తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా అందరిదీ.. వివక్షకు తావులేదు: జో బైడెన్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిగా జో బైడెన్‌ను ఎన్నుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది డెమొక్రాటిక్‌ పార్టీ. నాలుగు రోజుల పాటు జరిగిన పార్టీ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అందరిదని, ఇక్కడ వివక్షకు తావుండబోదన్నారు.

By

Published : Aug 22, 2020, 9:16 AM IST

Joe Biden: Who He Is and What He Stands For
అమెరికా అందరిదీ..వివక్షకు తావులేదు : జో బైడెన్‌

అమెరికా అందరిదీ అన్న ప్రతిజ్ఞను పునరుద్ధరించడమే తదుపరి అధ్యక్షుని విధి అని జో బైడెన్‌ అన్నారు. ఆ కర్తవ్యాన్ని తాను నెరవేరుస్తానని తెలిపారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థిగా ఆయన పేరును డెమొక్రాటిక్‌ పార్టీ అధికారికంగా ప్రకటించింది. గురువారం జరిగిన ఆ పార్టీ నాలుగు రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన 'అభ్యర్థిత్వ అంగీకార' ప్రసంగాన్ని చేశారు. అమెరికా అందరిదీ అన్న వాగ్ధానాన్ని తాను ఒంటరిగా అమలు చేయనని అన్నారు. ఉపాధ్యక్షురాలి రూపంలో బలమైన గళం అండగా ఉంటుందంటూ కమలాహారిస్‌ను పరిచయం చేశారు. అమె కథ అందరి అమెరికన్ల చరిత్ర అని చెప్పారు.

మనం సిద్ధమా?

ప్రస్తుత దేశ పరిస్థితులను వివరిస్తూ "వందేళ్లలో ఎప్పుడూలేని విధంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాం. ఆర్థిక రంగం సంక్షోభంలో ఉంది. జాత్యహంకార దాడులను, వివక్షను ఎదుర్కొంటున్నాం. పర్యావరణ సమస్యలు శ్రుతి మించాయి. నేను అధికారంలోకి వస్తే మొదటి రోజున చేసే పని కరోనాను నివారించడం" అన్నారు. అమెరికాలోని కఠోర వాస్తవాలు చూసిన తరువాత మార్పులకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 'మార్పులకు మనం సిద్ధమా? తయారుగా ఉన్నామని నమ్ముతున్నా' (ఆర్‌ వి రెడీ? ఐ బిలీవ్‌ వి ఆర్‌) అని నినదించారు. "అధ్యక్షునిగా నేను అమెరికాను రక్షిస్తా. కనిపించిన, కనిపించని దాడుల నుంచి అన్ని వేళలా... కాపాడతానని, వెలుగుకు భాగస్వామిగా ఉంటానని వాగ్ధానం చేస్తున్నా" అని ప్రకటించారు.

బాంబే బైడెన్‌ ప్రస్తావన

బైడెన్‌ తన ప్రసంగంలో ముంబయి (బాంబే) బైడెన్‌ గురించి ప్రస్తావించారు. ఆయన 29 ఏళ్ల వయసులో తొలిసారిగా సెనేట్‌కు ఎన్నికయినప్పుడు ‘బాంబే నుంచి బైడెన్‌’ పేరుతో ఓ లేఖ వచ్చింది. అయితే ఆయన ఎవరో ఇంతవరకు తెలుసుకోలేకపోయారు. ఆయన ఆచూకీ తెలిస్తే చెప్పాలని తాజాగా కోరడం గమనార్హం. గతంలో అమెరికా సర్జన్‌ జనరల్‌గా పనిచేసిన ఇండియన్‌-అమెరికన్‌ వివేక్‌ మార్తి (43) మాట్లాడుతూ అమెరికాకు అన్నీ ఉన్నా నాయకత్వం లేదని, అందువల్లనే కరోనా అదుపులోకి రాలేదని చెప్పారు. బైడెన్‌ వస్తే నాయకత్వ పటిమతో దేశానికి సాంత్వన చేకూరుస్తారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details