తెలంగాణ నుంచి బియ్యం సేకరణను భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) నిలిపివేసింది. అందుకు కారణాలను పేర్కొంటూ అది రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాయటం సంచలనంగా మారింది. ‘మిల్లుల్లో పెద్దగా ధాన్యం నిల్వలు లేవు. కొన్నిచోట్ల నిల్వలున్నా లెక్కించేందుకు అనువుగా లేవు. అక్రమాలకు పాల్పడిన మిల్లులపై చర్యలు తీసుకోవాల్సిందిగా లేఖలు రాసినా స్పందన లేదు. కరోనా నేపథ్యంలో కేంద్రం పేదలకు ఉచిత బియ్యం ఇస్తోంది. రాష్ట్రంలో రెండు నెలలుగా ఆ బియ్యం పంపిణీ జరగటం లేదు. ఈ నేపథ్యంలో బియ్యం సేకరణ ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాం’ అంటూ తెలంగాణ సర్కారుకు ఎఫ్సీఐ లేఖ రాసింది. గత యాసంగికి సంబంధించి సుమారు 4.40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి ఎఫ్సీఐకి అందాల్సి ఉంది. ఆ బియ్యం ఇచ్చేందుకు గడువు ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు తాజాగా కేంద్రం ఆ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది. బియ్యం సేకరణను నిలిపివేస్తున్నట్లు ఎఫ్సీఐ మంగళవారం లేఖ రాసింది. 2020-21 యాసంగి బియ్యమా? 2021-22 వానాకాలం బియ్యం సేకరణనూ నిలిపివేస్తుందా? అన్నది లేఖలో స్పష్టం చేయలేదు.
1.39 లక్షల బస్తాల ధాన్యం మాయం..
2020-21 యాసంగి, వానాకాలానికి సంబంధించిన 1,37,872 బస్తాల ధాన్యం నిల్వలు లేవు. యాసంగికి సంబంధించి 12 మిల్లుల్లో 18,621 బస్తాలు.. వానాకాలం సీజనుకు 63 మిల్లుల్లో 1,19,251 బస్తాల ధాన్యం నిల్వలు లేకపోవటాన్ని క్షేత్రస్థాయి తనిఖీల్లో గుర్తించాం. మొత్తంగా 593 మిల్లుల్లో ధాన్యం నిల్వలు లెక్కించేందుకు వీలుగా లేవు. గతంలోనూ 40 మిల్లుల పరిధిలో 4,53,896 బస్తాల నిల్వలు తనిఖీ సమయంలో లేకపోవటాన్ని గుర్తించాం. మిల్లుల వారీగా వివరాలను నివేదిక రూపంలో పంపాం. లెక్కించేందుకు వీలుగా ధాన్యం నిల్వలను సిద్ధం చేయిస్తామంటూ మీ నుంచి లేఖ అందినా.. క్షేత్రస్థాయిలో ఏమాత్రం మార్పు లేదు.. బియ్యం నిల్వలు తక్కువగా ఉన్న మిల్లులపై కఠిన చర్యలు తీసుకునేందుకు చాలా వ్యవధి ఇచ్చినా ఎలాంటి ఫలితం కనిపించలేదు.