తెలంగాణ

telangana

Revanth: 'నా వల్లే కిషన్​రెడ్డికి కేబినెట్‌ హోదా దక్కింది'

By

Published : Jul 9, 2021, 8:25 PM IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో సరదాగా ముచ్చటించిన రేవంత్​... కిషన్​రెడ్డికి కేంద్ర కేబినెట్‌ హోదా తన వల్లే వచ్చిందని​... కేసీఆర్​ ఉన్నంత కాలం కేటీఆర్​ సీఎం కాలేరని ఆసక్తికర కామెంట్లు చేశారు. 2022లో కేసీఆర్​... ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చేప్పారు.

tpcc chief revanth reddy chit chat with media about telangana elections
tpcc chief revanth reddy chit chat with media about telangana elections

తన వల్లే భాజపా ఎంపీ కిషన్‌రెడ్డికి కేబినెట్‌ మంత్రి పదవి వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు బలమైన పీసీసీ ఉన్నందుకే కేంద్ర ప్రభుత్వం... కిషన్‌రెడ్డికి పదోన్నతి కల్పించిందని ఆరోపించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్​... భాజపాలో చేరి ఉద్యమకారున్నని చెప్పుకునే అర్హత కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు కమ్యూనిస్టుగా ఉన్న ఈటల.. ఇప్పుడు క్యాపిటలిస్టుగా మారిపోయారన్నారు. తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారని.. ఆ విషయం ఈటలకు తెలియదా అని ప్రశ్నించారు.

కేటీఆర్​ సీఎం కాలేరు...

మోసానికి, దోపిడీకి మారుపేరు కల్వకుంట్ల కుటుంబమని రేవంత్​రెడ్డి ధ్వజమెత్తారు. సోనియా గాంధీ కాళ్లు మొక్కి పార్టీని విలీనం చేస్తా అని కేసీఆర్​ మోసం చేశాడన్నారు. 2022 ఆగస్టు తర్వాత కేసీఆర్.. ప్రభుత్వాన్ని రద్దు చేస్తారన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని రేవంత్​ జోస్యం చెప్పారు. కేసీఆర్ బతికున్నంత కాలం కేటీఆర్ సీఎం కాలేరన్న రేవంత్‌... తెరాసకు నిర్మాణం లేదని ఎప్పుడైనా పేకమేడలా కూలుతుందని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్​, మంత్రి హరీశ్​రావు అనుభవిస్తున్న పదవులు, జీవితం.. కాంగ్రెస్​ పెట్టిన బిక్షే అని రేవంత్​ వ్యాఖ్యానించారు. తెలంగాణ అమరవీరుల స్థూపం కాంట్రాక్టులో వంద కోట్ల దోపిడీ జరిగిందని.. అత్యంత పవిత్రమైన అమరవీరుల స్థూపం నిర్మాణం కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చారని రేవంత్​ ఆరోపించారు.

తెరాసలో అందరూ తెదేపా నాయకులే...

"నా దగ్గర తెదేపా వాసన ఉందని బావబామ్మర్దులు ఎగతాళి చేస్తున్నారు. మీ దగ్గర కొట్టే మందు కంపు కంటే.. తెదేపా వాసన మంచిదే. కల్వకుంట్ల రాజకీయ బతుకు... తెదేపా పెట్టిన భిక్ష ప్రస్తుతం చేరుతున్న ఎల్​. రమణతో సహా... తెరాసలో మొత్తం తెదేపా నాయకులే. కేసీఆర్, గంగుల, ఎర్రబెల్లి, గంప గోవర్దన్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసానితో సహా అందరూ తెలుగుదేశమే కదా. తెదేపా అధినేత చంద్రబాబుకు ఓ బంట్రోతులా కేసీఆర్​ పనిచేశాడు. నేను తెదేపాలో ఉన్నప్పుడు వచ్చిన పార్టీ పదవి, ఎమ్మెల్యే స్థానం చంద్రబాబు ఇచ్చాడు. అందుకే పార్టీ మారేటప్పుడు ఆయనకే రాజీనామా ఇచ్చిన. నిబద్ధతతోనే ఇన్ని రోజులు రాజకీయాలలో ఉన్నా. ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసిన తరువాత ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు. తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా... స్పీకర్ ఫార్మాట్​లో రాజీనామా లేఖలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చేదుండే."

- రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు.

తీవ్రతను బట్టి పాదయాత్ర...

కోమటిరెడ్డి బ్రదర్స్​ని దిల్లీలోనే కలిశానని రేవంత్​ స్పష్టం చేశారు. రోజూ కలుసుకోవాడానికి తామేమి భార్యాభర్తలం కాదని తనదైన శైలిలో స్పందించారు. సమస్య తీవ్రతను బట్టి పాదయాత్ర ఉంటుందన్న రేవంత్​... కార్యచరణను అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు సమష్టిగా ఉంటాయని మరోసారి ఉద్ఘాటించారు.

ఇదీ చూడండి: kcr: 50 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశం

ABOUT THE AUTHOR

...view details