తెలంగాణ

telangana

ETV Bharat / city

Fuel Price Hike: మండుతున్న ఇంధన ధరలు.. బెంబేలెత్తుతున్న వాహనదారులు

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపు కొనసాగుతూనే ఉంది. పెరుగుదలకు ఇప్పట్లో బ్రేక్‌లు పడేట్లు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ అనంతపురంలో గరిష్ఠంగా పెట్రోల్‌ లీటరు ధర రూ.112.14కు చేరగా, డీజిల్‌ లీటరు ధర రూ.104.53కు చేరింది. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.15.21లు, డీజిల్‌పై రూ.14.22లు ధరలు పెరగడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.

By

Published : Oct 16, 2021, 7:12 AM IST

మండుతున్న ఇంధన ధరలు
మండుతున్న ఇంధన ధరలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు సంస్థలు ఇష్టారీతిన పెంచేస్తున్నాయి. ఇప్పటికే వంద దాటి పరుగులు తీస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కడ ఆగుతాయో తెలియని పరిస్థితి. హైదరాబాద్‌లో ఇవాళ పెట్రోల్‌ లీటరు ధర రూ.109.73లు కాగా, డీజిల్‌ లీటరు ధర రూ.102.80లకు చేరింది. ధరల పెరుగుదల వాహనదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రవాణా వ్యవస్థపైనా ఈ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వాహన అద్దెల దగ్గర నుంచి సరకు ధరల వరకు అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. పార్లమెంటు సమావేశాలు జరిగినన్ని రోజులు ఆగిన పెట్రోఉత్పత్తుల ధరల పెరుగుదల ఆ తరువాత మళ్లీ యథాతథంగా పరుగులు పెడుతున్నాయి.

వాళ్లకేం పట్టట్లేదు..

రోజువారీగా పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల ధరలు కూడా అధికంగానే ఉంటున్నాయి. ప్రతి రోజు పెరుగుతూ వస్తున్న ఈ ధరలు ఎప్పటి వరకు కొనసాగుతాయో....ఎక్కడ ఆగుతాయో....ఎవరికి అంతుపట్టని పరిస్థితి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.... ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌, రోడ్డు సెస్‌ల పేరుతో ఇష్ఠానుసారంగా పన్నులు విధించి ప్రజల సొమ్మును దోచేస్తున్నాయి. రవాణా వ్యవస్థపై పెట్రో ఉత్పత్తుల ప్రభావం తీవ్రంగా ఉన్నా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.

అనంతపురంలో గరిష్ఠ ధర..

సామాన్యుడిపై పెట్రో బాదుడు ఆగడం లేదు. చమురు సంస్థలు దసరా రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచాయి. అక్టోబరు నెలలో ఇప్పటి వరకు మూడు రోజులు మినహా మిగిలిన 12 రోజులు ధరలు పెరిగాయి. గడిచిన మూడు వారాల్లో డీజిల్‌ ధరలు 17 సార్లు..పెట్రోల్‌ ధరలు 14 సార్లు పెరిగాయి. తాజాగా ఇవాళ లీటర్‌ పెట్రోల్ 37 పైసలు‌, డీజిల్‌పై 38 పైసలు లెక్కన ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠంగా ఏపీలోని అనంతపురంలో పెట్రోల్‌ లీటరు ధర రూ.112.14కాగా, డీజిల్‌ లీటరు ధర రూ.104.53లుగా ఉంది.

హైదరాబాద్​లో పెట్రోల్ ధర ఎంతంటే..

తెలంగాణలో....హైదరాబాద్‌ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.73లుకాగా, డీజిల్‌ లీటరు ధర రూ.102.80లు ఉంది. జనగామలో పెట్రోల్‌ లీటరు ధర రూ.109.51కాగా డీజిల్‌ రూ.102.54గా ఉన్నట్లు చమురు సంస్థలు స్పష్టం చేశాయి. అదిలాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.111.63, డీజిల్‌ ధర రూ.104.52గా ఉంది. ఇక దేశ రాజధాని దిల్లీలో పెట్రోల రూ105.14, డీజిల్‌ ధర 93.87, ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.111.09, డీజిల్‌ ధర రూ.101.78, చెన్నైలో రూ.102.50 డిజిల్‌ ధర రూ.98.36, బెంగళూరు పెట్రోల్‌ ధర 108.80 ఉండగా డీజిల్‌ ధర 99.63గా ఉన్నట్లు చమురు సంస్థల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌ విపణిలో బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర 84.75 డాలర్లకు చేరింది. అంటే డాలరు మారకం విలువ డాలరు రూ. 74.96గా ఉంది. ఈ విలువ ఆధారంగా గురువారం 159లీటర్లు సామర్థ్యం కలిగిన బ్యారెల్‌ ముడి చమురు ధర రూ.6,535గా ఉంది. అంటే లీటరు ముడి చమురు రూ.39.95గా ఉండగా అటు పెట్రోల్‌, ఇటు డీజిల్‌గా ప్రాసెసింగ్‌ చేసేందుకు, ఫ్రైట్‌ ఛార్జీలు, ఇతరత్రా అన్ని కలుపుకుంటే మరో అయిదారు రూపాయిలు పెరిగి లీటరు రూ.45 నుంచి రూ.50 రూపాయలకు మించదు. ఇక్కడ నుంచి లీటరు పెట్రోల్‌పై రూ.32.90లు, డీజిల్‌పై రూ.31.80లు ఎక్సైజ్‌ డ్యూటీ, రోడ్‌ సెస్‌లను కేంద్రం విధిస్తోంది. పెట్రోల్‌ లీటరుపై రూ. 3.79లు, డీజిల్‌పై 2.59లు చమురు సంస్థలు డీలర్‌ కమిషన్‌ ఇస్తాయి. ఇటు రాష్ట్రాలు కూడా వ్యాట్‌ విధిస్తున్నందున ధరలు భారీగా పెరిగి సామాన్య మానవులపై మోయలేని భారంగా మారుతోంది.

ABOUT THE AUTHOR

...view details