తెలంగాణ

telangana

By

Published : Apr 30, 2021, 6:37 AM IST

ETV Bharat / city

అమరావతి ఉద్యమం @500.. వర్చువల్ విధానంలో నేడు భారీ సభ

రాష్ట్ర భవిష్యత్‌ బాగుంటుందని... జీవనాధారమైన భూముల్ని.. రాజధాని కోసం త్యజించారు. రాజధాని తరలిపోతుందన్న ప్రకటనతో వారి కలలు కుప్పకూలాయి. అప్పటి నుంచి రాజధాని పరిరక్షణే శ్వాసగా ఉద్యమించారు. ఎప్పుడూ ఇళ్లు దాటి రాని మహిళలు.. పోరాటానికి రథసారథులయ్యారు. అవమానాలనే ఆయుధంగా మార్చుకుని.. కరోనా కష్టకాలంలోనూ వెరవకుండా పోరాడుతున్నారు. అమరావతి ఉద్యమం నేటితో 500 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

అమరావతి ఉద్యమం @500
అమరావతి ఉద్యమం @500

అమరావతి ఉద్యమం @500

ఒకటా, రెండా? ఏకంగా 500 రోజుల సుదీర్ఘ పోరాటం. ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ.. ముక్తకంఠంతో నినదిస్తూ సాగుతున్న ఉద్యమం ఇది. రాజధాని తరలిపోకుండా ఉండాలని వారు చేయని ప్రయత్నం లేదు. మొక్కని దైవం లేదు. లాఠీలు విరిగినా, జైళ్లకు వెళ్లినా.. కరోనా భయపెడుతున్నా.. దేన్నీ లెక్కచేయకుండా తమ వారు చేస్తున్న అమరావతి పోరాటం 500వ రోజుకు చేరింది.

అక్కడ అందరి లక్ష్యం ఒక్కటే అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా అడ్డుకోవడం. అధికార వైకాపా తప్ప.. అన్ని రాజకీయాపక్షాలు, ప్రజాసంఘాలు, రాజధాని గ్రామాల రైతులు, మహిళలు అలుపెరగకుండా పోరాడుతున్నారు. భూములిచ్చిన రైతులు, రైతు కూలీల ఐక్యకార్యాచరణ సమితి, వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో ఏర్పడిన అమరావతి పరిరక్షణ సమితి... ఏడాదిన్నర నుంచి పోరాడుతూనే ఉన్నాయి. రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, రహదారిపై బైఠాయింపు, అసెంబ్లీ ముట్టడి, మౌన ప్రదర్శనలు, ర్యాలీలు, న్యాయపోరాటాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపాలు... ఇలా తమ బాధ వివరించేందుకు కనిపించిన ఏ మార్గాన్నీ వదలలేదు. దేశ రాజధాని దిల్లీ వరకు తమ ఉద్యమ స్వరాన్ని చేరవేశారు.

2019 డిసెంబరు 17న సాయంత్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్‌ చేసిన మూడు రాజధానుల ప్రస్తావన.. అమరావతి రైతులకు శరాఘాతమైంది. ఆ మర్నాటి నుంచే రాజధాని గ్రామాల్లో ఉద్ధృతంగా అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభించారు. డిసెంబరు 18న వెలగపూడిలో తొలి దీక్షా శిబిరం మొదలైంది. అప్పటి నుంచి రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు అమరావతే ఆశ, శ్వాసగా పోరాడుతున్నారు. ఆరేడేళ్ల పిల్లల నుంచి 70-80 ఏళ్ల వృద్ధుల వరకు... రాజధాని పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. రాజధాని గ్రామాల ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వం విధించిన నిబంధలకు లోబడి ఇళ్లల్లోనే నిరసన కొనసాగించారు. ప్రైవేటు స్థలాల్లో భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించి నిరసనల్లో పాల్గొంటున్నారు.

రైతుల ఉద్యమం మొదలయ్యాక... రాజధాని గ్రామాల్లోకి ప్రభుత్వం వేల సంఖ్యలో.. పోలీసుల బలగాల్ని మోహరించింది. 144 సెక్షన్‌, పోలీసు చట్టంలోని 30 సెక్షన్లను ప్రయోగించి ఉద్యమాన్ని కట్టడి చేయాలని చూసింది. కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుని.. గోడు వెళ్లబోసుకునేందుకు బయల్దేరి వెళ్లిన మహిళల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన వారిపై లాఠీఛార్జ్‌ చేశారు. రాజధాని రైతులు.. జాతీయ రహదారి దిగ్బంధానికి ప్రయత్నించినపుడు.. వారపై లాఠీ ఝుళిపించారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన రైతులకూ లాఠీ దెబ్బలు తప్పలేదు. మందడంలో దీక్షాశిబిరం నుంచి నిరసనకారుల్ని వెళ్లగొట్టే ప్రయత్నంలో పోలీసుల దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డ విషయం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. మరణమే తమకు శరణ్యమంటూ... కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ.. రాష్ట్రపతికి రైతులు మూకుమ్మడి లేఖలు రాశారు. ఇటీవల మహిళా దినోత్సవాన... విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్న మహిళలపై పోలీసులు మరోసారి విరుచుకపడిన ఘటనలో చాలా మంది గాయపడ్డారు.

అమరావతి ఉద్యమాన్ని మహిళలే ముందుండి నడిపిస్తున్నారు. అవమానాలు, నిర్బంధాలు, లాఠీదెబ్బలు, కేసులు.. వేటికీ వెనుకడుగేయలేదు. దెబ్బతిన్నప్రతిసారీ రెట్టించిన సంకల్పంతో కదంతొక్కారు. శాంతియుతంగానే ఆందోళన కొనసాగిస్తూఉద్యమ వేడిని రగిలించారు. పాటలు, నాటికలు, ప్రసంగాలతో రోజుల తరబడి శిబిరాలను కాపాడుకుంటూ వచ్చారు. విజయవాడ-గుంటూరు మహిళలూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. విజయవాడతో పాటు కృష్ణా జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు.

సీఆర్​డీఏ చట్టం రద్దు, 3 రాజధానుల బిల్లులకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌.. గత ఏడాది జూలై 31న ఆమోదం తెలపడంతో.. రాజధాని రైతులు ఆందోళన ముమ్మరం చేశారు. రెండు చట్టాల్ని హైకోర్టులో సవాల్ చేయడంతో.... వాటిపై న్యయస్థానం స్టేటస్‌ కో విధించింది. రాజధాని అంశంపై ప్రభుత్వ నిర్ణయాల్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. రాజధాని ఉద్యమంలో ఇప్పటివరకు 3వేల మందికి పైగా.. కేసులు నమోదయ్యాయి. ఉద్యమం మొదలయ్యాక ఇప్పటి వరకు సుమారు 170 మంది దాకా రైతులు, కూలీలు వేదనతో మరణించినట్లు... ఐకాస నాయకులు, కుటుంబసభ్యులు వాపోతున్నారు.

అమరావతి ఉద్యమం 500రోజుకు చేరుకున్న సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీకి.. పలు రాజకీయ పార్టీలు, ఐకాస నేతలు లేఖలు రాశారు. ముఖ్యమంత్రి జగన్‌తో సంప్రదించి రైతుల త్యాగాలకు పోరాటాలకు పరిష్కారం చూపాలని విన్నవించారు.

ఇవీ చదవండి:నేడే మినీ పురపోరు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..!

ABOUT THE AUTHOR

...view details