Accidents on Hyderabad ORR: హైదరాబాద్ బాహ్య వలయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. కొవిడ్ నేపథ్యంలో వాహనాల సంఖ్య దాదాపు రెట్టింపైనప్పటికీ... రోడ్డు ప్రమాదాలు, మరణాలు పెరగకుండా వ్యూహాత్మకంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ - హెచ్ఎండీఏ చర్యలు తీసుకుంటోంది. పెరుగుతున్న జనాభా నేపథ్యంలో అదే సమయంలో వాహనాల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఓఆర్ఆర్పై ప్రమాదాల నివారణకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్- హెచ్జీసీఎల్ పక్కా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది.
లాక్డౌన్ ఎత్తేశాక పెరిగిన ప్రమాదాలు
2016లో ఓఆర్ఆర్పై 150 దాకా రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆ సమయంలో 60 వేల వాహనాలు తిరిగేవి. 47 నుంచి 50 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత కొవిడ్ నేపథ్యంలో లాక్డౌన్ సమయంలో వాహనాలు తక్కువగా రాకపోకలు సాగించాయి. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసిన తరువాత.. క్రమంగా వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం ఆ సంఖ్య 1 లక్షా 30 వేలకు పెరిగాయి. వాహనాల సంఖ్య పెరిగినా... ఈ మూడేళ్ల కాలంలో ప్రమాదాలు, మరణాలు స్థిరంగా ఉన్నాయి. భారీ ప్రమాదాలు తగ్గినట్లు... చిన్న ప్రమాదాలు పెరిగాయని హెచ్జీసీఎల్ ప్రకటించింది. బాహ్య వలయ రహదారిపై ప్రమాదం జరిగితే టోల్ఫ్రీ నంబరు- 1066కు ఫోన్ చేస్తే 8 నిమిషాల వ్యవధిలో అత్యాధునిక అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని ట్రామా కేర్ సెంటర్లకు తరలిస్తున్నాయి. ఉచిత వైద్య సేవలు అందించే ఈ కేంద్రాలు గతంలో 10 ఉండగా... నవంబరు నుంచి మరో 6 సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మొత్తం 16 కేంద్రాలు 24X7 అద్భుతమైన సేవలందిస్తున్నాయి. ఓఆర్ఆర్పై 2020 నవంబరు నుంచి 2021 డిసెంబరు వరకు 1,084 మంది ప్రాణాలు కాపాడినట్లు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ వెల్లడించారు.
ఆ అధికారం లేక
Accidents on ORR: 158 కిలోమీటర్ల బాహ్య వలయ రహదారిపై 19 టోల్ గేట్లు ఉండగా... అతి వేగం నియంత్రించేందుకు 10 చోట్ల స్పీడ్ గన్లు ఏర్పాటు చేయడంతో అవి వేగం గుర్తించి ఆ వివరాలు రోడ్డు నిర్వహిస్తున్న వారికి వెళుతున్నాయి. ఈ వాహనదాదారులకు చలాన్లు వేసే అధికారం హెచ్జీసీఎల్కు లేకపోవడం వల్ల అక్కడితోనే అగిపోతున్నారు. వీటితో పాటు ఇప్పడు ప్రతి టోల్గేట్లో తప్పనిసరిగా మారిన ఫాస్టాగ్ ద్వారా వాహనదారు వేగం గుర్తించేందుకు కసరత్తు చేస్తోంది. ఓ టోల్గేట్లో ఫాస్టాగ్ చేసి బయలుదేరిన సమయం... మరో టోల్గేట్కు ప్రవేశించిన సమయం ద్వారా ఆ వాహనం వేగాన్ని నిర్ధరించనుంది. రహదారిపై స్పీడ్ నియమ నిబంధనలు అతిక్రమించిన వాహన యజమానులపై జరిమానాలు విధించేందుకు సన్నద్ధమవుతోంది.