తెలంగాణ

telangana

ETV Bharat / city

కోవర్టులుగా భావిస్తున్న 25 మందిని శిక్షించిన మావోలు.. లేఖ విడుదల

రహస్య పోలీస్​ ఏజెంట్లు, కోవర్టులు, ఇన్ఫార్మర్లుగా భావిస్తున్న 25 మందిని ప్రజాకోర్టులో శిక్షించినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ ఘటనకు.. బస్తర్​ పోలీస్​ ఐజీ సుందర్​ రాజ్​, బీజాపూర్​ ఎస్పీ కమలోచన్​ కశ్యప్​లే బాధ్యత వహించాలని డిమాండ్​ చేసింది. ఈ మేరకు మావోలు లేఖ విడుదల చేశారు.

By

Published : Oct 9, 2020, 12:09 PM IST

Maoist Party released Letter
కోవర్టులుగా భావిస్తున్న 25 మందిని శిక్షించిన మావోలు.. లేఖ విడుదల

ఛత్తీస్​గఢ్​​లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు నియమించిన 25 మంది రహస్య పోలీస్ ఏజెంట్లు, కోవర్టులు, ఇన్ఫార్మర్లను ప్రజాకోర్టులో శిక్షించినట్లు మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన విడుదల చేసింది. గంగలూర్ ప్రాంతంలో 12 మంది ఏజెంట్లు, ఐదుగురు కోవర్టులు, 8 మంది పోలీస్ ఇన్ఫార్మర్లను గుర్తించి ప్రజల మద్దతుతో శిక్షించినట్లు భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు దండకారణ్య జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత బస్తర్ పోలీస్ ఐజీ సుందర్ రాజ్, బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్​లే వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు మోసపు ఎత్తుగడల్లో భాగంగా సమాధాన్ యోజనను చేశారని లేఖలో విప్లవ్ పేర్కొన్నారు. 2022 నాటికి విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తామని ప్రకటించి.. ఇందుకు పెద్దఎత్తున పోలీసు ఏజెంట్లను నియమించుకున్నారని ఆరోపించారు. ఏజెంట్లకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు ఇచ్చి నెల నెలా జీతాలు జమ చేస్తున్నారన్నారు. రహస్య ఏజెంట్లు ఉద్యమ కేంద్రాలైన గ్రామాల్లో పాగా వేసి రహస్యంగా తమ కార్యకలాపాలు కొనసాగించారని తెలిపారు. పోలీసులు తయారు చేసిన ఇన్ఫార్మర్లు కూంబింగ్ సమయాల్లో గైడ్లుగా వ్యవహరించారని, కొంతమంది ప్రజా నాయకులను అరెస్టు చేయించారన్నారు.

అనేక రకాలుగా విప్లవోద్యమంపై పోలీసు ఉన్నతాధికారులు దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. విప్లవోద్యమాన్ని కాపాడుకునేందుకు ప్రజల మద్దతుతో వారి భాగస్వామ్యంతో రహస్య ఏజెంట్లను పసిగట్టామని వివరించారు. గంగలూర్ ఏరియాలో డీవీసీ సభ్యుడు విజ్ఞాలు కోవర్టుగా తేలాడని.. ఇలా అనేకమంది కోవర్టులను నియమించి.. విప్లవోద్యమాన్ని అణిచివేసే కుట్ర చేస్తున్న సమయంలో రహస్య ఏజెంట్లను గుర్తించి వారికి శిక్షలు విధించినట్లు విప్లవ్ ప్రకటించారు. కోవర్టుల ద్వారా నాయకత్వాన్ని నిర్మూలించి.. 2022 కల్లా విప్లవోద్యమాన్ని నిర్మూలించాలన్న పోలీసుల లక్ష్యం సాధ్యం కాబోదని ప్రకటించారు.

ఇదీ చదవండి:అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై తెగని పంచాయితీ

ABOUT THE AUTHOR

...view details