తెలంగాణ

telangana

ETV Bharat / elections

ఆ విషయంలో నెహ్రూ, ఇందిర తర్వాత మోదీనే

2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నరేంద్ర మోదీ మరో రికార్డును అందుకున్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత వరుసగా రెండోసారి స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్న ప్రధానిగా ఘనత సాధించారు.

By

Published : May 24, 2019, 6:27 AM IST

మోదీ

నెహ్రూ, ఇందిర తర్వాత మోదీ రికార్డు

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా విజయఢంకా నమోదు చేసింది. ఈ గెలుపుతో జవహర్​లాల్​ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత స్పష్టమైన మెజార్టీతో రెండోసారి ప్రధాని కానున్న వ్యక్తిగా మోదీ చరిత్ర సృష్టించారు.

మూడుసార్లు నెహ్రూ విజయం..

స్వతంత్ర భారతదేశంలో తొలిసారి 1951లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు 489 పార్లమెంటు స్థానాలుండగా.. 364 స్థానాల్లో కాంగ్రెస్​ విజయం సాధించింది. జవహర్​లాల్ నెహ్రూ మొదటిసారి ప్రధాని అయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 45 శాతం ఓట్లు కాంగ్రెస్​కు వచ్చాయి. అనంతరం 1957, 1962లోనూ కాంగ్రెస్​ పార్టీనే గెలిచింది.

1957 ఎన్నికల్లో నెహ్రూ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చింది. రాష్ట్రాల పునర్​వ్యవస్థీకరణ కమిటీ ఏర్పాటుతో భాషాప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ పెరగడం, 1955 హిందు వివాహ చట్టం, దేశంలో ఆహార సంక్షోభం లాంటి సమస్యలు నెహ్రూ ప్రభుత్వాన్ని వెంటాడాయి. అయినప్పటికీ 1957 ఎన్నికల్లో 371 సీట్లతో అఖండ విజయం సాధించింది కాంగ్రెస్​. గతంలో కంటే మెరుగ్గా ఓట్ల శాతాన్ని పెంచుకుంది.

1962లో కాంగ్రెస్​ మళ్లీ విజయదుందుభి మోగించింది. 494 పార్లమెంటు స్థానాల్లో 361 సీట్లు కైవసం చేసుకుని మూడో సారి ప్రధాని అయ్యారు నెహ్రూ.

ఇందిర 'గరీబీ హఠావో'...

1967 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​కు స్థానాల సంఖ్య తగ్గింది. 520 పార్లమెంటు స్థానాల్లో 283 సీట్లను గెలిచింది. సీట్ల సంఖ్య తగ్గినా.. స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లోనే ఇందిరాగాంధీ తొలిసారి ప్రధాని అయ్యారు. 1969లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలింది. రెండో వర్గానికి మొరార్జీ దేశాయ్ నాయకత్వం వహించారు.

ఈ కారణంగా నాలుగేళ్లకే వచ్చిన 1971 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిర తన ప్రభావాన్ని చూపారు. 'గరీబీ హఠావో' నినాదంతో ప్రజల్లో విశేష ఆదరణ చూరగొన్నారు. ఫలితంగా 351 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుని రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.

తర్వాత దేశంలో చాలా ప్రభుత్వాలు మారాయి. ఎక్కువగా సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటయ్యాయి. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు, కుంభకోణాలను ఎదుర్కొంది. ఫలితంగా 2014లో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అఖండ మెజార్టీతో విజయం సాధించింది.

అభివృద్ధి హామీలతో నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మళ్లీ తన ప్రాబవాన్ని చూపారు. 17వ లోక్​సభ ఎన్నికల్లోనూ స్పష్టమైన మెజార్టీతో రెండోసారి అధికారం నిలబెట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details