తెలంగాణ

telangana

ETV Bharat / elections

భారత్​ భేరి: దీదీ లక్ష్యం దిల్లీ పీఠం !

ఆమె ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ప్రాంతీయ పార్టీ అధినేత్రి. కానీ... నిత్యం విమర్శించేది మాత్రం ప్రధాన మంత్రినే. నరేంద్రమోదీ విధానాలు తప్పని చెప్పడం మాత్రమే మమత లక్ష్యమా? అంటే కాదని అంటున్నాయి రాజకీయ వర్గాలు. మహాకూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు సమాధానంగా నిలవడమే ఆమె ఆలోచన అన్నది వారి మాట. ఈ వ్యూహం ఫలిస్తుందా? దీదీ క్వీన్​ అవుతారా లేక కింగ్​ మేకరా?

By

Published : Apr 13, 2019, 7:07 PM IST

మమత బెనర్జీ

దిల్లీ పీఠంవైపు మమత చూపు!

2006 జులై... బంగాల్​లోని సింగూరు. వ్యవసాయ భూముల్లో కార్ల తయారీ కర్మాగారం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉద్యమించారు మమతా బెనర్జీ. అప్పుడామె ఊహించి ఉండరు... తాను సరికొత్త చరిత్ర లిఖిస్తానని. వామపక్షాల కంచుకోటను కూల్చుతానని.

2019 ఏప్రిల్​... మరోమారు ఉద్యమ సింహంలా దూసుకెళ్తున్నారు మమతా బెనర్జీ. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నది సింగూరు తరహా ప్రాజెక్టులను కాదు. పోరాడుతున్నది రాష్ట్రంలోని ప్రత్యర్థులతో అసలే కాదు. ఆమె పోరాటం ప్రధాని నరేంద్రమోదీపై. ఆయన విధానాలపై.

'నబన్న' పటిష్ఠం... హస్తిన లక్ష్యం...!

నబన్న... హావ్​డాలోని సచివాలయం పేరు. బంగాల్​ అధికార కేంద్రం. అక్కడ పటిష్ఠ స్థితిలో ఉన్నారు మమత. 2016 శాసనసభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది తృణమూల్​ కాంగ్రెస్. 294 నియోజకవర్గాల్లో 211 సీట్లు ఆ పార్టీవే. 32 స్థానాలకే పరిమితమై... కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా అయిన దక్కించుకోలేకపోయింది వామపక్ష కూటమి. 44 సీట్లతో కాంగ్రెస్​ ప్రధాన ప్రతిపక్షమైంది.

స్వరాష్ట్రంలో తిరుగులేని బలంతో... ఇప్పుడు హస్తినపై గురిపెట్టారు 64ఏళ్ల మమత.

"జాతీయస్థాయిలో మేము కీలక పాత్ర పోషిస్తాం. బంగాల్​ నుంచి అత్యధిక లోక్​సభ స్థానాలు గెలుచుకోగలిగితే... తదుపరి ప్రభుత్వం ఏర్పాటులో మేము కీలకం అవుతాం.

ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఎన్నికల తర్వాత నిర్ణయిస్తాం. ఆ జాబితాలో మేము ముందుంటాం. కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న మా పార్టీ అధినేత్రికి పార్టీలకు అతీతంగా మద్దతు ఉంది."

-పేరు చెప్పేందుకు ఇష్టపడని టీఎంసీ నేత

మోదీ వర్సెస్​ దీదీ

నోట్ల రద్దు, జీఎస్టీ, జాతీయ పౌర రిజిస్టర్, పుల్వామా ఉగ్రదాడి, సీబీఐ, ఈడీ వంటి వ్యవస్థల దుర్వినియోగం వంటి అంశాలే దీదీ అస్త్రాలు. ప్రతి సందర్భంలోనూ ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడుతున్నారు మమత. తద్వారా... మోదీని ఎదుర్కోగల విపక్ష నేత తానేననే భావన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
సైద్ధాంతిక సారూప్యం లేకపోయినా మోదీని ఢీకొట్టే లక్ష్యంతో ఏర్పడ్డ కూటమికి సారథిగా నిలవాలన్నది దీదీ ఆలోచన. జనవరిలో కోల్​కతా ర్యాలీ పేరుతో 23 పార్టీల నేతలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ వ్యూహంలో భాగమే.

అంత సులువు కాదు...!

జాతీయ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న మమత ఆశలకు... సొంత పార్టీలోని సమస్యలే ఇబ్బందులుగా మారే ప్రమాదముంది. వాటిలో ప్రధానమైంది... వర్గపోరు. రెండోది... భాజపా క్రమంగా పుంజుకోవడం. ఈ కారణాలతోనే లోక్​సభ ఎన్నికలకు 10 మంది సిట్టింగ్​ ఎంపీలను పక్కనబెట్టి 18మంది కొత్త వారిని బరిలోకి దించారు మమత.

"పార్టీలో వేర్వేరు స్థాయిల్లో వర్గపోరు ఉంది. టికెట్​ దక్కనివారు కొందరు టీఎంసీ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించే అవకాశముంది. అయినా... ఆ ఇబ్బందుల్ని మేము అధిగమించగలమని భావిస్తున్నాం."

-పేరు చెప్పేందుకు ఇష్టపడని టీఎంసీ నేత

"ప్రధాని పీఠంపై కన్నేసే ముందు సొంత ఇలాకాను మమత కాపాడుకోవాలి. ఆమె ప్రజాదరణను కోల్పోతున్నారు. టీఎంసీ పాలన నుంచి విముక్తి పొందాలని ప్రజలు కోరుకుంటున్నారు."

-కైలాశ్​ విజయ్​వర్గీయ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

కాంగ్రెస్​ ఒప్పుకుంటుందా..?

రాష్ట్రంలో అన్ని సవాళ్లు అధిగమించి మమత అత్యధిక స్థానాలు సాధించినా... దిల్లీ పీఠానికి దగ్గరగా వెళ్లడం అంత సులువు కాదు. జాతీయస్థాయిలో మిత్రపక్షంగా, రాష్ట్రంలో ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్సే అడ్డంకిగా మారే అవకాశముంది. రాహుల్​ను ప్రధానిగా చూడాలన్నది కాంగ్రెస్​ కల. అలాంటప్పుడు మమత అభ్యర్థిత్వానికి ఆ పార్టీ ఎలా మద్దతిస్తుందన్నదే అసలు ప్రశ్న.

"ఇటీవల 3 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పుడు రాహుల్​కు తృణమూల్​ కాంగ్రెస్​ మాత్రమే అభినందనలు తెలపలేదు. మోదీ ప్రధాని కావడాన్ని అడ్డుకోవడం కన్నా రాహుల్​ ఆ పదవి అధిష్ఠించకుండా చూసేందుకే మమత ప్రాధాన్యం."

-సోమన్​ మిత్ర, బంగాల్ కాంగ్రెస్​ అధ్యక్షుడు

స్వపక్షం, మిత్రపక్షం, ప్రత్యర్థి పక్షం నుంచి ఎదురవుతున్న సవాళ్లను మమత ఎలా ఎదుర్కొంటారో వేచిచూడాలి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details