తెలంగాణ

telangana

By

Published : Jan 2, 2021, 7:07 AM IST

ETV Bharat / city

70లక్షల మందికి టీకాలు ఇవ్వడమే సవాల్

కొవిడ్‌ టీకా త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో.. తొలివిడత టీకాల పంపిణీలో అర్హులైన వారిని గుర్తించి టీకాను అందించడం సవాలుగా మారింది. టీకా మొదలుపెట్టిన తొలి 7-10 రోజుల్లోనే రాష్ట్రంలో తొలివిడత లబ్ధిదారులందరికీ ఇవ్వాలని తొలుత ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం 10 వేల కేంద్రాలు.. 10 వేల బృందాలు.. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులు.. ఒక్కో బృందం రోజుకు 80-100 చొప్పున టీకాలు వేయడం.. అలా ఒక్కరోజులోనే 8 లక్షల నుంచి 10 లక్షల వరకూ టీకాల పంపిణీ నిర్వహించడం.. ఇలా 7-10 రోజుల్లో 75 లక్షల మందికి పూర్తిగా తొలివిడతలో తొలిడోసు పూర్తి చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ ప్రణాళిక కాగితంపై పటిష్ఠంగానే కనిపిస్తున్నా.. ఆచరణలో సాధ్యం కాదనేది ప్రస్తుత పరిస్థితులను బట్టి తేటతెల్లమైంది.

వైద్యారోగ్య శాఖ తర్జనభర్జన.
వైద్యారోగ్య శాఖ తర్జనభర్జన.

కొవిడ్‌ టీకా త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో.. తొలివిడత టీకాల పంపిణీలో అర్హులైన వారిని గుర్తించి టీకాను అందించడం సవాలుగా మారింది. ఇప్పటివరకూ ప్రభుత్వ, ప్రైవేటు వైద్యంలో పనిచేస్తున్న సిబ్బంది సమాచారంలో మాత్రమే స్పష్టత ఉంది. ఇంకా పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, తదితర ముందు వరుసలో(ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌) నిలిచే ఇతర సిబ్బంది సమాచారాన్నీ సేకరిస్తున్నారు. ఈ రెండు కేటగిరీలు కలిపితే సుమారు 5 లక్షల మంది ఉంటారని అంచనా. అసలు సమస్యంతా 50 ఏళ్లు పైబడిన వారిని, 18-50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించడంలోనే ఎదురవుతోంది. రాష్ట్రంలో ఈ రెండు కేటగిరీల అర్హులు సుమారు 70 లక్షల మంది(సుమారు 93 శాతం) ఉండటం గమనార్హం. ఈనెల రెండోవారం నుంచే టీకా పంపిణీ చేసే అవకాశాలున్నాయని సంకేతాలు అందుతుండటంతో.. ఈ కేటగిరీల వారికి టీకాలు ఇవ్వడమెలా? అనే విషయంపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తర్జనభర్జన పడుతోంది. గురువారం కేంద్ర ఉన్నతాధికారులతో జరిపిన దృశ్యమాధ్యమ సమీక్షలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. శుక్రవారం కూడా ఉన్నత స్థాయిలో సమీక్షించినట్లు తెలిసింది.

సేకరణ ఎందుకు కష్టం?

50 ఏళ్లు పైబడినవారి సమాచారం నిర్దిష్టంగా ఒకచోట లభ్యం కాదు. దీనికోసం ఓటరు కార్డు వివరాలను సేకరించాలని భావిస్తున్నారు. ఓటరు కార్డులో ఉన్న చిరునామాలో అత్యధికులు నివాసముండే పరిస్థితి లేదు. గ్రామాల్లో ఓటరు కార్డు ఉంటుంది కానీ.. వారు పట్టణాలు, నగరాల్లో నివాసముంటున్నారు. ఓటరు కార్డు నమోదు చేసుకున్నప్పుడు నివాసమున్నప్పుడు అద్దె ఇళ్లలో ఉన్నవారు ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఓటరు కార్డులో వయసు ప్రాతిపదికన కొవిడ్‌ టీకా లబ్ధిదారుడిని గుర్తించడం కష్టతరమైన ప్రక్రియ అని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇదే కోవలో 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల సమాచార సేకరణ కష్టమనే భావన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వైద్య పథకాల్లో భాగంగా అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్‌ తదితర వ్యాధులకు చికిత్సలు పొందుతున్న 18-50 ఏళ్లలోపు వ్యక్తుల సమాచారం ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఈ విధానంలో కొందరిని గుర్తించడానికి అవకాశం ఉన్నా.. వీరి సంఖ్య స్వల్పంగానే ఉంటుందని వైద్యవర్గాలు తెలిపాయి.

