తెలంగాణ

telangana

By

Published : Jun 21, 2021, 9:06 AM IST

ETV Bharat / city

Engineering‌ Colleges: జాడలేని కొత్త ఇంజినీరింగ్‌ కళాశాలలు

రాష్ట్రంలో కొత్త ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను నియమించి ఏళ్లు గడుస్తున్నా.. అడుగు ముందుకు పడలేదు. నివేదికలు తీసుకున్న సర్కారు సిఫారస్సులు మాత్రం నేటికి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు విశ్వవిద్యాలయాల పరిధిలో 9 ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు మాత్రమే ఉన్నాయి.

Establishment of new engineering colleges in Telangana
తెలంగాణలో కొత్త ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇంజినీరింగ్‌ విద్యకు సంబంధించి కొత్తగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో సర్కారు కమిటీలను నియమించింది. నివేదికలను తీసుకుంది. సిఫార్సులు మాత్రం నేటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షకుపైగా బీటెక్‌ సీట్లుండగా అందులో ప్రభుత్వ కళాశాలల్లో కేవలం 3,050 మాత్రమే ఉండటం గమనార్హం. జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో నాలుగు, కేయూ కింద రెండు, ఓయూలో రెండు, మహాత్మాగాంధీ వర్సిటీలో ఒక ప్రభుత్వ కళాశాల మాత్రమే ఉంది.

*కాకతీయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఉన్న మైనింగ్‌ కళాశాల (యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌)ను పూర్తిస్థాయి కళాశాల లేదా ప్రత్యేక విశ్వవిద్యాలయంగా మార్చాలన్న డిమాండ్‌ కార్యరూపం దాల్చలేదు. ఆచార్య వీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ కమిటీ 2016లో నివేదికిచ్చింది. 390 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. అయిదేళ్లవుతున్నా మోక్షం లేదు.

*పదో తరగతిలో 10 జీపీఏ పొందుతున్న పేద విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నందున బాసరకు తోడు మరో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ)ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉంది. దాన్ని వనపర్తిలో ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి నేతృత్వంలో 2018లో కమిటీని నియమించింది. రూ.700 కోట్ల నిధులు, 250 ఎకరాల స్థలం కావాలని ఆ కమిటీ నివేదికిచ్చింది. మూడేళ్లయినా సర్కారు నిర్ణయం తీసుకోలేదు.

*చేనేత పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్ల జిల్లాలో జేఎన్‌టీయూహెచ్‌కు అనుబంధంగా ఇంజినీరింగ్‌ కళాశాలను నెలకొల్పి ప్రత్యేక కోర్సులను అందించాలని ప్రభుత్వం భావించింది. సంప్రదాయ కోర్సులతో పాటు టెక్స్‌టైల్‌ టెక్నాలజీ లాంటి స్థానిక అవసరాలకు అనువైన కోర్సులను ప్రవేశపెట్టవచ్చని 2019లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సిఫార్సు చేసింది. 2019-20 విద్యా సంవత్సరంలోనే తాత్కాలికంగా పాలిటెక్నిక్‌ కళాశాలలో తరగతులు మొదలుపెట్టాలని యోచించారు. ఆ ఏడాది నెరవేరలేదు. గత ఏడాదీ లేదు. ఈ సారీ(2021-22 విద్యా సంవత్సరం) అనుమానమే.

*కోఠిలోని మహిళా కళాశాలనే విశ్వవిద్యాలయంగా మార్చాలని నాటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి భావించారు. కేంద్రం కూడా రూ.50 కోట్లు మంజూరు చేసేందుకు సుముఖంగా ఉండటంతో ఆయన 2018లో ఆ కళాశాలను సందర్శించి పరిశీలించారు. రాష్ట్రీయ ఉచ్ఛతార్‌ శిక్షా అభియాన్‌(రూసా) రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ అయిన కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఆ తర్వాత పురోగతి లేదు.

ఇదీ చదవండి:తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించాం: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details