తెలంగాణ

telangana

ETV Bharat / city

సర్వం వరదార్పణం.. బాధితుల వేదన వర్ణనాతీతం..

Heavy Rains: గోదావరికి క్రమేణా వరద తగ్గుముఖం పడుతుండగా, కృష్ణాలో శ్రీశైలానికి ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద కూడా నెమ్మదించినప్పటికీ, ఇంకా ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. మరోపక్క నీటమునిగిన జయశంకర్‌ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్‌లో నీటి తోడివేత(డీవాటరింగ్‌)కు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంత్రపురిగా పిలుచుకునే మంథని పట్టణ చరిత్రలోనే ఎన్నడూ లేనిరీతిలో వరద ముంచెత్తింది. భద్రాద్రి జిల్లా మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఐదు రోజులుగా ప్రాణాలరచేత పట్టుకుని ఉన్న బాధితులు ఇప్పుడు ఆస్తి, పంట నష్టంపై అంచనా వేసుకుంటున్నారు.

By

Published : Jul 18, 2022, 7:02 AM IST

floods effect
floods effect

Heavy Rains: వరద ఒక్కో అడుగు వెనక్కి పోతుంటే.. మునిగిన ఇళ్లు.. కూలిన గోడలు.. మేటలతో పొలాలు తేలుతున్నాయి. ఊరొదిలి పోయిన బాధిత కుటుంబాలు కొన్ని స్వస్థలాలకు తిరిగి వస్తున్నాయి. మరికొన్నిచోట్ల గృహాలు మునిగి ఉండటంతో బాధితులు పునరావాస కేంద్రాల్లోనే తల దాచుకుంటున్నారు. ఇంకొందరు ఊళ్లోకి ఎప్పుడు వెళ్దామా అని రోడ్లపై నిరీక్షిస్తున్నారు. భద్రాద్రి జిల్లా మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఐదు రోజులుగా ప్రాణాలరచేత పట్టుకుని ఉన్న బాధితులు ఇప్పుడు ఆస్తి, పంట నష్టంపై అంచనా వేసుకుంటున్నారు. పొలాలు, చెలకల్లో వేసిన మేటలు చూసి గుండెలు బాదుకుంటున్నారు. గ్రామాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. పంచాయతీరాజ్‌శాఖ బ్లీచింగ్‌ చల్లుతున్నా మురుగుతో దుర్వాసన వదలడం లేదు. పెనువిలయం సృష్టించిన వరద ప్రభావిత ప్రాంతాల్లో భీతావహ పరిస్థితులపై ప్రత్యేక కథనం..

మళ్లీ చినుకు పడుతుంటే జనం వణికిపోతున్నారు. వారు ఇప్పటికీ గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు బురదతో నిండి ఉండటంతో కాలు కదపలేని దుస్థితి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, అశ్వాపురం మండలాల్లో కొన్ని గ్రామాలు మాత్రం ముంపు నుంచి బయటపడ్డాయి. మణుగూరు పరిధిలోని చిన్నరాయగూడెం, కమలాపురం, అన్నారం ప్రజలు ఊళ్లలోకి చేరుకున్నారు. కొన్ని చోట్ల ఇళ్ల గోడలు కూలాయి. ఇళ్లలో బియ్యం సంచులు నానిపోయాయి. గృహోపకరణాలు పాడయ్యాయి. ఒక్కో కుటుంబానికి సాగు పరంగా రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు బాధితులంటున్నారు. ఇళ్లు, గృహోపకరణాలు, వ్యవసాయ పరికరాలతో ప్రతి కుటుంబానికి రూ.3 లక్షల నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు.

చింతిర్యాలకు పడవపై ‘ఈనాడు’ బృందం..

