తెలంగాణ

telangana

హైదరాబాద్‌లో అందుబాటులోకి మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌ హాళ్లు..

By

Published : Oct 11, 2020, 5:50 AM IST

హైదరాబాద్ నగరంలో వేడుకలు చేసుకోవాలంటే ఫంక్షన్ హాళ్లకు లక్షల రూపాయలు కట్టాల్సిందే. అయితే గ్రేటర్‌లోని బస్తీ వాసులు, ఇతర పేదల వర్గాల వారికి ఇంత భారీగా ఖర్చు పెట్టే ఆర్థిక స్థోమత ఉండదు. ఇలాంటి వారికోసం జీహెచ్​ఎంసీ మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌హాళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సకల సౌకర్యాలతో, నామమాత్రపు అద్దెతో.. వినియోగించుకునేందుకు వీలుగా వీటిని తయారు చేస్తోంది. ఇప్పటికే నగరంలో రెండు హళ్లు అందుబాటులోకి రాగా... త్వరలో మరికొన్ని అందుబాటులోకి రానున్నాయి.

హైదరాబాద్‌లో అందుబాటులోకి మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌హాళ్లు..
హైదరాబాద్‌లో అందుబాటులోకి మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌హాళ్లు..

హైదరాబాద్‌లో అందుబాటులోకి మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌ హాళ్లు..

గ్రేటర్ హైదరాబాద్ అంతా ఇరుకు గల్లీలే. ఎక్కడా కొంచెం ఖాళీ స్థలం కూడా కనిపించదు. నగరవాసులు ఎలాంటి చిన్న వేడుక చేసుకోవాలన్నా.. ఫంక్షన్ హాళ్ల వైపు చూడాల్సిందే. వాటికి రూ.వేలు, లక్షల్లో ఖర్చు పెట్టాలి. అయితే దిగువ మధ్యతరగతి, పేద వారికి అంత ఆర్థిక స్తోమత ఉండదు. అలాంటి వారికోసం గ్రేటర్‌ హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ జంట నగరాల్లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. నామమాత్రపు ఖర్చుతో సకల సౌకర్యాలతో కూడిన వివాహ వేదికలు ఒక్కొక్కటిగా పేదలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఫంక్షన్ హాళ్లలో అద్దంలా మెరిసే ఫ్లోరింగ్‌, కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలు, విశాలమైన వేదిక ప్రాంగణం, వాహనాలకు పార్కింగ్‌ వసతి, వంట గదులు, వధూవరులు, బంధుమిత్రులకు విశ్రాంతి గదులు, ఇతరత్రా సౌకర్యాలతో వీటిని నిర్మిస్తున్నారు.

రూ.90 కోట్లతో 31 ఫంక్షన్‌ హాళ్లు..

గ్రేటర్​ పరిధిలో రూ.90 కోట్లతో 31 ఫంక్షన్‌ హాళ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భూవివాదాలతో ప్రారంభంలోనే 12 ప్రతిపాదనలు నిలిచిపోయాయి. రూ.43 కోట్లతో 19 ఫంక్షన్‌ హాళ్ల పనులు మొదలయ్యాయి. ఇందులో సైతం పలు కారణాలతో నాలుగు ఫంక్షన్ హాళ్లు రద్దయ్యాయి. ఇక మిగిలింది 15 లో ఇప్పటికే రెండు వినియోగంలోకి రాగా... మరో 9 హాళ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో పనులు యుద్దప్రాతిపాదికన సాగుతున్నాయని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. నిధుల సమస్య లేదని... పనుల్లో మరింత వేగం పెంచి ఈ ఏడాది చివరకు వీలైనన్ని ఎక్కువ ఫంక్షన్‌హాళ్లను గ్రేటర్ వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు పద్మారావు గౌడ్ తెలిపారు.

ఉప కమిషనర్లకు రుసుము చెల్లించి..

నగరంలోని బన్సీలాల్‌పేట, పటాన్‌చెరులోని చైతన్యనగర్‌లో ఫంక్షన్‌హాళ్లు అందుబాటులోకి వచ్చాయి. సీతాఫల్‌మండి టీఆర్టీ కాలనీలో అన్ని హంగులతో మరో హాల్‌ అందుబాటులోకి రానుంది. ఫంక్షన్ హాళ్లు అద్దెకు కావాలంటే ఉప కమిషనర్లకు రుసుము చెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుంది.

ఇవీ చూడండి:ఎల్ఆర్ఎస్‌కు కొనసాగుతున్న దరఖాస్తుల వెల్లువ

ABOUT THE AUTHOR

...view details