉంటుంది. ఈ రెండేళ్లలో ఉగ్రవాద వ్యతిరేక నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు ప్రయత్నిస్తాం. ఐటీ, కమ్యూనికేషన్ సాంకేతికతను ఉగ్రవాదం కోసం దుర్వినియోగం చేయటం, ఉగ్రసంస్థలకు నిధుల సేకరణ, అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలు వంటి కీలకమైన సమస్యలను పరిష్కరించేందుకు బహుళపాక్షిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం."

- టీఎస్ తిరుమూర్తి, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి

ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ ఒప్పందాలు, టాస్క్​ఫోర్స్​లకు భారత్​ ప్రాధాన్యం ఇస్తూ వచ్చిందని తిరుమూర్తి స్పష్టంచేశారు. ఉగ్రవాద నేర వ్యవస్థలపై పోరాడేందుకు పారిస్​ ఆధారిత ఎఫ్​ఏటీఎఫ్​ వంటి సంస్థల అవసరం ఎంతో ఉందని భావిస్తుందన్నారు.

సీసీఐటీ నిర్వహణపై..

ఇదే విధంగా అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు (సీసీఐటీ) కూడా ఉపయోగపడుతుందని భారత్ అభిప్రాయపడుతోంది. అందువల్లనే దీర్ఘకాలంగా నిలిచిపోయిన ఈ సదస్సును నిర్వహించాలని భారత్ పిలుపునిచ్చింది.

ఐరాసలో సీసీఐటీపై ముసాయిదా పత్రాన్ని భారత్​ 1986లో ప్రతిపాదించింది. కానీ, సభ్య దేశాలలో ఉగ్రవాద నిర్వచనంపై ఏకాభిప్రాయం లేనందున దీన్ని అమలు చేయలేకపోయారు.

ఏకగ్రీవ ఎన్నిక..

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ)లో ఐదు తాత్కాలిక సభ్యదేశాల కోసం బుధవారం (జూన్‌ 17న) ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారత్​ ఘన విజయం సాధించింది. తాత్కాలిక సభ్య దేశాల కోసం ఎలాంటి ప్లీనరీ సమావేశం లేకుండానే రహస్య బ్యాలెట్​ ద్వారా ఎన్నికలు నిర్వహించారు. 2021-22 కాలపరిమితి​ కోసం జరిగే ఈ ఎన్నికల్లో ఆసియా- పసిఫిక్‌ స్థానానికి భారత్‌ మాత్రమే పోటీలో ఉన్నందున ఏకగ్రీవంగా ఎన్నికైంది.

ఇదీ చూడండి:ఐరాస భద్రతామండలి ఎన్నికల్లో భారత్ ఘన విజయం​

ABOUT THE AUTHOR

...view details