తెలంగాణ

telangana

ETV Bharat / city

మినీ పట్టణాల ఏర్పాటుకు హెచ్​ఎండీఏ కసరత్తు

రాష్ట్రవ్యాప్తంగా మినీ పట్టణాలు ఏర్పాటు చేసేందుకు... హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ-హెచ్​ఎండీఏ సంకల్పించింది. రైతుల నుంచి భూసేకరణ చేసి ఏర్పాటు చేసే వెంచర్లలో భారీ నిర్మాణాలు చేపట్టాలని ప్రణాళికలు రచిస్తోంది.

By

Published : Feb 11, 2020, 10:58 AM IST

hmda plans to mini town in telangana wide
మినీ పట్టణాల ఏర్పాటుకు హెచ్​ఎండీఏ కసరత్తు

అత్యాధునిక సౌకర్యాలతో రాష్ట్ర నలువైపులా మినీ పట్టణాలు ఏర్పాటు చేయాలన్న హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ సంకల్పానికి... రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో రైతులు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు.

భూ సమీకరణ ద్వారా అత్యాధునిక వెంచర్లు వేసి అందులో భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టేందుకు హెచ్​ఎండీఏ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే ఆరుచోట్ల తమ భూములు సమీకరణ కింద ఇవ్వడానికి రైతులు సంసిద్ధత వ్యక్తం చేశారు.

గత కొంతకాలంగా స్థిరాస్తి వ్యాపారం రాష్ట్రంలో ఊపందుకున్నందున... రాష్ట్రంలో అనేక వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. పూర్తిస్థాయిలో అనుమతులు లేకుండానే అడ్డగోలుగా ప్రైవేటు వ్యక్తులు వెంచర్లు వేసి ఇళ్ల స్థలాలను అమ్మేస్తున్నారు.

ఆ తర్వాత వివిధ వివాదాల వల్ల ఈ స్థలాల్లో ఇళ్లను నిర్మించుకునే అవకాశం లేకపోవడం వల్ల వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెచ్‌ఎండీఏ వెంచర్లు వేస్తే ఈ ఇబ్బంది ఉండదని అనేకమంది ఈ సంస్థపై గత కొన్నేళ్లగా ఒత్తిడి తెస్తున్నారు.

50 ఎకరాలు ఇస్తే...

ఉత్తర్‌ప్రదేశ్‌లో నగరాభివృద్ధి సంస్థ భూసమీకరణ ద్వారా మినీ పట్టణాలను విజయవంతంగా నిర్మిసోంది. అదే తరహాలో హెచ్‌ఎండీఏ పరిధిలోని... హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించింది.

పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాత అందులో స్థలాలను భూములు ఇచ్చిన వారికి ఇస్తామంటూ అధికారులు ఇటీవలే నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎక్కడైనా 50 ఎకరాలు.. ఆపైన ఈ ఇస్తే చాలు వెంచర్‌ వేయడానికి సిద్ధమని అధికారులు ప్రకటించారు.

ముందుకొస్తున్న రైతులు

రంగారెడ్డి జిల్లా మోకిల, మేడ్చల్‌ జిల్లా కొర్రేముల, ప్రతాపసింగారం గ్రామాల్లో వంద ఎకరాల నుంచి 250 ఎకరాల వరకు ఇవ్వడానికి రైతులు ముందుకు వచ్చారు. అభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది.

రైతులతో ఒప్పందం చేసుకుని వెంచర్లను వేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మల్కాపురంలో 170 ఎకరాలు, మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం భోగాపురంలో 100, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరులో 60 ఎకరాలు ఇవ్వడానికి రైతులు ముందుకు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.

ఇక్కడే కాకుండా హెచ్‌ఎండీఏ పరిధిలో ఏడు జిల్లాల్లో మరో 10 చోట్ల రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

అభివృద్ధి చేసి...

* భూ సమీకరణ తర్వాత సంబంధిత ప్రాంతాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసి ఒప్పందం మేరకు రైతులకు నిర్దేశించిన స్థలాన్ని హెచ్‌ఎండీఏ అందజేయనుంది.

* మిగిలిన స్థలంలో హెచ్‌ఎండీఏ నేరుగా గానీ, ప్రైవేటు నిర్మాణ సంస్థ ద్వారా గానీ భవన నిర్మాణాలు చేపట్టాలని భావిస్తోంది. బహుళ అంతస్తులు నిర్మించి వేలాది మంది నివాసం ఉండేలా చేయాలన్నది అధికారుల ఉద్దేశం.

* షాపింగ్‌ మాల్‌, రైతు బజార్‌తోపాటు ఇతరత్రా అనేక సౌకర్యాలను కల్పించాలనుకుంటున్నారు.

* భూసమీకరణ ద్వారా చేపట్టే ప్రాజెక్టులకు ఎటువంటి ఆదరణ ఉంటుందన్న దానిపై ఇటీవల ఒక సర్వే చేస్తే వేలాది మంది ఇందులో స్థలాలు, ఫ్లాట్లు కొనడానికి పెద్దఎత్తున ముందుకు వచ్చినట్లు తేలింది.

* నాగోలు మెట్రో స్టేషన్‌ పక్కనే ఉన్న స్థలాన్ని ఇండ్ల స్థలాలుగా మార్చి విక్రయిస్తే ఇప్పటి వరకు హెచ్‌ఎండీఏకే రూ.1,000 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. భూసమీకరణ ద్వారా వేసే వెంచర్లకు కూడా ఇలానే పెద్దఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ అనుకుంటున్నారు.

ఇదీ చూడండి:నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం... పాలనపై దిశానిర్దేశం

ABOUT THE AUTHOR

...view details