కరోనా శరీరంలోకి ప్రవేశించడానికి అవసరమైన రెండు ప్రోటీన్లు నాసికా కుహరంలో వాసనను గుర్తించే కణాల ద్వారా ఉత్పత్తి అవుతున్నాయని ఓ పరిశోధనలో తేలింది. దీనిని శాస్త్రవేత్తలు ఎలుకల్లో గుర్తించినట్లు తెలిపారు. కొంతమంది కొవిడ్-19 బాధితులకు పూర్తిగా లేదా పాక్షికంగా వాసన గుర్తించే శక్తిని ఎందుకు కోల్పోతున్నారో ఈ పరిశోధన ద్వారా కనుకొనవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పరిశోధనకు సంబంధించిన పలు అంశాలను 'ఏసీఎస్ కెమికల్ న్యూరోసైన్స్' జర్నల్లో ప్రచురించారు. చిన్న వాటి కంటే పెద్ద వయస్సు గల జంతువుల్లో అధికంగా ఈ ప్రోటీన్లు ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు.
అది తెలిస్తే వ్యాధి నిర్ధరణ సులభం!
కరోనా బాధితులు వాసన కోల్పోవడానికి కారణం తెలిస్తే... కచ్చితమైన రోగనిర్ధరణకు సహాయపడుతుందని అమెరికాలోని రెనో స్కూల్ ఆఫ్ మెడిసన్ పరిశోధకులు చెప్పారు. ఇప్పటికి సార్స్-కోవ్-2లో చాలా రహస్యాలు దాగి ఉన్నాయని, అందులో వాసన కోల్పోవడానికి కారణం ఏమిటో అంతుపట్టడం లేదన్నారు. ఇతర కొవిడ్-19 లక్షణాలు లేనివారిలో కూడా ఇది కనిపిస్తున్నట్లు వివరించారు.
వాటిని హైజాక్ చేసి...
మానవ కణాలపై దాడి చేయడానికి ఏసీఈ2, టీఎంపీఆర్ఎస్ఎస్2 అనే రెండు ప్రోటీన్లను వైరస్ హైజాక్ చేస్తుందని అధ్యయనంలో గుర్తించారు. అయితే ఘ్రాణ ఎఫిథీలీయంలోని ఏ కణాలు ఈ ప్రోటీన్లను ప్రేరేపిస్తాయన్నది తెలియలేదని పేర్కొన్నారు.
అధ్యయనంలో భాగంగా ఎలుకలోని ఆ రెండు ప్రోటీన్లు, వయసును బట్టి వాటి పెరుగుదలలో మార్పులు గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు.