తెలంగాణ

telangana

By

Published : Nov 27, 2020, 11:55 AM IST

ETV Bharat / city

'దిశ' ఘటనకు ఏడాది పూర్తి..

దిశ హత్యాచార ఘటనకు నేటితో ఏడాది పూర్తైంది. శంషాబాద్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే దిశను నలుగురు యువకులు అమానుషంగా అత్యాచారం చేసి... ఆ తర్వాత చటాన్​పల్లి వద్ద వంతెన కింద కాల్చేశారు. పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ తర్వాత ఘటనా స్థలంలో నుంచి వివరాలు సేకరిస్తుండగా... పోలీసులపై ఎదురు తిరిగారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితులు చనిపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రెండు ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక న్యాయ కమిషన్ ప్రస్తుతం విచారణ జరుపుతోంది.

one year completed for disha rape and murder incident at chatanpally
'దిశ' ఘటనకు ఏడాది పూర్తి.. విచారణలో కేసు

గతేడాది డిసెంబర్ నవంబర్ 27న రాత్రి 9 గంటల సమయంలో దిశ దారుణ హత్యకు గురైంది. సాయంత్రం శంషాబాద్​లో తన ఇంటి నుంచి బయల్దేరి తొండుపల్లి బాహ్యవలయ రహదారి వద్దకు చేరుకున్న దిశ... తన ద్విచక్ర వాహనాన్ని రహదారి పక్కనే నిలిపి... చికిత్స కోసం క్యాబ్​లో గచ్చిబౌలికి వెళ్లింది. అనంతరం రాత్రి 9 గంటలకు తిరిగి క్యాబ్​లో తొండుపల్లి గేట్ వద్దకు చేరుకుంది. దిశ వెళ్లే సమయంలోనే గమనించిన నిందితులు ప్రణాళిక ప్రకారం ఆమె ద్విచక్ర వాహనం వెనక టైరులో గాలి తీసేశారు. ద్విచక్ర వాహనం వద్దకు చేరుకున్న దిశ గాలి లేని విషయాన్ని గమనించి అక్కడే ఆగిపోయింది.

పథకం ప్రకారమే..

నలుగురు నిందితుల్లో ఓ యువకుడు అక్కడికి చేరుకొని టైరులో గాలి నింపుకొని వస్తానని అక్కడి నుంచి బయల్దేరాడు. చాలా సేపటికి కానీ అతడు రాలేదు. ఆ లోపు మిగతా ముగ్గురు దిశను బలవంతంగా జాతీయ రహదారి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి... ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. బలంవంతంగా నోట్లో మద్యం కూడా పోశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన దిశ ముక్కు నోరు మూసి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. అనంతంరం మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి లారీలో చటాన్​పల్లికి తీసుకెళ్లారు. వంతెన కింద మృతదేహాన్ని కాల్చివేశారు. 28వ తేదీ తెల్లవారుజామున అటు నుంచి వెల్తున్న వ్యక్తి కాలిపోతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా... విషయం వెలుగులోకి వచ్చింది

ఎదురుకాల్పుల్లో..

నారాయణపేటకు చెందిన ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్ కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. కస్టడీలోకి తీసుకొని నిందితుల నుంచి వివరాలు సేకరించేందుకు డిసెంబర్ 6 తెల్లవారుజామున ఘటన స్థలానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితులు తప్పించుకొని, పోలీసు చేతిలో ఉన్న తుపాకులను లాక్కొని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినట్టు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఆ సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మృతి చెందినట్టు సీపీ సజ్జనార్ అప్పట్లో వెల్లడించారు. దిశ హత్యాచార ఘటన, నిందితుల ఎన్​కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పలువురు మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించాయి. ఎన్​కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు గతేడాది డిసెంబర్ 12న ముగ్గురు సభ్యులతో న్యాయ కమిషన్ ఏర్పాటు చేసి ఆర్నెళ్ల గడువు విధించింది.

గడువు పెంపు

ఈ ఏడాది ఫిబ్రవరి 3న త్రిసభ్య కమిషన్​ విచారణ ప్రారంభించింది. దిశ కుటుంబ సభ్యులు, ఎన్​కౌంటర్​లో చనిపోయిన కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించింది. ఎన్​కౌంటర్​లో పాల్గొన్న పోలీసులతో పాటు... పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులను, వైద్యులను ప్రశ్నించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి నివేదికను తీసుకుంది. మార్చి నెలలో మరోసారి విచారణ జరపాల్సి ఉండగా... లాక్​డౌన్ వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఆన్​లైన్​లో అఫిడవిట్లు దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించగా... దాదాపు 1,300 అఫిడవిట్లు దాఖలయ్యాయి. తెలుగులో ఉన్న వీటన్నింటిని ఆంగ్లంలోకి అనువదించారు. కానీ విచారణను ఆన్​లైన్​ నిర్వహించకూడదని భావించి... మరో ఆర్నెళ్ల గడువు పొడిగించాలని సుప్రీంకోర్టను కోరింది. దీంతో గడువు పొడిగిస్తూ న్యాయస్థానం జులైలో ఉత్తర్వులు జారీ చేసింది.

ఘటనపై సినిమా

ప్రస్తుతం న్యాయ కమిషన్ విచారణ జరుగుతోంది. దిశ ఉదంతాన్ని సినిమా రూపంలో రాంగోపాల్ వర్మ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని దిశ కుటుంబ సభ్యులతో పాటు... నిందితుల కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం కూడా న్యాయస్థానంలో ఉంది. దిశ ఎన్​కౌంటర్ తర్వాత మూడు కమిషనరేట్ల పరిధిలోనూ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బాహ్యవలయ రహదారితో పాటు... జాతీయ రహదారిపైనా గస్తీ వాహనాలు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. ఆపదలో ఉన్న మహిళలు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

ఇదీ చూడండి:కొవిడ్​ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం- ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details