టీకాలు కనీసం ఆర్నెల్లపాటు..

టీకా మొదలుపెట్టిన తొలి 7-10 రోజుల్లోనే రాష్ట్రంలో తొలివిడత లబ్ధిదారులందరికీ ఇవ్వాలని తొలుత ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం 10 వేల కేంద్రాలు.. 10 వేల బృందాలు.. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులు.. ఒక్కో బృందం రోజుకు 80-100 చొప్పున టీకాలు వేయడం.. అలా ఒక్కరోజులోనే 8 లక్షల నుంచి 10 లక్షల వరకూ టీకాల పంపిణీ నిర్వహించడం.. ఇలా 7-10 రోజుల్లో 75 లక్షల మందికి పూర్తిగా తొలివిడతలో తొలిడోసు పూర్తి చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ ప్రణాళిక కాగితంపై పటిష్ఠంగానే కనిపిస్తున్నా.. ఆచరణలో సాధ్యం కాదనేది ప్రస్తుత పరిస్థితులను బట్టి తేటతెల్లమైంది. 50 ఏళ్ల పైబడినవారు.. ఆ వయసులోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల జాబితానే ఇప్పటివరకూ సిద్ధంగా లేనప్పుడు.. వారిని ఇంత తక్కువ సమయంలో టీకా కేంద్రాల వద్దకు తోడ్కొని రావడం కూడా కష్టసాధ్యమేననే భావన వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం.. టీకా పొందే ప్రతి వ్యక్తి సమాచారాన్ని కొవిన్‌ యాప్‌లో ముందుగా నమోదు చేసుకోవాలి. ఇప్పటికీ స్వీయ నమోదుకు వీలుగా కొవిన్‌ యాప్‌ సాధారణ ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఈ సవాళ్లను అధిగమించి, నిర్దేశిత గడువులోగా 75 లక్షల మందికి టీకాలందించడం సాధ్యమయ్యే పనికాదని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఏం చేయనున్నారు?

  • రాష్ట్రంలో టీకాలకు అనుమతి లభించగానే తొలుత వైద్యఆరోగ్యశాఖ సిబ్బందికి, పోలీసులు, పారిశుద్ధ్య, ఇతరులకు కొవిడ్‌ టీకాలను అందిస్తారు.
  • 50 ఏళ్ల పైబడినవారు, ఆలోపు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిలో గుర్తించిన వారికీ ఇస్తారు.
  • కొవిన్‌ యాప్‌ సాధారణ ప్రజలకు అందుబాటులోకి రాగానే.. అందులో స్వీయ నమోదును ప్రోత్సహిస్తారు. అందుకు అవసరమైన ప్రచారాన్ని, అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తారు.
  • ఇతర శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఓటరు కార్డు ద్వారా లబ్ధిదారుల సమాచార సేకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.
  • పల్లెల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి అర్హులైన వారిని గుర్తించి, టీకాలు పొందడానికి ప్రోత్సహించి, కేంద్రాలకు తీసుకొస్తారు.
  • కొవిన్‌ యాప్‌లో వారి సమాచారాన్ని ఆరోగ్య కార్యకర్తలే పొందుపరుస్తారు.
  • తొలివిడతలో 75 లక్షల లబ్ధిదారులందరికీ తొలిడోసు పూర్తికావడానికే ఆర్నెల్లు పడితే.. రెండో డోసు పూర్తవడానికి మరో రెండు నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
  • స్వీయ నమోదుపై ఎక్కువమందికి అవగాహన కల్పించడం ద్వారా త్వరితగతిన టీకా ప్రక్రియ పూర్తిచేసే అవకాశాలుంటాయని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
  • టీకాలు పొందే వారిలో 93 శాతం మంది వీరే
  • తొలివిడతలో సుమారు 75 లక్షల మంది.
  • వీరిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ వైద్యులు, ఆరోగ్య సిబ్బందిలో ఇప్పటివరకూ కచ్చితంగా గుర్తించింది 2.88 లక్షలు. వీరు 3 లక్షల మంది వరకూ ఉంటారని అంచనా.
  • పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, రవాణా ఉద్యోగులు తదితరులు 2 లక్షల మంది.
  • 50 ఏళ్లు దాటినవారు సుమారు 64 లక్షల మంది.
  • 18-50 ఏళ్లలోపు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు 6 లక్షల మంది.

ఇవీ చూడండి:హైదరాబాద్, మహబూబ్​నగర్‌లలో 7 కేంద్రాల్లో డ్రైరన్ ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details