తెలంగాణ

telangana

By

Published : May 31, 2021, 4:09 AM IST

ETV Bharat / city

cabinet decision: రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు ఏర్పాటు

ఆదాయ సమీకరణ కోసం భూములు విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, గృహనిర్మాణ సంస్థ వద్ద ఉన్న భూముల అమ్మకానికి తక్షణమే చర్యలు చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. పూర్తి ధాన్యం సేకరించకుండా కేంద్రం అనుచిత వైఖరిని అవలంభిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. భవిష్యత్ లో వరికన్నా పత్తికి ఎక్కువ లాభాలు వస్తాయని అంచనా వేసిన మంత్రివర్గం... కంది పంటను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖకు సూచించింది. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని, ఇందుకోసం తగిన స్థలాలను గుర్తించాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌కు మాజీ ప్రధాని పీవీ పేరు పెట్టాలని కేబినెట్ తీర్మానించింది.

మంత్రివర్గ నిర్ణయం
cabinet decision

రుతుపవనాలు ప్రారంభం కానున్న తరుణంలో వ్యవసాయం, పంటల సాగుపై మంత్రివర్గం చర్చించింది. నిరుడు రెండు పంటలు కలిపి మూడు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని సంతృప్తి వ్యక్తం చేసిన కేబినెట్... వానాకాలం కోసం రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచి సిద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తయారీ దారుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, హోం శాఖలు, నిఘా విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వ్వయసాయ శాఖలో రెండు అదనపు సంచాలకుల పోస్టులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రిమండలి... ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల కోసం తొమ్మిది నుంచి పది క్లస్టర్లను ఎంపిక చేయాలని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటు కోసం స్థలాలు గుర్తించాలని ఆదేశించింది.

రైతు వేదికలను కేంద్రంగా..

రైతుబంధు సమితులను కార్యాచరణలోకి తేవాలని, రైతు శిక్షణా కార్యక్రమాలను నిరంతరం జరపాలని మంత్రి వర్గం తెలిపింది. రైతు వేదికలను కేంద్రంగా చేసుకొని వ్యవసాయ శాఖ అధికారులు విధులు పర్యవేక్షించాలని, రైతులతో నిరంతరం సమావేశం కావాలని కేబినెట్ సూచించింది. వానాకాలంలో వరి, కంది, పత్తి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని... వరి నాట్లు కాకుండా వెదజల్లే పద్దతిని అవలంబించాలని రైతులకు మంత్రివర్గం పిలుపునిచ్చింది. ధాన్యం దిగుబడి పెరుగుతున్న తరుణంలో రాష్ట్రంలో రైస్ మిల్లులను మరింతగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని... ఇందుకోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

కేంద్రంపై అసంతృప్తి..

పూర్తి ధాన్యాన్ని సేకరించకుండా తెలంగాణ పట్ల కేంద్రం అనుచిత వైఖరి అవలంబిస్తోందని కేబినెట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయాలని నిర్ణయించారు. 87 శాతం ధాన్యం సేకరణ జరగడంపై సంతృప్తి వ్యక్తం చేసింది. నాలుగైదు రోజుల్లో మిగిలిన ధాన్యం సేకరణ పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించింది. పొరుగు రాష్ట్రాల్లో ఉప్పుడు బియ్యం డిమాండు రోజు రోజుకూ తగ్గుతున్న పరిస్థితుల్లో వరి కన్నా భవిష్యత్తులో పత్తికే ఎక్కువ లాభాలొస్తాయని అంచనా వేసింది. మార్కెట్లో డిమాండున్న నేపథ్యంలో కంది పంటను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖకు మంత్రిమండలి సూచించింది. రైతు బంధు ఆర్ధిక సాయాన్ని జూన్ 15 నుంచి 25 వరకు యాసంగి తరహాలో రైతులకు అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్నిఆమోదించింది. జూన్ 10 గడువు తేదీతో పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ లోకి మారిన భూముల వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖలకు స్పష్టం చేసింది. భూసారాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపింది.

కోల్పోతున్న ఆదాయాన్ని సమీకరించుకునేందుకు..

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. కరోనా కారణంగా రాష్ట్రం కోల్పోతున్న ఆదాయాన్ని సమీకరించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై భేటీలో చర్చించారు. ప్రభుత్వ భూములు, గృహ నిర్మాణ సంస్థ ఆధీనంలో ఉన్న భూములు, ఇళ్ల అమ్మకం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం తక్షణమే చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​ను కేబినెట్ ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లను మరో పదేళ్ల పాటు పొడిగించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో ఐదున్నర కిలోమీటర్ల మేర ఉన్న నెక్లెస్ రోడ్డుకు పీవీ నర్సింహారావు మార్గ్‌గా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ రాష్ట్రావతరణ దినోత్సవాలను అతి తక్కువ సంఖ్యలో హాజరై జరుపుకోవాలని నిర్ణయించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని కేబినెట్ తెలిపింది.

ఇవీ చూడండి:'రుతుపవనాల రాక రెండు రోజులు ఆలస్యం'

ABOUT THE AUTHOR

...view details