తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆర్జీవీ X నట్టికుమార్​.. 'కోర్టులోనే తేల్చుకుందాం'!

'డేంజరస్​' (మా ఇష్టం) చిత్రం విషయంలో గత కొన్నిరోజులుగా దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ, నిర్మాత నట్టికుమార్​ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆర్జీవీ.. నట్టి కుమార్​పై పరువునష్టం దావా వేస్తున్నట్లుగా ప్రకటించి ప్రెస్​​నోట్​ రిలీజ్​ చేశారు. ఆ వెంటనే నట్టి కుమార్​ కూడా మరో ప్రెస్​నోట్​ విడుదల చేశారు.

By

Published : Apr 20, 2022, 11:23 PM IST

RGV NATTI KUMAR
RGV NATTI KUMAR

RGV Natti Kumar Issue PressNotes: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'డేంజరస్'(మా ఇష్టం) సినిమా విషయంలో ఇటీవల నట్టికుమార్ కొన్ని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత వర్మ కూడా ఓ వీడియోను విడుదల చేసి 'నట్టి కుమార్ సంగతి చూస్తా.. కోర్టులోనే తేల్చుకుంటాను' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా పోస్ట్​పోన్ అవడం, ఆ తర్వాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం లాంటివి జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నట్టికుమార్​కు వర్మ గట్టి షాకిచ్చారు. బుధవారం సాయంత్రం నట్టి కుమార్ ఫోర్జరీ డాక్యూమెంట్స్‌తో మోసం చేశాడని చెబుతూ.. అతడిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లుగా వర్మ ఓ ప్రెస్​నోట్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్​నోట్‌కి ధీటుగా నట్టి కుమార్ కౌంటర్ వేస్తూ.. తన తరపు నుంచి కూడా ఓ ప్రెస్​నోట్‌ని రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే..

"రామ్​గోపాల్ వర్మ.. నువ్వు, అలాగే నీ తాత్కాలిక మరో స్నేహితుడు రామసత్యనారాయణ ఆడుతున్న నాటకాలు ఎవరికి తెలియవు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లతో స్నేహం నటించి, వారి చేత నీ సినిమాలకు పెట్టుబడులు పెట్టించుకుని, ఆ తర్వాత మోసగించడం నీకు తెలిసినంతగా బహుశా సినీ పరిశ్రమలో ఇంకెవరికీ తెలియకపోవచ్చు. మోసపోయిన వాళ్లంతా బయటకు వచ్చి, నీ నిజ స్వరూపాన్ని ఇంతవరకు బయట పెట్టకపోవడం వల్లే, ఇంకెందరో నీ చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. నీ పాపాలు పండే సమయం ఆసన్నమైంది. అందుకే నీకు విపరీత బుద్దులు పుట్టి, ఈ విధంగా వ్యవహరిస్తున్నావు. మా ఇష్టం (డేంజరస్), హిందీ 'ఖత్రా' చిత్రం విడుదలపై మేము స్టే తేవడం వల్ల ఆగిపోయిన విషయం తెలిసిందే. అది జరిగిపోయిన ఇన్ని రోజుల వరకు మెదలకుండా ఉండి.. ఇప్పుడు ఓ నీచమైన పథకం రచించి, ఓ ప్రెస్ నోట్‌తో బయటకు వచ్చిన నీ కుట్రలు ఎలాంటి వారికైనా ఇట్టే అర్ధమైపోతాయి. నీ సినిమాకు ఖర్చు లేకుండా సులువుగా పబ్లిసిటీ తెచ్చుకోవడం కోసం ఇలాంటి రచన చేశావు. అయినా ఈ మేటర్ కోర్టు పరిధిలో ఉంది. నువ్వు చేసిన ఆరోపణలను ఖండించకపోతే డబ్బు విషయంలో నీ చేతిలో మోసపోయిన మమ్ముల్ని కూడా నీ గురించి తెలియనివాళ్లు తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం ఉంది. అందుకే సూటిగా ఈ సమాధానం చెబుతున్నాను"

