తెలంగాణ

telangana

సహచర దొంగను తప్పించాలని.. పోలీసులను బోల్తా కొట్టించాడు

సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి ఏటీఎం దోపిడీ దొంగల కాల్పుల కేసులో కొత్త కోణం బయట పడింది. పోలీసులకు రైలులో పట్టుబడిన ప్రధాన నిందితుడు... తన సహచర దొంగను తప్పించేందుకు సైబరాబాద్‌ పోలీసులను తప్పదోవ పట్టించాడు. మరో నిందితుడి చూపిస్తానంటూ రైలు నుంచి కిందకు దిగాడు. అతనితో పాటు పోలీసులు కూడా కిందకు దిగారు. ఇంతలో అదే రైలులో ఉన్న రెండో దొంగ పరారయ్యాడు.

By

Published : May 3, 2021, 10:38 AM IST

Published : May 3, 2021, 10:38 AM IST

kukatpally-atm-robbery-case-full-details
పార్టనర్​ను తప్పించాలని.. పోలీసులను బోల్తా కొట్టించాడు

కూకట్‌పల్లి ఏటీఎం సెంటర్​లో కాల్పులు జరిపి రూ.5లక్షల నగదుతో పరారైన దోపిడీ దొంగల కేసులో సైబరాబాద్‌ పోలీసులకు ప్రధాన నిందితుడు చిక్కాడు. కానీ రైలులో పారిపోతున్న మరో దొంగ పోలీసులకు పట్టుబడకుండా తప్పుదారి పట్టించాడు. తన సహచర దొంగ ఎక్కడున్నాడో చూపిస్తానంటూ రైలు దిగాడు. సదరు దొంగ చెబుతున్నదంతా వాస్తవమేనని నమ్మిన పోలీసులు ప్రధాన నిందితుడిని అనుసరించారు.

వీరంతా దిగిన రైలులోనే రెండో వ్యక్తి పరారయ్యాడు. అతన్ని తప్పించేందుకే ప్రధాన నిందితుడు ఈ నాటకం ఆడినట్లు బయటపడడంతో పోలీసులు కంగు తిన్నారు. కాల్పుల సమయంలో వినియోగించిన తుపాకీ... దోచుకున్న అయిదు లక్షలను ప్రధాన నిందితుడు మరో దుండగుడి వద్ద ఉంచాడు. వాటిని స్వాధీనం చేసుకోవాలంటే రెండో నిందితుడిని పోలీసులు పట్టుకోవాలి. అతను దొరకకుండా ఉండాలనే తప్పించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులకు పట్టుబడిన ప్రధాన నిందితుడిపై పలు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. జైలుకు కూడా వెళ్లి వచ్చాడని... రెండో దుండగుడికి మాత్రం నేర చరిత్ర లేదన్నారు. పరారైన దొంగ బిహార్‌కు వెళ్లినట్లు గుర్తించి... పోలీసులు అక్కడ గాలిస్తున్నారు. అయితే పోలీసులకు దొరకకుండా మకాం మారుస్తున్నట్లు అనుమానిస్తున్నారు. దొరికిపోతానేమో అనుమానంతో చరవాణి కూడా స్విచ్‌ ఆఫ్‌ చేశాడన్నారు. ప్రధాన నిందితుడు కొంత కాలంగా ఐడీఏ బొల్లారంలో నివాసముంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కళ్లలో కారం చల్లి కారులో నుంచి డబ్బులు దోచుకెళ్లిన కేసులో నిందితుడిగా ఉన్నట్లు కూడా బయటపడింది. గత నెల 16న జీడిమెట్లలో తుపాకీతో బెదిరించి నగదు బదిలీ దుకాణ యజమానిని బెదిరించి డబ్బు దోచుకున్నది కూడా వీరేనని విచారణలో వెల్లడైంది. నిందితులు వాడిన వాహనాలు ఎవరివనే విషయాన్ని లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు దోపిడీల్లో వేర్వేరు వాహనాలు వాడడం... వాటికి నంబర్‌ ప్లేట్లు లేకపోవడంతో వాటిని కూడా దొంగిలించి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి:కరోనా రోగుల కుటుంబీకుల ఆవేదన... సమాచారం ఇవ్వని ఆస్పత్రులు

ABOUT THE AUTHOR

...view details