తెలంగాణ

telangana

By

Published : May 31, 2022, 6:42 AM IST

ETV Bharat / entertainment

వానాకాలంలో వినోదాల జల్లు.. యువ హీరోలదే హవా

వేసవిలో అగ్ర తారలు సందడి చేయగా.. వానాకాలంలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు కుర్ర హీరోలు. నెలల వ్యవధిలోనే ఒక్కో హీరో రెండు నుంచి మూడు సినిమాలతో సందడి చేయనున్నారు. ఆ హీరోలు ఎవరు? ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

Movies of young heroes ready for release in the rainy season
వానాకాలంలో వినోదాల జల్లు.. యువ హీరోలదే హవా

వేసవి సినీ మారథాన్‌ ముగిసింది. అగ్రతారల మెరుపులతో సినీ సీమ కొత్త సొబగులద్దుకుంది. ఇక ఇప్పుడు యువ హీరోల వంతు. వేసవి జోష్‌ని కొనసాగిస్తూ.. వినోదాల జల్లుల్లో తడిపేందుకు సిద్ధమవుతున్నారు కుర్ర కథానాయకులు. ఈ వానాకాలంలో పసందైన వినోదాల్ని వేడి వేడిగా వడ్డించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో నెలల వ్యవధిలో వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ ముందు సందడి చేయనున్న యువ హీరోలూ ఉన్నారు. మరి వారెవరు? ఆ చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి.

కార్తి.. ముచ్చటగా మూడు

కార్తి

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో జోరు చూపిస్తుంటారు కథానాయకుడు కార్తి. ప్రస్తుతం ఆయన 'విరుమన్‌', 'పొన్నియిన్‌ సెల్వన్‌', 'సర్దార్‌' సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మూడు చిత్రాలు వరుస నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో తొలుత బాక్సాఫీస్‌ ముందుకు రానున్న చిత్రం 'విరుమన్‌'. ఎం.ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్ట్‌ 31న విడుదల కానుంది. తర్వాత నెల రోజులకే 'పొన్నియిన్‌ సెల్వన్‌'తో వినోదాలు పంచనున్నారు. మణిరత్నం తెరకెక్కించిన భారీ పీరియాడికల్‌ చిత్రమిది. చోళుల కాలం నాటి చారిత్రక కథాంశంతో రూపొందిన ఈ సినిమా.. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగాన్ని సెప్టెంబర్‌ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక కార్తి - పి.ఎస్‌.మిత్రన్‌ కలయికలో రూపొందిన సినిమా 'సర్దార్‌'. రాశి ఖన్నా కథానాయిక. సరికొత్త స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చైతూ.. డబుల్‌ ట్రీట్‌

నాగ చైతన్య

గతేడాది 'లవ్‌స్టోరీ'తో భారీ విజయాన్ని అందుకున్న నాగచైతన్య తర్వాత తెలుగులో 'థ్యాంక్‌ యూ', హిందీలో 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమాల్లో నటించారు. ఇప్పుడీ రెండు సినిమాలు ఒకదాని వెంట మరొకటి బాక్సాఫీస్‌ ముందుకు వరుస కట్టనున్నాయి. అయితే వీటిలో ముందుగా ప్రేక్షకుల్ని పలకరించనున్న చిత్రం 'థ్యాంక్‌ యూ'నే. 'మనం' వంటి హిట్‌ తర్వాత చైతన్య - విక్రమ్‌.కె.కుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రమిది. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించారు. రాశి ఖన్నా, మాళవిక నాయర్‌, అవికా గోర్‌ కథానాయికలు. వినూత్నమైన ప్రేమ కథాంశంతో రూపొందిన ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చైతూ మూడు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనుండటం విశేషం. ఇది విడుదలైన మరుసటి నెలలోనే ఆగస్ట్‌ 11న 'లాల్‌ సింగ్‌ చద్దా'తో మరోమారు సినీప్రియుల ముందుకు రానున్నారు చైతన్య. ఇది ఆయన నటించిన తొలి బాలీవుడ్‌ సినిమా. ఆమీర్‌ఖాన్‌ హీరోగా నటించారు.హాలీవుడ్‌లో విజయవంతమైన 'ఫారెస్ట్‌ గంప్‌'నకు రీమేక్‌గా రూపొందింది. ఇందులో ఆమిర్‌ స్నేహితుడిగా బాలా అనే ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు చైతూ. ట్రైలర్‌ ప్రచార చిత్రంలో యుద్ధ నేపథ్యంలో ఆమిర్‌, చైతన్య మధ్య వచ్చిన సన్నివేశాలు హత్తుకునేలా ఉన్నాయి.

రెండు నెలలు.. రెండు థ్రిల్లర్లు

అడివి శేష్​

'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' చిత్రాలతో వరుస విజయాలందుకొని జోరు మీదున్నారు అడివి శేష్‌. కొవిడ్‌ పరిస్థితుల వల్ల రెండేళ్లుగా బాక్సాఫీస్‌ ముందుకు రాలేకపోయిన ఆయన.. ఇప్పుడు 'మేజర్‌', 'హిట్‌2' సినిమాలతో ప్రేక్షకులకు డబుల్‌ ట్రీట్‌ ఇవ్వనున్నారు. ఈ రెండూ ఒక నెల వ్యవధిలోనే బాక్సాఫీస్‌ ముందుకు రానున్నాయి. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా రూపొందిన చిత్రమే 'మేజర్‌'. శశికిరణ్‌ తిక్క తెరకెక్కించారు. ఇది జూన్‌ 3న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్ర హడావుడి ముగిసిన వెంటనే 'హిట్‌2 ద సెకండ్‌ కేస్‌'తో థియేటర్లలో సందడి చేయనున్నారు అడివి శేష్‌. విష్వక్‌సేన్‌ నటించిన 'హిట్‌'కు కొనసాగింపుగా రూపొందిన చిత్రమిది. శైలేష్‌ కొలను తెరకెక్కించారు. ప్రశాంతి తిప్పిరినేని నిర్మాత. నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన ఇన్వెస్టిగేషన్‌ డ్రామా కథతో రూపొందిన ఈ సినిమా జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది.

సత్యదేవ్‌.. ఒకే నెలలో రెండు

సత్య దేవ్​

వైవిధ్యభరితమైన పాత్రల్లో మెప్పిస్తున్న సత్యదేవ్‌ ఒకే నెలలో 'గాడ్సే', 'గుర్తుందా శీతాకాలం' సినిమాలతో సినీప్రియుల్ని పలకరించనున్నారు. వీటిలో ముందుగా సందడి చేయనున్న సినిమా 'గాడ్సే'. 'బ్లఫ్‌ మాస్టర్‌' ఫేమ్‌ గణేష్‌ పట్టాభి తెరకెక్కించిన చిత్రమిది. సి.కల్యాణ్‌ నిర్మించారు. ఈ సినిమా జూన్‌ 17న విడుదల కానుంది. ఇందులో సత్యదేవ్‌ రాజకీయ వ్యవస్థను ప్రశ్నించే యువకుడిగా కనిపించనున్నారు. ఇదే నెలలో ఆయన నుంచి రానున్న మరో సినిమా 'గుర్తుందా శీతాకాలం'. నాగశేఖర్‌ తెరకెక్కించారు. తమన్నా కథానాయిక. మేఘా ఆకాష్‌, కావ్య శెట్టి కీలక పాత్రలు పోషించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జూన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇదీ చదవండి:'విక్రమ్‌' సీక్వెల్‌లో విజయ్‌.. కమల్‌హాసన్‌ క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details