హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల కురిసిన వర్షానికి జలమయమైన ముషీరాబాద్ నియోజకవర్గం లోతట్టు ప్రాంతాలను ఆయన సందర్శించారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో నాగమయ్య కుంట ప్రాంతంలో పర్యటించారు.
ప్రతి వర్షాకాలంలో ఇళ్లలోకి వరద నీరు వస్తోందంటూ బాధితులు కిషన్రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆర్థిక సాయం చేయాలని మంత్రికి విన్నవించారు. సామాన్యుల ఇళ్ల నిర్మాణం కోసం సుమారు రెండు లక్షల దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని కిషన్రెడ్డి తెలిపారు. త్వరలో వీటిపై చర్చించి, బ్యాంకర్లతోనూ సమావేశం నిర్వహిస్తామన్నారు.