- నట్టి కుమార్​, నిర్మాత

"నీవు స్వయంగా ఇచ్చిన డాక్యూమెంట్స్‌ను కూడా ఫోర్జరీ అంటున్నావంటే.. నీది ఎలాంటి క్రిమినల్ మెంటాలిటీనో అర్ధం చేసుకోవచ్చు. నువ్వు ఇచ్చిన ఈ చెక్కులు, నీ బ్యాంకు అకౌంట్‌లు కూడా ఫోర్జరీ‌నే అంటావా?. ఎట్టిపరిస్థితులలో నీ నిగ్గు తేలుస్తాం. మేము కోర్టుకు వెళ్ళి, ఆధారాలు పెట్టి మరీ స్టే తెచ్చాం. నువ్వు ఎలాంటి ఆధారాలు లేకుండానే.. మాకు నువ్వు స్వయంగా ఇచ్చినవే ఫోర్జరీ డాక్యూమెంట్స్ అంటున్నావు అంటే నీ నిజ స్వరూపం, నమ్మక ద్రోహం ఎలాంటిదో ఇట్టే చెప్పవచ్చు. ఎంత మోసగాడివైనా, నిన్ను అంత సులువుగా వదలి పెడతామని అనుకోవద్దు. తోటి నిర్మాతలను, అలాగే ఎంతోమంది పరిశ్రమలోని వారిని మోసం చేస్తున్న వర్మకు వంత పాడుతూ, ఈ పాపంలో పాలు పంచుకుంటున్న రామసత్యనారాయణ ఈ పాపాన్ని మోస్తున్నందుకు నువ్వు అనుభవించక తప్పదు. లీగల్‌గా కోర్టు ద్వారా ఈ విషయాలన్నింటిని తేల్చుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను" అని వర్మపై నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుమందు ఆర్జీవీ విడుదల చేసిన ప్రెస్​నోట్​లో ఏముందంటే..

"గత కొద్ది రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్న నట్టి కుమార్, క్రాంతి, కరుణల విషయమై ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను. ఏప్రిల్ 8, 2022న మూడు భాషల్లో రిలీజ్‌కి సిద్దంగా ఉన్న నా డేంజరస్ చిత్రాన్ని ఆపటానికి నట్టి క్రాంతి, కరుణలు కుట్ర పన్ని, ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా 5వ జూనియర్ సివిల్ జడ్జి, సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారు. కోర్టు ఇచ్చిన ఇంజక్షన్​ ఆర్డర్‌ను ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. నేను ఇప్పుడు నట్టి క్రాంతి, కరుణల మీద ఫోర్జరీకి సంబంధించిన కేసే కాకుండా, వివిధ మీడియా ఛానళ్లలో నాపై వేసిన నిందలు, ఆరోపణలకు సంబంధించి నట్టి క్రాంతి, కరుణల తండ్రి అయిన నట్టి కుమార్ మీద.. నేను, తుమ్మలపల్లి రామసత్యనారాయణగారు డిఫమేషన్ కేసు వెయ్యటమే కాకుండా రిలీజ్​కి ముందు ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్‌ని ఉపయోగించి సినిమాని ఆపి, మాకు అపారమైన ఆర్థిక నష్టం కలిగించినందుకు డ్యామేజ్ కేసు కూడా వెయ్యబోతున్నాము"

- రామ్​గోపాల్​ వర్మ, దర్శకుడు

"ఇప్పుడు విడుదల చేసేందుకు క్లియరెన్స్‌ ఆర్డర్ వచ్చింది కనుక డేంజరస్ చిత్రాన్ని మే 6న విడుదల చేయబోతున్నాము. దానికి సంబంధించి మాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ లు కూడా పబ్లిక్ డొమైన్‌లో పెడుతున్నాము. ఫోర్జరీ చేసి, దానిని నిజమైన డాక్యుమెంట్‌గా ఉపయోగించడం ద్వారా నట్టి క్రాంతి, నట్టి కరుణలు చేసిన క్రిమినల్ చర్యలకి సంబంధించిన విషయాలు, అలాగే పైన పేర్కొన్న ఇంజక్షన్-ఆర్డర్‌ను నట్టిలు సేకరించిన విధానాన్ని, యంత్రాంగాన్ని దుర్వినియోగ పరుచుకున్న తీరు.. నట్టి ఫ్యామిలీ నేరపూరిత స్వభావాన్ని తెలియజేస్తుంది. ఈ ప్రెస్​నోట్ తప్ప, ఇకపై నేను ఈ విషయంపై ఇంకేం మాట్లాడను.. వాళ్ల పైన చట్టపరమైన చర్యలపై మాత్రమే దృష్టి పెడతాను. అతి త్వరలో వాళ్ల అసలు రూపం బయటపడబోతోంది"’ అని వర్మ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'నాన్నతో కలిసి నేను సినిమా చేయాలన్నది అమ్మ కల'

ABOUT THE AUTHOR

...view details