అశ్వాపురం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో గోదావరి ఒడ్డున ఉన్న చింతిర్యాల గ్రామం భారీగా నష్టపోయింది. పెద్ద చింతిర్యాల నుంచి చింతిర్యాలకు మధ్య రహదారిలో ముంపు ఏర్పడటంతో నాటు పడవల్లోనే జనం వెళుతున్నారు. నాటుపడవలో ‘ఈనాడు’ బృందం అవతలి ఒడ్డుకు ప్రయాణించి.. బురదలో కాలినడకన ఈ గ్రామానికి చేరుకుంది. గ్రామంలో 56 ఇళ్లు మునిగాయి. అందులో కొన్ని ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. చాలావరకు గుడిసెల గోడలు కూలిపోయాయి. ఈ గ్రామం వారికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొండికుంటలో పునరావాసం కేంద్రం ఏర్పాటు చేయడంతో బాధితులు అవస్థ పడుతున్నారు. ఈ ప్రాంతంలో 600 ఎకరాల్లో భారీగా ఇసుక, ఒండ్రు మేటలు వేసింది. ఎకరాకు రూ.15 వేల వరకు ఖర్చు చేసి సాగుచేసిన పత్తి పూర్తిగా కనుమరుగైంది. గ్రామానికి చెందిన వెంకటరమణ, వంశీ, రవితో పాటు మరికొందరు నాటు పడవలను ఏర్పాటు చేసి ప్రజలకు సాయం చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

రూపురేఖలు కోల్పోయిన పొలాలు..

బూర్గంపాడు మండలం సంజీవ్‌రెడ్డిపాలెం, మణుగూరు మండలం చిన్నరాయగూడెం, అశ్వాపురం మండలంలో పలు గ్రామాల్లో పొలాలు పూర్తిగా రూపులేకుండా పోయాయి. పత్తి, వరి కొట్టుకుపోయింది. పొలాల్లో మేటలను తొలగించాలంటే రూ.లక్షలు ఖర్చవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ యంత్రాలతో పూడికను తొలగిస్తే తప్ప పొలాలు కనిపించేలా లేవని కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ ఏడాది అప్పుచేసి నాటిన పంటలు కోల్పోవడం ఒక ఎత్తయితే.. పొలాలు పనికిరాకుండా మారడం మరింత బాధాకరమని పేర్కొంటున్నారు. బ్యాంకులు, ప్రైవేటు వ్యాపారుల వద్ద ఎకరాకు రూ.15 వేల వరకు తెచ్చిన రుణాలు చెల్లించడం ఎలాగంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.

దయనీయంగా పశువులు..

ఎటుచూసినా వరద, బురద మేటలతో పశుగ్రాసం కనిపించడమే లేదు. దీంతో ఆవులు, గేదెలు, మేకలను రైతులు పూర్తిగా వదిలివేశారు. కొందరు ట్రాక్టర్లలో మూగజీవాలను పునరావాస గ్రామాలకు తీసుకెళ్లారు. ఎండు గడ్డి వరదకు కొట్టుకుపోయింది. ఒండ్రు కారణంగా పచ్చగడ్డి కనిపించడం లేదు. ముంపు మండలాల్లో పశువులకు పశుగ్రాసాన్ని ప్రభుత్వం వెంటనే పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.

వైద్య శిబిరాల వద్ద జనం..

వరదల కారణంగా గోదావరి పరీవాహకంలో శీతల వాతావరణం నెలకొంది. దీంతో పిల్లలు, వృద్ధులు తీవ్రమైన జలుబుతో బాధపడుతున్నారు. పునరావాస శిబిరాల్లో కొందరికి డయేరియా లక్షణాలున్నట్లు వైద్యసిబ్బంది తెలిపారు. వారిని సమీప పీహెచ్‌సీలకు తరలించినట్లు బూర్గంపాడు సెయింట్‌ మేరీ పాఠశాల శిబిరంలోని సిబ్బంది వివరించారు. ఇక్కడ 1400 మంది బాధితులకు ఆశ్రయం కల్పించారు.

కన్నీట కడెం..

గత వారం రోజులుగా కుంభవృష్టి కురవడంతో ఉగ్రరూపం దాల్చిన కడెం నది.. రైతులకు గుండెకోతను మిగిల్చింది. దీని పరీవాహక ప్రాంతంలో ఎటు చూసినా ఇసుక మేటలే.. పొలం గట్లు కనిపించకుండా పోయాయి. ఇక ఈఏడాది సాగు చేయడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ పరిస్థితి నిర్మల్‌ జిల్లా కడెం, దస్తురాబాద్‌, పెంబి మండలాల్లో నెలకొంది. మరోవైపు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో గిరిజన గ్రామాలనేకం నేటికీ చీకట్లోనే మగ్గుతున్నాయి. కడెం మండలంలోని అల్లంపల్లి, బాబానాయక్‌తండా, గంగాపూర్‌, రాణిగూడ, కొర్రతండా, ఇస్లాంపూర్‌ గిరిజన గ్రామ పంచాయతీలు వాటి అనుబంధ గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. పెంబి మండలంలోని 8 పంచాయతీల్లోనూ విద్యుత్తు వ్వవస్థ దెబ్బతిని కరెంట్‌ లేకుండా పోయింది.

