Harishrao Fires on Bjp: ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మునుగోడు ప్రజలు మరువరని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మునుగోడులో ప్రజలు గెలవాలా..? రాజగోపాల్ రెడ్డి ధనం గెలవాలా..? అంటూ హరీశ్ ప్రశ్నించారు. మునుగోడులో భాజపా నేతలు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పకుండా.. నేతలను కొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. క్షుద్రపూజలంటూ మాట్లాడటం దారుణమన్న ఆయన.. తాంత్రిక విద్యలపై కోర్సులు పెట్టింది భాజపానే అని మండిపడ్డారు. తెరాస దగ్గర ఉన్నవి లోక్ తాంత్రిక విద్యలు అని పేర్కొన్నారు. తెరాస ఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో హరీశ్రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
'మునుగోడు ఉపఎన్నికలో భాజపా దుర్వినియోగానికి పాల్పడుతోంది. నేతలను కొనుగోలు చేయడమే కాకుండా కార్లు, బైకులు కొంటున్నారు. 200 కార్లు, 2వేల బైకులు బుక్ చేసినట్లు మా వద్ద సమాచారం ఉంది. ఇప్పుడు మోటార్లు ఇస్తారు.. రేపు మీటర్లు పెడతారు. మునుగోడులో ప్రధానంగా తెరాస- భాజపా మధ్య పోటీ. దేశ ప్రజల కోసం భాజపా ఒక్క మంచి పనైనా చేసిందా? క్షుద్ర పూజలు చేయడం భాజపాకు అలవాటు. తెరాసది ఉద్యమ చరిత్ర, భాజపాది రక్తచరిత్ర. బనారస్ కళాశాలలో బూత వైద్యం నేర్పించే చరిత్ర భాజపాది. 8 ఏళ్లలో 1.52 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ ఏడాది మరో 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం.'- హరీశ్రావు, ఆర్థిక శాఖ మంత్రి