తెలంగాణ

telangana

By

Published : Apr 29, 2020, 6:29 AM IST

ETV Bharat / international

వ్యాక్సిన్​ ట్రయల్స్​ విస్తరణకు ఆక్స్​ఫర్డ్​ సన్నద్ధం!

కరోనాపై పోరులో భాగంగా వ్యాక్సిన్​ ప్రయోగాలను విస్తరించేందుకు ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. మే చివరి నాటికి 6వేల మందిపై వ్యాక్సిన్​ పరీక్షలు జరపనున్నట్టు ఓ నివేదిక పేర్కొంది.

Oxford scientists set to expand trials of COVID-19 vaccine
వ్యాక్సిన్​ ట్రయల్స్​ విస్తరణకు ఆక్స్​ఫర్డ్​ సన్నద్ధం!

కరోనా వైరస్​పై పోరులో భాగంగా వ్యాక్సిన్​ తయారీకి తీవ్రంగా శ్రమిస్తున్నారు ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఇప్పటికే వాలంటీర్లపై వ్యాక్సిన్​ను పరీక్షిస్తున్నారు. అయితే ఈ ట్రయల్స్​కు సంబంధించిన ఫలితాలు వెలువడిన అనంతరం వ్యాక్సిన్​ పరీక్షలను విస్తరించే అవకాశముందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

"ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ ఈ నెల 23న వ్యాక్సిన్​ ట్రయల్స్​ ప్రారంభించింది. వచ్చే నెలలో 800మంది వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్​ను పరీక్షించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. యూకేలో ట్రయల్స్​ విజయవంతమైతే.. కెన్యా వైద్య పరిశోధనా సంస్థలోని శాస్త్రవేత్తలను సంప్రదిస్తాం. కెన్యాలో పరీక్షలు నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వాన్ని అనుమతులు కోరతాం."

-- ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ బృందం.

అయితే మే చివరి నాటికి సుమారు 6వేల మందిపై వ్యాక్సిన్​ ట్రయల్స్​ నిర్వహించాలని శాస్త్రవేత్తలు యోచిస్తున్నట్టు న్యూయార్క్​ టైమ్స్​ ఓ నివేదికలో పేర్కొంది. ఒకవేళ ఈ ట్రయల్స్​ సత్ఫలితాలనిస్తే.. సెప్టెంబర్​ నాటికి మిలియన్​ డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశముందని వెల్లడించింది.

అమెరికాలోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​కు చెందిన రాకీ మోంటైన్​ ల్యాబొరేటరీలో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. వైరస్​పై పోరులో భాగంగా రిసాస్​ మకాక్​ అనే కోతి జాతికి ఈ వ్యాక్సిన్​ను అందించారు. మంచి ఫలితాలు వచ్చాయి. అప్పుడే మానవులపైనా ఈ వ్యాక్సిన్​ పనిచేస్తుందన్న ఆశ కలిగింది. అయితే ఇది కేవలం ట్రయల్స్​ దశలో ఉన్నందున ఇప్పుడప్పుడే ఏ విషయం చెప్పలేమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details