తెలంగాణ

telangana

By

Published : Apr 9, 2020, 10:51 AM IST

ETV Bharat / international

భారత్ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోం: ట్రంప్

హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతికి భారత ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీని అద్భుతమైన వ్యక్తిగా కొనియాడిన ట్రంప్.. భారత సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోమని వ్యాఖ్యానించారు. స్పందించిన మోదీ.. కొవిడ్-19పై పోరాటంలో భారత్ సాధ్యమైన సాయం చేస్తుందని స్పష్టం చేశారు. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సోనారో సైతం మోదీ సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.

trump modi
ట్రంప్ మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్(హెచ్​సీక్యూ) ఎగుమతికి భారత్ అనుమతించిన నేపథ్యంలో మోదీని అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు ట్రంప్. ఆపద సమయంలో భారత్ చేస్తున్న సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు.

కరోనాపై పోరాటంలో భారత ప్రజలకే కాకుండా మొత్తం మానవత్వానికే సహాయం చేశారని మోదీని కొనియాడారు ట్రంప్. ప్రధాని బలమైన నాయకత్వానికి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు.

"మా అభ్యర్థన మేరకు ఔషధాల ఎగుమతికి అనుమతి ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఆయన ఓ అద్భుతమైన వ్యక్తి. ఈ సహాయాన్ని మేం గుర్తుంచుకుంటాం. అసాధారణ సమయంలో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరం. హెచ్​సీక్యూపై నిర్ణయం తీసుకున్నందుకు భారత దేశానికి, ప్రజలకు ధన్యవాదాలు. దీన్ని ఎప్పటికీ మర్చిపోము."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

మోదీ రిప్లై

అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్​పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కొవిడ్-19కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్ సాధ్యమైన సహాయం చేస్తుందని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.

"అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దానితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇలాంటి సమయాలు స్నేహితులను మరింత దగ్గరకు చేర్చుతాయి. కొవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారత్ సాధ్యమైన సహాయం చేస్తుంది. ఈ పోరాటాన్ని కలిసి గెలవాలి."

-నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

బ్రెజిల్ అధ్యక్షుడు సైతం

బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సోనారో సైతం ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ఈ విషయం ప్రస్తావించారు.

"భారత ప్రధానితో నేరుగా మాట్లాడిన ఫలితంగా.. కొవిడ్-19 చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉత్పత్తి కోసం ముడి సరుకులు మనకు(బ్రెజిల్ కు) రానున్నాయి. ఇందుకు మోదీకి ధన్యవాదాలు"

-జైర్ బొల్సోనారో, బ్రెజిల్ అధ్యక్షుడు

డిమాండ్ ఉన్న డ్రగ్

ప్రపంచంపై విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ఈ ఔషధానికి అన్ని దేశాల్లో డిమాండ్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం హెచ్​సీక్యూ సరఫరాలో 70 శాతం భారత్ నుంచే ఉత్పత్తి అవుతోంది. దీంతో తొలుత ఈ డ్రగ్ ఎగుమతిపై నిషేధం విధించింది కేంద్రం. దేశంలో తగిన నిల్వలు ఉన్న కారణంగా ఇటీవలే నిషేధాన్ని సడలించింది.

ABOUT THE AUTHOR

...view details