తన సోదరులే కామాంధులై తన జీవితాన్ని నాశనం చేశారంటూ మంగళవారం ఓ 20 ఏళ్ల యువతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రెండో పట్టణ పోలీస్స్టేషన్కు రావడం కలకలం రేపింది. ఆమె తగిన ఆధారాలను సైతం సమర్పించింది. తండ్రి లేని తనపై సొంత అన్నయ్య చిన్నతనం నుంచీ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని పేర్కొంది. ఎన్నిసార్లు చెప్పినా తల్లి పట్టించుకోవడంలేదని పేర్కొంది. ఈ బాధలు భరించలేక ఇంటర్ చదివే సమయంలో పెద్దమ్మ-పెదనాన్నల పంచన చేరితే అక్కడా సోదరుడి వరసయ్యే వాళ్ల కొడుకు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేర్కొంది.
వావివరసలు మరిచాడు.. నేడు ఉరికి వేలాడాడు..
పిల్లలు తప్పటడుగులు వేస్తే చూసి మురిసిపోయే తల్లిదండ్రులు.. వారు పెద్దయ్యాక ‘తప్పుటడుగులు’ వేస్తుంటే గుర్తించలేకపోవడం ఎంతటి పెను విషాదాలకు దారితీస్తోందో తెలియజెప్పే దారుణ ఉదంతమిది. ‘అమ్మా.. అన్నయ్య దారి తప్పాడు. తోడబుట్టిన నాతోనే గాడి తప్పి ప్రవర్తిస్తున్నాడ’ని కూతురు చెబితే ఆ తల్లి పట్టించుకోలేదు. ఏడ్చినా వినలేదు. ఈ బాధ నుంచి బయటపడేందుకు పెద్దమ్మ-పెదనాన్నల చెంతకు చేరితే అక్కడా వారి కొడుకు రూపంలో మరో కీచకుడు ఎదురయ్యాడు. చెబితే వారూ స్పందించలేదు. ఫలితంగా ఓ యువతి అనూహ్యమెన వంచనకు.. సోదరుల చేతిలోనే లైంగిక దాడికి గురైంది. ఏళ్లపాటు నరకయాతన అనుభవించింది. చివరకు ధైర్యం తెచ్చుకుని పోలీసు ఠాణా మెట్లు ఎక్కడంతో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన సోదరుల్లో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బాధితురాలి పెదనాన్న సింగరేణిలో విశ్రాంత ఉద్యోగి. ఆయనకు ఇద్దరు కుమారులు. చిన్నవాడు (27) బీటెక్ చేసి లండన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. గత ఏడాది లాక్డౌన్ సమయంలో ఒకసారి తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళ్లాడు. రెండువారాల క్రితమే మళ్లీ ఇక్కడికి వచ్చాడు. ఈ నేపథ్యంలో బాధిత యువతి ఫిర్యాదు గురించి తెలిసిన అతడు బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చేసిన తప్పు బయటపడుతుందని భయపడ్డాడా! లేక పశ్చాత్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే విషయంలో స్పష్టత లేదు. తన చెల్లెలితో (బాధితురాలు) ఫోన్లో మాట్లాడిన సంభాషణల్లో మాత్రం ఈ విషయం బయటకు పొక్కితే ఆత్మహత్యకు పాల్పడతానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరో నిందితుడైన బాధితురాలి సొంత అన్నను ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు వివరించారు.