మండలం... నష్టం..

పెంబి: 800 ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న, పత్తి ఇతర పంటలు కొట్టుకుపోగా సుమారు 400 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది.

కడెం: 2150 ఎకరాలు కోతకు గురైంది. 2340 ఎకరాల్లో వరి నారుమళ్లు నామరూపాల్లేకుండా పోయాయి. 830 ఎకరాల్లో పత్తి, 200 ఎకరాల్లో మొక్కజొన్న, 71 ఎకరాల్లో పసుపు పంట వరద ధాటికి కనిపించకుండా పోయింది.

దస్తురాబాద్‌:1350 ఎకరాల్లో పొలాలు కోతకు గురై ఇసుక మేటలు వేయగా, 95 ఎకరాల్లో పత్తి 15 ఎకరాల్లో మొక్కజొన్న, 10 ఎకరాల్లో పసుపు పంట కొట్టుకుపోయింది. 2200 ఎకరాల కోసం పోసిన నారుమళ్లు కొట్టుకుపోయి రైతులు నష్టపోయారు.

'నాకున్న 4 ఎకరాల్లో మేటలే కనిపిస్తున్నాయి. ఈనది నీటితోనే మేమంతా ఏటా 2 పంటలను మోటార్ల ద్వారా పండించుకునేవాళ్లం. గోదారి మమ్మల్ని ముంచేసింది. ప్రభుత్వం నష్టపరిహారంతోపాటు పొలం చదును చేసుకునేందుకు సహాయమందించాలి.'- వంగ నారాయణ, రైతు పాండ్వాపూర్‌

పెద్ద కష్టం..

కుమురం భీం జిల్లాలో పలు గ్రామాలను పెద్దవాగు నిలువునా ముంచేసింది. చేలు, ఊళ్లు తేడా లేకుండా అన్నీ నాశనమయ్యాయి. ఏ కర్షకుడిని కదిపినా ఏం మిగిలిందంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. అన్నదాతలు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి వరద తగ్గినా ప్రజలు తేరుకోవడానికి సమయం పట్టేలా ఉంది. చింతలమానేపల్లి దిందా గ్రామం తూర్పువైపు ప్రాణహిత జలాలు, మరోవైపు వాగు వరద ఉప్పొంగడంతో వారం రోజుల నుంచి దిందా గ్రామం, బెజ్జూర్‌ మండలంలోని తలాయి, తిక్కపల్లి, బీమారం జలదిగ్భంధంలోనే ఉన్నాయి.

కాగజ్‌నగర్‌ మండలం అందవెల్లి వద్ద పెద్దవాగుపై వంతెన కుంగిపోవడంతో దహెగాం మండలంలోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాళ్లగూడ, బోర్లకుంట, కోత్మీర్‌ ఇట్యాల, బీబ్రా, ఐనం, పెసరికుంట గ్రామాల్లో ఇళ్లలోకి నీళ్లొచ్చాయి. పశుగ్రాసం పనికిరాకుండా పోయింది. రహదారులు ధ్వంసమయ్యాయి. ఒడ్డుగూడ, లగ్గాం, చిన్న రాస్పెల్లి, మెట్లగూడ, రాంపూర్‌, దిగడ పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో పంటలన్నీ వరదార్పణం అయ్యాయి. 2 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఆసిఫాబాద్‌ నుంచి కాగజ్‌నగర్‌ మీదుగా పెంచికల్‌పేట్‌, దహెగాం, బెజ్జూర్‌ మండలాల్లో 80 కిలోమీటర్ల మేర ప్రవహించే పెద్దవాగు పెను విధ్వంసాన్నే సృష్టించింది. 45 వేల ఎకరాల్లో 22 వేల మంది అన్నదాతల పంటలు తుడిచిపెట్టుకుపోగా, 12 వేల ఎకరాల్లో ఇసుక అడుగు, మోకాల్లోతు మేర మేటలు వేసింది.

'మేం తినడానికి ఉంచుకున్న 12 క్వింటాళ్ల వడ్లన్నీ తడిసి పాడయ్యాయి. రూ.50 వేల పెట్టుబడి పెట్టి నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశాను. వరద ఉద్ధృతికి చేనులో ఒక్క మొక్కా లేదు.' - లక్ష్మి, ఐనాం, దహెగాం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details