తెలంగాణ

telangana

By

Published : Feb 11, 2021, 10:09 AM IST

Updated : Feb 11, 2021, 10:26 AM IST

ETV Bharat / crime

మాట కలిపి.. మాయ చేసి.. ఆపై పోలీసులను..!

ఏదో కారణంపై పోలీస్‌ స్టేషన్‌కు ఆమె వస్తుంది. అక్కడున్న ఎస్‌ఐలతో మాట కలిపి సన్నిహితంగా మెలుగుతుంది. ఆ తర్వాత డబ్బులిస్తావా లేదా ఏకాంతంగా గడపాలంటూ ఒత్తిడి చేస్తున్నావని ఫిర్యాదు చేయాలా..? అంటూ బెదిరింపులకు దిగుతుంది. చాలామంది ఎస్సైలు అడిగినంత సమర్పించుకున్నారు. తాజాగా ఆ మహిళను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వనస్థలిపురం పోలీసులు రిమాండ్‌కు తరలించడంతో ఆమె వేధింపుల పర్వం వెలుగులోకొచ్చింది.

women who traps police got arrested in Hyderabad
పోలీసులను వణికించి.. కటకటాల్లోకి

హైదరాబాద్​ హస్తినాపురంలో నివసించే ఆ మహిళకు టైలర్‌ దుకాణముంది. ఆమె భర్త, ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి స్నేహితులు. వ్యాపారి వీరింటికొచ్చే క్రమంలో ఆ మహిళతో పరిచయమేర్పడింది. అతనికి 20 తులాల బంగారం ఇచ్చానని, తిరిగివ్వమంటే బెదిరిస్తున్నాడంటూ కొన్నేళ్ల కిందట వనస్థలిపురం ఠాణాలో ఫిర్యాదు చేసింది. వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజులకు తాము రాజీ కుదుర్చుకున్నామని, కేసు కొట్టేయాలని ఆశ్రయించింది. లోక్‌అదాలత్‌లో రాజీ కుదుర్చుకోవాలని అప్పటి ఇన్‌స్పెక్టర్‌ చెప్పి పంపించారు. ఇదే కేసు విషయంపై మాట్లాడేందుకు అక్కడ పనిచేసే ఓ ఎస్‌ఐ ప్రశాంత్‌నగర్‌లోని తన గదికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. మరో ఇద్దరు ఎస్‌ఐలు కూడా గన్‌తో బెదిరించి ఏకాంతంగా గడపాలని, రూ.10 వేలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారని పేర్కొంది. ముగ్గురు ఎస్‌ఐల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసింది.

ఫేస్‌బుక్‌.. ఆ తర్వాత ఫోన్‌లో..

అప్పటి నుంచి అదే పంథాను ఆమె కొనసాగించింది. ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య విబేధాలొచ్చి ఇద్దరు పిల్లలతో వెళ్లిపోయి ఓ వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ఏదో ఒక విషయంలో వనస్థలిపురం, ఇతర ఠాణాలకు వెళ్లడం మొదలుపెట్టింది. ముందుగా ఎస్‌ఐల ఫేస్‌బుక్‌ చిరునామా.. ఫోన్‌ నంబర్‌ తీసుకుని స్నేహం పెంచుకునేది. సన్నిహితంగా మెలిగిన ఫొటోలు, ఛాటింగ్‌ను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు దిగేది. వనస్థలిపురం, ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పలు కేసులు పెట్టింది. వాటిని ఉపసంహరించుకునేందుకు ముగ్గురు ఎస్‌ఐల నుంచి రూ.10 లక్షలు, రూ.5 లక్షలు, రూ.లక్ష చొప్పున సమర్పించుకున్నారంటూ ఉన్నతాధికారులు ధ్రువీకరిస్తున్నారు.

ఇబ్బందులు రాకుండా ప్రామిసరీ నోటు..

భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కొందరు ఎస్సైలు ఆమెతో ప్రామిసరీ నోట్లు రాయించుకున్నారు. మరికొందరు ప్రభుత్వాధికారులను కూడా ఆమె బెదిరించారు. తన కూతుర్ని బలవంతం చేయబోయాడంటూ సహజీవనం చేస్తున్న వ్యక్తిపై కేసు పెట్టింది. రూ.10 లక్షలు, 500 గజాల ప్లాట్‌ ఇస్తాననడంతో రాజీ చేసుకుంది. తాజాగా టైలర్‌ దుకాణానికొచ్చిన వినియోగదారుడిని కులం పేరుతో దూషించినందుకు వనస్థలిపురం పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఆమెను బుధవారం రిమాండ్‌కు తరలించారు.

Last Updated : Feb 11, 2021, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details