ఆ ఊళ్లో సాయంత్రమయితే చాలు.. యువకులంతా మందు తాగేసి ఆ మత్తులో నిత్యం ఘర్షణ పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన కుటుంబ సభ్యుల మీద కూడా తోక తొక్కిన తాచులా లేస్తున్నారు. రోజూ.. ఇదే తంతు జరుగుతుండడంతో.. విసిగిపోయిన మహిళలు గ్రామ ప్రజా ప్రతినిధులకు తమ బాధ చెప్పుకున్నారు. ఊళ్లో బెల్టుషాపులు మూసేలా చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వక దరఖాస్తులు పెట్టుకున్నారు.
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలో మహిళలంతా కలిసి బెల్టుషాపులు మీద యుద్ధం ప్రకటించారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలతో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేసేలా చర్యలు తీసుకునేలా ప్రయత్నించి సఫలం అయ్యారు.
గ్రామస్తులందరూ.. ఒకతాటిపైకి వచ్చి రత్నగిరి గ్రామంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు పరుస్తున్నట్టు ప్రకటన చేశారు. ఊళ్లో మద్యం అమ్మిన వారికి రూ. 10వేలు జరిమానా, పట్టించిన వారికి రూ. వెయ్యి నజరానా ప్రకటించారు. మద్యనిషేధం అమలు పరుస్తున్నట్టు గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.